క్యాన్సర్ వచ్చినా… ముందుగా గుర్తిస్తే ప్రాణాలు కాపాడొచ్చు

క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడం వల్ల చికిత్స సులువవుతుందని, రోగి ఆయుష్షు పెరుగుతుందని యశోద హాస్పిటల్స్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జి. వంశీకృష్ణ రెడ్డి తెలిపారు. రొమ్ము, గర్భాశయ, పేగు, ఊపిరితిత్తుల క్యాన్సర్లను ముందస్తు స్క్రీనింగ్ ద్వారా ఎలా అరికట్టవచ్చో ఆయన వివరించారు.

Published on: Aug 25, 2026, 16:32:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

క్యాన్సర్ అనగానే ఎంతోమంది భయాందోళనకు గురవుతారు. కానీ ఈ మహమ్మారిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించి నయం చేసే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శరీరంలోని ఇతర భాగాలకు పాకక ముందే వ్యాధిని పసిగట్టినప్పుడు, తక్కువ మోతాదు చికిత్సతోనే రోగి ఎక్కువ కాలం జీవించే అవకాశాలు పెరుగుతాయి. రొమ్ము, గర్భాశయ, పెద్దపేగు, ఊపిరితిత్తుల క్యాన్సర్ల విషయంలో ముందస్తు పరీక్షలు (స్క్రీనింగ్), నివారణ చర్యలు ఎంతో మేలు చేస్తాయి.

క్యాన్సర్ వచ్చినా… ముందుగా గుర్తిస్తే ప్రాణాలు కాపాడొచ్చు
క్యాన్సర్ వచ్చినా… ముందుగా గుర్తిస్తే ప్రాణాలు కాపాడొచ్చు

రొమ్ము క్యాన్సర్: ముందస్తు స్క్రీనింగ్ అత్యవసరం

ప్రపంచవ్యాప్తంగా మహిళలను వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో రొమ్ము క్యాన్సర్ ఒకటి. తొలి దశలో దీన్ని గుర్తిస్తే చికిత్స అందించడం చాలా సులభం. మమోగ్రఫీ (Mammography) పరీక్ష ద్వారా కణితులు చిన్నగా ఉన్నప్పుడే పసిగట్టవచ్చు. క్యాన్సర్ రకం, దశ ఆధారంగా సర్జరీ లేదా టార్గెటెడ్ థెరపీ వంటి వైద్య పద్ధతులతో తక్కువ శ్రమతోనే దీనికి పరిష్కారం లభిస్తుంది.

రొమ్ములో కొత్తగా గడ్డలు రావడం, వాపు కనిపించడం, ఆకారంలో మార్పులు లేదా చనుమొనల్లో ఏవైనా తేడాలు గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్: టీకాతో నివారణ సాధ్యం

గర్భాశయ ముఖద్వార (సర్వికల్) క్యాన్సర్‌ను ప్రారంభంలోనే గుర్తించడమే కాకుండా, రాకుండా పూర్తిగా నివారించే అవకాశం ఉంది. హెచ్‌పీవీ (HPV) టెస్ట్, పాప్ స్మియర్ (Pap test) వంటి స్క్రీనింగ్ విధానాల ద్వారా క్యాన్సర్‌గా మారడానికి ముందే కణాల్లో వచ్చే మార్పులను పసిగట్టవచ్చు.

సమయానికి ఈ మార్పులను గుర్తించి చికిత్స తీసుకుంటే క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేసుకోవడం, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ ముప్పును సమర్థవంతంగా అడ్డుకోవచ్చని ఆయన తెలిపారు.

పెద్దపేగు క్యాన్సర్: లక్షణాలను తేలికగా తీసుకోకండి

పెద్దపేగు (కోలొరెక్టల్) క్యాన్సర్‌ను కూడా స్క్రీనింగ్ ద్వారా ముందుగానే అడ్డుకోవచ్చు. కోలనోస్కోపీ (Colonoscopy) పరీక్ష చేయడం వల్ల పేగుల్లో ఏర్పడే పాలిప్స్‌ (Polyp) ను క్యాన్సర్‌గా మారక ముందే గుర్తించి తొలగించవచ్చు.

మల విసర్జన విధానంలో మార్పులు, మలంలో రక్తం పడటం, ఉన్నట్టుండి బరువు తగ్గడం, కడుపులో నిరంతరం అసౌకర్యంగా ఉండటం వంటి లక్షణాలు ఉంటే అలసత్వం వహించకూడదు

ఊపిరితిత్తుల క్యాన్సర్: ధూమపానానికి స్వస్తి చెప్పాల్సిందే

ఊపిరితిత్తుల క్యాన్సర్ తరచుగా తీవ్ర రూపం దాల్చిన తర్వాతే బయటపడుతుంది. అయితే, ధూమపానం చేసే అలవాటు ఉన్నవారు 'లో-డోస్ సీటీ స్కానింగ్' చేయించుకోవడం వల్ల ప్రారంభంలోనే ఈ వ్యాధిని గుర్తించవచ్చు. పొగతాగడం మానేయడం ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే అత్యుత్తమ మార్గం. తొలి దశలోనే గుర్తిస్తే సర్జరీ, వ్యక్తిగత వైద్య విధానాల (Personalised treatments) ద్వారా రోగి ప్రాణాలను కాపాడవచ్చు.

ముందస్తు గుర్తింపు ఎందుకు ముఖ్యం?

క్యాన్సర్ ఏ రకమైనప్పటికీ ముందస్తుగా గుర్తిస్తే రకరకాల చికిత్సా మార్గాలు అందుబాటులోకి వస్తాయి. సంక్లిష్టమైన వైద్యాన్ని తప్పించుకోవడమే కాకుండా, మెరుగైన జీవితాన్ని గడపవచ్చు.

పొగాకు వాడకానికి దూరంగా ఉండటం, బరువు నియంత్రణలో ఉంచుకోవడం, సమతుల ఆహారం తినడం, శారీరక వ్యాయామం చేయడం, సకాలంలో హెల్త్ చెకప్‌లు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ ముప్పును చాలా వరకు తగ్గించుకోవచ్చు. ముందస్తు పరీక్షలపై అవగాహన పెంచుకోవడమే క్యాన్సర్ నివారణకు తొలి అడుగు.

వ్యాసకర్త:

డాక్టర్ జి. వంశీకృష్ణ రెడ్డి,

డైరెక్టర్ (ఆంకాలజీ సర్వీసెస్),

మెడికల్ & హెమటో ఆంకాలజిస్ట్,

హైదరాబాద్ యశోద హాస్పిటల్స్

డాక్టర్ జి. వంశీకృష్ణ రెడ్డి, డైరెక్టర్ (ఆంకాలజీ సర్వీసెస్), మెడికల్ & హెమటో ఆంకాలజిస్ట్, హైదరాబాద్ యశోద హాస్పిటల్స్
డాక్టర్ జి. వంశీకృష్ణ రెడ్డి, డైరెక్టర్ (ఆంకాలజీ సర్వీసెస్), మెడికల్ & హెమటో ఆంకాలజిస్ట్, హైదరాబాద్ యశోద హాస్పిటల్స్
  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More