KTM new bike : కేటీఎమ్ నుంచి సరికొత్త '890 అడ్వెంచర్ ఆర్​ ర్యాలీ'- బైక్​ ఎలా ఉందంటే..

KTM 890 Adventure R Rally : 890 అడ్వెంచర్​ ఆర్​ ర్యాలీ ఎడిషన్​ని కేటీఎం తాజాగా ఆవిష్కరించింది. ఫ్యాక్టరీ నుంచే రేసింగ్ హార్డ్‌వేర్‌తో వస్తున్న ఒక పక్కా ర్యాలీ మెషీన్​ని ఈ బైక్​ తలపిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Published on: Mar 28, 2026, 06:45:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆస్ట్రియన్ బైక్ దిగ్గజం కేటీఎమ్.. సాహసప్రియల కోసం సరికొత్త '2026 కేటీఎమ్ 890 అడ్వెంచర్ ఆర్​ ర్యాలీ' ఎడిషన్‌ను తాజాగా ఆవిష్కరించింది. రెడ్ బుల్ కేటీఎమ్ ఫ్యాక్టరీ రేసింగ్ టీమ్ డకర్ ర్యాలీల్లో వాడే బైక్‌ల స్పూర్తితో, అత్యంత పరిమిత సంఖ్యలో ఈ లిమిటెడ్ ఎడిషన్ మోటార్ సైకిల్‌ను కంపెనీ రూపొందించింది. కఠినమైన దారుల్లో ప్రొఫెషనల్ గ్రేడ్ పర్ఫార్మెన్స్ కోరుకునే రైడర్ల కోసం ప్రత్యేకమైన సస్పెన్షన్, ఎర్గోనామిక్స్‌తో దీనిని తీర్చిదిద్దారు.

కేటీఎం 890 అడ్వెంచర్​ ఆర్​ ర్యాలీ ఎడిషన్​..
కేటీఎం 890 అడ్వెంచర్​ ఆర్​ ర్యాలీ ఎడిషన్​..

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డకర్ ర్యాలీ రేసుల్లో విజేతగా నిలిచిన బైక్ సాంకేతికతను సామాన్య రైడర్లకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా కేటీఎమ్ ఈ 890 అడ్వెంచర్ ఆర్​ ర్యాలీని తీసుకొచ్చింది. ఇది కేవలం పాత మోడల్‌కు అప్‌డేట్ మాత్రమే కాదు, “ఫ్యాక్టరీ నుంచే రేసింగ్ హార్డ్‌వేర్‌తో వస్తున్న ఒక పక్కా ర్యాలీ మెషీన్” అని కంపెనీ స్పష్టం చేసింది.

రేసింగ్ స్థాయి సస్పెన్షన్..

బైక్‌లోని ప్రధాన ఆకర్షణ 'డబ్ల్యూపీ ప్రో కాంపోనెంట్స్' సస్పెన్షన్. ప్రొఫెషనల్ రేసింగ్ పోటీల్లో వాడే టెక్నాలజీని ఇందులో వాడారు. ముందు భాగంలో తేలికపాటి 'డబ్ల్యూపీ ఎక్స్‌ప్లోర్ ప్రో' ఫోర్క్, వెనుక భాగంలో దానికి సరిజోడైన షాక్ అబ్జార్బర్‌ను అమర్చారు. ఇది 270 ఎంఎం ట్రావెల్‌ను అందిస్తుంది. దీనివల్ల బైక్ అత్యంత వేగంతో వెళుతున్నప్పుడు కూడా అద్భుతమైన నియంత్రణను కలిగి ఉంటుంది. వెనుక సీటులో ప్రయాణికుడు ఉన్నా లేదా భారీ లగేజీ మోస్తున్నా.. సుదీర్ఘ ప్రయాణాల్లో ఎక్కడా అసౌకర్యం కలగకుండా, గరుకు రోడ్లపై కూడా సాఫీగా వెళ్లేలా దీనిని డిజైన్ చేశారు.

ఇంజిన్ సామర్థ్యం, పవర్..

