గుండెపోటు వస్తే 'గోల్డెన్ అవర్' ఎందుకు ముఖ్యం? ప్రాణాలు కాపాడే కీలక సూత్రాలు
గుండెపోటు వచ్చిన సమయంలో గడిచే ప్రతి నిమిషం గుండె కండరాల ఆరోగ్యాన్ని, బాధితుడి ప్రాణాన్ని నిర్ణయిస్తుంది. గోల్డెన్ అవర్ ప్రాముఖ్యత, ముందస్తు లక్షణాలు, తీసుకోవాల్సిన అత్యవసర జాగ్రత్తల గురించి విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ కార్డియాలజీ కన్సల్టెంట్ డాక్టర్ ఎన్. సందీప్ అందించిన ప్రత్యేక కథనం.
గుండెపోటు వచ్చినప్పుడు గడిచే ప్రతి నిమిషంతో పరిస్థితి తీవ్రంగా మారే ప్రమాదం ఉంటుంది. గుండెకు రక్తాన్ని, ఆక్సిజన్ను తీసుకెళ్లే కరోనరీ ధమనిలో అవరోధం (బ్లాకేజ్) ఏర్పడితే, గుండె కండరాల్లోని కొంత భాగానికి రక్తప్రసరణ ఆగిపోతుంది. ఆ అవరోధాన్ని త్వరగా తొలగించకపోతే గుండె కండరాలకు శాశ్వత నష్టం వాటిల్లుతుంది.

గోల్డెన్ అవర్ అంటే ఏమిటి?
'గోల్డెన్ అవర్' అంటే కచ్చితంగా 60 నిమిషాల గడువు మాత్రమే కాదు. గుండెపోటు లక్షణాలు కనిపించిన వెంటనే వేగంగా స్పందించి వైద్యసాయం అందిస్తే, ముప్పును నివారించగలిగే ఆరంభ సమయాన్ని 'గోల్డెన్ అవర్' అంటారు. ఈ సమయంలో తక్షణ చికిత్స అందిస్తే రక్తప్రసరణను పునరుద్ధరించి, గుండె కండరాలు తీవ్రంగా దెబ్బతినకుండా కాపాడే వీలుంటుంది. గుండెపోటు చికిత్సలో రోజులు, గంటల లెక్క కాకుండా ప్రతి నిమిషం ఎంతో విలువైనది.
గుండెపోటు ముందస్తు లక్షణాలు
గుండెపోటు అంటే ఎప్పుడూ తీవ్రమైన ఛాతినొప్పితోనే మొదలవుతుందని అనుకోవడం పొరపాటు. ఈ లక్షణాల పట్ల అవగాహన కలిగి ఉండాలి.
- ఛాతీలో తీవ్రమైన ఒత్తిడి, బిగుతుగా అనిపించడం, బరువుగా లేదా మంటగా ఉండటం.
- ఈ నొప్పి చేయి, భుజం, వీపు, మెడ లేదా దవడ భాగానికి పాకడం.
- ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, విపరీతంగా చెమటలు పట్టడం, వాంతులు లేదా వికారం.
- శరీరం అసాధారణంగా బలహీనపడటం, తల తిరగడం.
వృద్ధుల్లో, మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారిలో ఈ లక్షణాలు అంత స్పష్టంగా కనిపించకపోవచ్చు.
అంబులెన్స్ సేవలే ఎందుకు మేలు?
లక్షణాలు కనిపిస్తే అవే తగ్గుతాయని వేచి చూడటం వల్ల విలువైన సమయం వృథా అవుతుంది. వెంటనే అత్యవసర మెడికల్ సర్వీసెస్కు కాల్ చేయాలి. సొంతంగా వాహనం నడుపుతూ ఆసుపత్రికి వెళ్లడం కంటే అంబులెన్స్లో వెళ్లడం సురక్షితం. అంబులెన్స్లోనే ప్రాథమిక పరీక్షలు చేసి, అవసరమైన అత్యవసర చికిత్స మొదలుపెడతారు. అంతేకాకుండా, మీరు ఆసుపత్రికి చేరుకునేలోపే అక్కడి వైద్యుల బృందం చికిత్సకు సిద్ధంగా ఉంటుంది.
ఆసుపత్రిలో అందించే వైద్య చికిత్సలు
ఆసుపత్రికి చేరుకున్న వెంటనే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (ఈసీజీ) తీసి గుండెపోటును నిర్ధారిస్తారు. రక్త పరీక్షల ద్వారా గుండె కండరాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తారు. రక్తనాళాల్లో అవరోధం తీవ్రంగా ఉంటే, కరోనరీ యాంజియోగ్రఫీ చేసి బ్లాకేజ్ ఉన్న ప్రాంతాన్ని గుర్తిస్తారు. ఆపై రక్తప్రసరణను సాధారణ స్థితికి తీసుకురావడానికి స్టెంట్ వేస్తారు. అవసరమైన సందర్భాల్లో రక్తం గడ్డలను కరిగించే ఔషధాలను అందిస్తారు. బ్లాకేజ్ తీవ్రత, ఎంత త్వరగా రక్తప్రసరణను పునరుద్ధరించారనే అంశాలపై గుండె కండరాల రక్షణ ఆధారపడి ఉంటుంది.
అత్యవసర సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు:
- శారీరక శ్రమను వెంటనే ఆపేసి, సురక్షితంగా కూర్చోవాలి లేదా పడుకోవాలి.
- వాహనాలు నడిపే ప్రయత్నం చేయకూడదు.
- ఇతరుల సలహాతో సొంతంగా మందులు వేసుకోకూడదు.
- డాక్టర్ ముందే సూచించిన అత్యవసర గుండె మందులు ఉంటే మాత్రమే వాటిని వాడాలి.
- ఛాతీలో అసౌకర్యం కొన్ని నిమిషాలకు మించి ఉన్నా, ఊపిరి ఆడకపోవడం, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే క్షణం ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం పొందాలి.
వ్యాసకర్త:
డాక్టర్ ఎన్. సందీప్,
కన్సల్టెంట్ - కార్డియాలజీ,
మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


