కొత్త ఏడాది తీర్మానాలు టెన్షన్ పెడుతున్నాయా? ఆ ఉత్సాహం ఎందుకు ఆవిరవుతుందో తెలుసా
కొత్త ఏడాదిలో తీసుకున్న లక్ష్యాలు భారంగా అనిపిస్తున్నాయా? పట్టుమని పది రోజులు కూడా గడవకముందే ఎందుకు నీరసించిపోతున్నామో, ఆందోళనను అధిగమించి లక్ష్యాలను ఎలా చేరుకోవాలో నిపుణుల మాటల్లో..
కొత్త ఏడాది మొదటి రోజు.. ఏదో సాధించాలనే కసి, విపరీతమైన ఉత్సాహం! ఈ ఏడాది ఎలాగైనా బరువు తగ్గాలి, కొత్త అలవాట్లు నేర్చుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకుంటాం. కానీ, తీరా మొదటి వారం గడిచేసరికి ఆ జోష్ కాస్తా నీరుగారిపోతుంది. అనుకున్నవి చేయలేకపోతున్నామే అన్న గిల్టీ ఫీలింగ్ మొదలవుతుంది. అసలు ఈ 'రెజల్యూషన్స్' మనల్ని ఉత్సాహపరచాల్సింది పోయి, ఎందుకు ఒత్తిడికి గురిచేస్తున్నాయి? దీని వెనుక ఉన్న సైకాలజీ ఏంటో తెలిస్తే.. మీరు మీపై మీరు కోప్పడటం మానేసి, కొత్త కోణంలో ఆలోచించడం మొదలుపెడతారు.

ఈ అంశంపై 'గేట్వే ఆఫ్ హీలింగ్' వ్యవస్థాపకురాలు, ప్రముఖ సైకోథెరపిస్ట్ డాక్టర్ చాందినీ తుగ్నైత్ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
ఆందోళనకు కారణం అదేనా?
సాధారణంగా జనవరి 1 రాగానే సోషల్ మీడియాలో 'న్యూ ఇయర్ - న్యూ మీ' (కొత్త ఏడాది - కొత్త నేను) అనే నినాదాలు హోరెత్తుతుంటాయి. విజన్ బోర్డులు తయారు చేయడం, వింత వింత ఆచారాలు పాటించడం చూస్తుంటే.. ఏదో తెలియని హడావుడి కనిపిస్తుంది. అందరూ ఏదో ఒకటి చేస్తున్నప్పుడు, మనం కూడా ఏదో ఒకటి చేయాలనే ఒత్తిడి సహజంగానే మనలో ఆందోళనను పెంచుతుంది.
"ప్రస్తుతం మోటివేషన్ పేరుతో మార్కెట్లో అమ్ముడవుతున్నవన్నీ వాస్తవానికి మనపై ఒత్తిడిని పెంచుతున్నాయి. స్ఫూర్తి పొందాల్సింది పోయి.. ఎవరో మనల్ని గమనిస్తున్నారని, మనం అందరికంటే వెనుకబడిపోతున్నామని చాలామంది భయపడుతున్నారు. అందుకే న్యూ ఇయర్ తీర్మానాలు వేగాన్ని ఇవ్వాల్సింది పోయి, మానసిక ఆందోళనను కలిగిస్తున్నాయి" అని డాక్టర్ చాందినీ వివరించారు.
రాత్రికి రాత్రే మారిపోవాలనుకోవడం పొరపాటే
తీర్మానాలు అనగానే మనం రాత్రికి రాత్రే మారిపోవాలని కోరుకుంటాం. వెంటనే ఫలితాలు రావాలని ఆశించడం వల్ల స్ట్రెస్ పెరుగుతుంది. మనం మారాలనే కోరిక మంచిదే అయినా, అది అతి వేగంగా జరగాలనుకోవడం వల్ల 'బర్న్ అవుట్' (మానసిక అలసట)కు దారితీస్తుంది.
అంతేకాదు, ఈ ఒత్తిడిలో ఉన్నప్పుడు చిన్న తప్పు జరిగినా మనం తట్టుకోలేం. ఉదాహరణకు, ఒకరోజు జిమ్ వెళ్లడం మానేస్తే చాలు.. మనల్ని మనం తిట్టుకోవడం మొదలుపెడతాం. ఈ విమర్శ మనల్ని మరింత కుంగదీస్తుందని, తద్వారా అలవాటును కొనసాగించడం కష్టమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పరిష్కారం ఏంటి?
మరి ఈ తీర్మానాలకు కట్టుబడి ఉండటం ఎలా? దీనికి డాక్టర్ చాందినీ ఒక చక్కని మార్గాన్ని సూచించారు. లక్ష్యాలు ఎప్పుడూ మన వ్యక్తిత్వానికి దగ్గరగా, సరళంగా ఉండాలి.
"నేను ఏం మార్చుకోవాలి? అని కాకుండా.. ప్రస్తుతం నాకు ఏది అవసరం? ఏది నాకు తోడ్పడుతుంది? అని ప్రశ్నించుకున్నప్పుడు అసలైన మోటివేషన్ వస్తుంది. బహుశా మనుషులు తీర్మానాలను పాటించడంలో విఫలం కావడం లేదు.. ఆ తీర్మానాలే మనుషులను అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నాయి" అని ఆమె పేర్కొన్నారు.
కాబట్టి, మీలో ఉన్న లోపాలను వెతుక్కుంటూ ఆందోళన చెందడం కంటే, మీకు ఏది మేలు చేస్తుందో దానిపై దృష్టి పెట్టండి. అప్పుడే మీరు మధ్యలో వదిలేయకుండా మీ లక్ష్యాలను చేరుకోగలరు.
(గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యపరమైన లేదా మానసిక సమస్యలకు సంబంధించి నిపుణులైన వైద్యులను సంప్రదించడం ఉత్తమం.)
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


