45 ఏళ్ల లోపే రెక్టల్ క్యాన్సర్: యువతలో అలస్యంగా ఎందుకు గుర్తిస్తున్నారు? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

యువతలోనూ రెక్టల్ (మలద్వార) క్యాన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని హైదరాబాద్‌ యశోద హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కె.శ్రీకాంత్ హెచ్చరిస్తున్నారు. దీనిపై ఆయన అందించిన ప్రత్యేక విశ్లేషణ.

Published on: Sep 8, 2026, 15:19:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సాధారణంగా రెక్టల్ (మలద్వార) క్యాన్సర్ అనేది 45 ఏళ్లు దాటిన వయస్కులలో ఎక్కువమందిలో కనిపిస్తుంది. అయితే ఇటీవలి కాలంలో 45 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న యువతలో కూడా ఈ క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మలద్వారం నుంచి రక్తం పడటం, మల విసర్జన అలవాట్లలో మార్పులు రావడం వంటి తొలి లక్షణాలను పైల్స్ (అర్శమొలలు), మలబద్ధకం లేదా ఇతర జీర్ణకోశ సమస్యలుగా భావించి చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ విధమైన సాధారణ సమస్యలతో క్యాన్సర్ లక్షణాలు కలిసిపోవడం వల్ల వ్యాధి తీవ్రత పెరిగే వరకు సరైన వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం ప్రధాన సమస్యగా మారింది.

45 ఏళ్ల లోపే రెక్టల్ క్యాన్సర్: యువతలో అలస్యంగా ఎందుకు గుర్తిస్తున్నారు? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
45 ఏళ్ల లోపే రెక్టల్ క్యాన్సర్: యువతలో అలస్యంగా ఎందుకు గుర్తిస్తున్నారు? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

యువతలో ప్రమాదకర సంకేతాలు - హెచ్చరికలు

వయస్సుతో సంబంధం లేకుండా శరీరంలో కనిపించే కొన్ని మార్పులను అస్సలు విస్మరించకూడదు. ఈ క్రింది లక్షణాలు పదేపదే వేధిస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

  • మలంతో పాటు రక్తం పడటం లేదా మల విసర్జన సమయంలో రక్తం కనిపించడం.
  • మల విసర్జన అలవాట్లలో వ్యత్యాసాలు రావడం (అతిగా విరేచనాలు కావడం లేదా తీవ్రమైన మలబద్ధకం).
  • మలం సన్నగా లేదా సన్నటి తీగలా రావడం.
  • మల విసర్జన తర్వాత కూడా పేగులు ఖాళీ కాలేదనే భావన కలగడం.
  • పొత్తికడుపు లేదా మలద్వారం వద్ద నిరంతరం నొప్పి రావడం.
  • ఎలాంటి ప్రయత్నం లేకుండానే ఆకస్మికంగా బరువు తగ్గడం.
  • రక్తహీనత (ఐరన్ లోపం), విపరీతమైన అలసటకు గురికావడం.
  • పదే పదే అత్యవసరంగా మల విసర్జనకు వెళ్లాల్సి రావడం.

ఆలస్యంగా ఎందుకు బయటపడుతోంది?

యువతలో రెక్టల్ క్యాన్సర్ ఆలస్యంగా నిర్ధారణ కావడానికి ప్రధాన కారణం సమాజంలో ఉన్న అపోహలే. తక్కువ వయస్సు ఉన్నవారికి క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువనే భావన సాధారణ ప్రజల్లోనే కాకుండా కొందరు వైద్యుల్లోనూ ఉంటుంది. మలద్వారం నుంచి రక్తం పడగానే అది పైల్స్ వల్లనే అని, విరేచనాలలో మార్పులు రాగానే తిన్న ఆహారం పడకలేదని భావించి కాలయాపన చేస్తుంటారు. ఈ ఆలస్యమే వ్యాధి ముదిరిపోవడానికి కారణమవుతోంది.

ఎవరికి ప్రమాదం ఎక్కువ?

సాధారణంగా ఏ విధమైన రిస్క్ లేనివారు 45 ఏళ్ల వయస్సు నుంచి క్రమం తప్పకుండా కొలొరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్ (పరిశీలన పరీక్షలు) చేయించుకోవాలి. అయితే కుటుంబంలో లేదా వ్యక్తిగత ఆరోగ్య చరిత్రలో ఈ క్రింది లక్షణాలు ఉంటే 45 ఏళ్ల కంటే ముందే పరీక్షలు చేయించుకోవడం అవసరం.

  • గతంలో పేగులలో పాలిప్స్ (Polyp) ఉన్న చరిత్ర ఉండటం.
  • ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ (IBD) సమస్యలు ఉండటం.
  • కుటుంబంలో ఎవరికైనా చిన్న వయస్సులోనే కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చి ఉండటం.
  • లించ్ సిండ్రోమ్ (Lynch syndrome) లేదా ఫెమిలియల్ అడెనోమాటోస్ పాలిపోసిస్ (FAP) వంటి జన్యుపరమైన సమస్యలు ఉండటం.

చికిత్స, నివారణ మార్గాలు

45 ఏళ్ల లోపు వయస్సు ఉన్నప్పటికీ, పైన పేర్కొన్న లక్షణాలు సుదీర్ఘకాలం పాటు కొనసాగుతుంటే వెంటనే కొలొరెక్టల్ క్యాన్సర్ నిపుణుడిని కలవడం శ్రేయస్కరం. వ్యాధి నిర్ధారణ కోసం వైద్యులు రక్తం, మల పరీక్షలతో పాటు కోలనోస్కోపీ (Colonoscopy) లేదా ఇతర ఇమేజింగ్ పరీక్షలను రికమండ్ చేస్తారు.

పేగులలో వచ్చే ప్రతి సమస్యా క్యాన్సర్ కాకపోవచ్చు. అయినప్పటికీ, శరీరంలో కనిపించే విలక్షణమైన, పదేపదే వేధించే మార్పులను తేలికగా తీసుకోకూడదు. వ్యాధి ప్రారంభ దశలోనే గుర్తించడం వల్ల సరైన సమయంలో సమర్థవంతమైన చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు.

- డాక్టర్ కే. శ్రీకాంత్,

సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్,

యశోద హాస్పిటల్స్, హైదరాబాద్

డాక్టర్ కె.శ్రీకాంత్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్
డాక్టర్ కె.శ్రీకాంత్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్
  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More