ఈ 2026 కేటీఎమ్ 890 అడ్వెంచర్ ఆర్​ ర్యాలీ ఎడిషన్​ బైక్​కి​ 889 సీసీ ప్యారలల్-ట్విన్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 104.55 bhp గరిష్ట శక్తిని, 100 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం పవర్ మాత్రమే కాకుండా, రైడర్ భద్రత కోసం అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీని కేటీఎమ్ అందించింది. ఇందులో ఆఫ్-రోడ్ ఏబీఎస్​, మోటార్ స్లిప్ రెగ్యులేషన్ (ఎంఎస్​ఆర్​), వివిధ రైడ్ మోడ్స్ ఉన్నాయి. ముఖ్యంగా 'ర్యాలీ మోడ్' ద్వారా రైడర్లు తమ అవసరానికి తగ్గట్టుగా బైక్ పనితీరును మార్చుకోవచ్చు. 5- ఇంచ్​ టీఎఫ్‌టీ డిస్​ప్లే ద్వారా నావిగేషన్, కనెక్టివిటీ ఫీచర్లను సులభంగా యాక్సెస్ చేయవచ్చు.

ప్రత్యేక ఆకర్షణలు..

బైక్ లుక్ పరంగా చూస్తే, రెడ్ బుల్ రేసింగ్ టీమ్ థీమ్‌తో కూడిన గ్రాఫిక్స్ దీనికి స్పోర్టీ లుక్ ఇస్తాయి. దీనికి తోడుగా వచ్చే ‘అక్రపోవిక్’ స్లిప్-ఆన్ ఎగ్జాస్ట్ బైక్ శబ్దాన్ని, పనితీరును మరో స్థాయికి తీసుకెళ్తుంది. కస్టమర్ల నమ్మకాన్ని పెంచేలా ఈ ప్రీమియం బైక్‌పై నాలుగు ఏళ్ల వరకు వారంటీని కూడా కంపెనీ అందిస్తోంది.

మరోవైపు, కేటీఎమ్ నుంచి త్వరలో 690 సీసీ విభాగంలో కూడా ఒక సరికొత్త ర్యాలీ బైక్ రాబోతున్నట్లు సమాచారం. ఇటీవల పరీక్షల్లో కనిపించిన ఈ బైక్, సాధారణ ప్రయాణాల కంటే ఎక్కువగా ర్యాలీ పోటీలకు అనుకూలంగా ఉండేలా కనిపిస్తోంది. మొత్తానికి కేటీఎమ్ తన అడ్వెంచర్ లైనప్‌ను మరింత బలోపేతం చేస్తూ, ఆఫ్-రోడ్ ప్రియులకు మరిన్ని ఆప్షన్లను అందుబాటులోకి తెస్తోంది.

తరచూ అడిగే ప్రశ్నలు-

1. సాధారణ కేటీఎమ్ 890 అడ్వెంచర్ ఆర్​ మోడల్‌కు, ఈ 'ఆఱ్​ ర్యాలీ' ఎడిషన్‌కు ఉన్న ప్రధాన తేడా ఏమిటి?

సాధారణ మోడల్‌తో పోలిస్తే 'ఆర్​ ర్యాలీ' ఎడిషన్‌లో రేసింగ్ స్థాయికి చెందిన WP XPLOR PRO సస్పెన్షన్ ఉంటుంది. ఇది 270 ఎంఎం ట్రావెల్‌ను అందిస్తుంది (సాధారణ మోడల్ కంటే ఎక్కువ). దీనికి తోడు ఇందులో Akrapovič స్లిప్-ఆన్ ఎగ్జాస్ట్, రేసింగ్ సీట్, డకర్ రేసింగ్ బైక్‌లను పోలిన 'రెడ్ బుల్' గ్రాఫిక్స్ ప్రత్యేకంగా ఉంటాయి. ఇది పరిమిత సంఖ్యలో మాత్రమే లభించే 'లిమిటెడ్ ఎడిషన్' మోడల్.

2. ఈ బైక్ ఇంజిన్ సామర్థ్యం ఎంత? ఇది ఆఫ్-రోడ్ రైడింగ్‌కు ఎలా సహాయపడుతుంది?

ఈ బైక్‌లో 889 cc ప్యారలల్-ట్విన్ ఇంజిన్ ఉంది, ఇది 104.55 bhp పవర్, 100 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆఫ్-రోడ్ రైడింగ్ కోసం ఇందులో ప్రత్యేకంగా 'Rally Mode' ఉంటుంది. ఇది రైడర్ తన అవసరానికి తగ్గట్టుగా థొరాటిల్ రెస్పాన్స్‌ను మార్చుకోవడానికి, వీల్ స్లిప్‌ను నియంత్రించుకోవడానికి (9 లెవల్స్ వరకు) ఉపయోగపడుతుంది. దీనివల్ల ఇసుక, రాళ్లు లేదా బురద వంటి కఠినమైన దారుల్లో బైక్ అద్భుతమైన గ్రిప్​ని కోల్పోకుండా ప్రయాణిస్తుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More