Electric Bike : స్టాండే లేని ఎలక్ట్రిక్​ బైక్​ ఇది! ప్రపంచంలోనే తొలి సెల్ఫ్​ బ్యాలెన్సింగ్​ మోడల్​..

సింగపూర్‌కు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్రాండ్ ‘ఓమోవే’.. అంతరిక్ష సాంకేతికతతో కూడిన ప్రపంచపు మొట్టమొదటి సెల్ఫ్-బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్​ బైక్​ ‘ఓమో ఎక్స్​’ను ఆవిష్కరించింది. దీనికి స్టాండ్​ ఉండదు. గైరోస్కోప్ టెక్నాలజీతో పనిచేసే ఈ బైక్, ఆగి ఉన్నప్పుడు కూడా కింద పడదు! పూర్తి వివరాల్లోకి వెళితే..

Published on: Mar 23, 2026, 06:45:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సింగపూర్‌కు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్రాండ్ 'ఓమోవే', ప్రపంచంలోనే మొట్టమొదటి సెల్ఫ్-బ్యాలెన్సింగ్ మోటార్‌సైకిల్‌ను ఓమో ఎక్సో రూపంలో లాంచ్ చేసింది. అంతరిక్ష పరిశ్రమలో వాడే గైరోస్కోప్ సాంకేతికతను ఉపయోగించుకున్న తొలి ఎలక్ట్రిక్ టూ-వీలర్ ఇదే కావడం విశేషం. ఓమోవే ఓమో ఎక్స్​ అమ్మకాలు మే 2026 నుంచి మొదటగా ఇండోనేషియాలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దీని ఉత్పత్తి ప్రక్రియ మొదలైంది. రోబోటిక్స్ ఆర్కిటెక్చర్‌పై నిర్మితమైన ఈ ఓమో ఎక్స్​ కోసం ప్రీ-బుకింగ్స్, టెస్ట్ రైడ్‌లు ఏప్రిల్ 2026 చివరి నాటికి ప్రారంభమవుతాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్​తో పాటు కంపెనీ ప్రామాణికంగా 7 ఏళ్ల బ్యాటరీ ప్యాక్ వారంటీని అందిస్తోంది.

ఓమోవే ఓమో ఎక్స్​ ఎలక్ట్రిక్​ బైక్​..
ఓమోవే ఓమో ఎక్స్​ ఎలక్ట్రిక్​ బైక్​..

ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్​ బైక్​ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

ఓమో ఎక్స్​ ఎలక్ట్రిక్​ బైక్​- డిజైన్, లుక్స్..

ఓమోవే ఓమో ఎక్స్​ ఎలక్ట్రిక్​ బైక్​ ఫ్రంట్ డిజైన్ 'స్టార్‌షిప్' ప్రేరణతో, భవిష్యత్ కాలపు అనుభూతిని కలిగిస్తూ, ఇంటర్ స్టెల్లార్ యుద్ధనౌకలా కనిపిస్తుంది. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది 'OMO సేబర్‌లైట్'. ఇది స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌లో ఎల్‌ఈడీ యూనిట్లతో వస్తుంది. వెనుక ప్రొఫైల్ విషయానికి వస్తే, వెడల్పైన రేర్​ వీల్, వినూత్నమైన స్వింగ్‌ఆర్మ్, ఫ్లోటింగ్ సీటుతో ఆకట్టుకుంటుంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి 'మల్టీ-ఫామ్' మోటార్‌సైకిల్‌గా గుర్తింపు పొందింది.

మూడు రకాల రూపాల్లోకి మార్చుకోవచ్చు..

ఓమో ఎక్స్​ దాని మోడ్యులర్ డిజైన్ కారణంగా మూడు రకాల బాడీ టైప్స్‌లోకి రూపాంతరం చెందగలదు:

బేసిక్ కాన్ఫిగరేషన్: ఇది క్లాసిక్ డిజైన్‌తో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ని తలపిస్తుంది.

నేక్డ్ స్ట్రీట్ మోడల్: మిడిల్ బాక్స్ మాడ్యూల్ ఎక్స్‌పాన్షన్ ద్వారా దీనిని నేక్డ్ స్ట్రీట్ బైక్‌గా మార్చుకోవచ్చు.

జీటీ మోడల్: మిడిల్ బాక్స్, టెయిల్ బాక్స్, సైడ్ బాక్సుల వంటి మల్టిపుల్ లగేజీ ఆప్షన్లతో ఇది టూరింగ్ స్కూటర్‌గా మారుతుంది.

ఓమో ఎక్స్​ ఎలక్ట్రిక్​ బైక్​- రెండు చక్రాలపై నడిచే రోబో..!

ప్రత్యేకంగా రూపొందించిన 'ఓమో రోబో' సిస్టమ్ ఉండటం వల్ల ఓమో ఎక్స్​ని "రెండు చక్రాలపై నడిచే రోబో" అని కూడా పిలుస్తున్నారు. ఈ సిస్టమ్ సెన్సార్లు, కెమెరాల సహాయంతో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కింద పడకుండా నిరోధిస్తుంది. అందువల్ల, దీనికి ఎటువంటి బాహ్య మద్దతు (స్టాండ్​, సపోర్ట్​) అవసరం లేదు. తనను తాను సెల్ఫ్​ బ్యాలెన్స్​ చేసుకునే ప్రపంచపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్​గా ఇది నిలిచింది.

ముందే చెప్పుకున్నట్లుగా, అంతరిక్ష నౌకలు, ఉపగ్రహాలను స్థిరంగా ఉంచడానికి ఉపయోగించే గైరోస్కోప్ సాంకేతికతను ఓమోవే ఓమో ఎక్స్​ ఎలక్ట్రిక్​ బైక్​లో వాడారు. ఈ టెక్నాలజీ వల్ల బైక్ చాలా తక్కువ వేగంతో వెళుతున్నప్పుడు లేదా పూర్తిగా ఆగిపోయినప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. దీనివల్ల మోటార్‌సైకిల్‌ను బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత నుంచి రైడర్‌కు విముక్తి లభిస్తుంది. సాధారణంగా బరువైన ద్విచక్ర వాహనాలను బ్యాలెన్స్ చేయడం కొత్తగా నేర్చుకునే వారికి ఒక పెద్ద టాస్క్. కానీ ఓమో ఎక్స్​లో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పూర్తిగా ఆగిపోయినప్పుడు కూడా రైడర్లు తమ కాళ్లను కింద పెట్టాల్సిన అవసరం లేదు.

ఓమోవే ఓమో ఎక్స్​లో జారుడుగా లేదా తడిగా ఉన్న రోడ్లపై చక్రాలు స్కిడ్ అవ్వకుండా నిరోధించే ప్రత్యేక వ్యవస్థ ఉంది. అలాగే కార్నరింగ్ (మలుపులు తిరిగే) సమయంలో ఇది అదనపు సపోర్ట్ ఇస్తుంది. వాహనాన్ని తక్షణమే ఆపడానికి ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.

ఇతర ముఖ్యమైన ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో డబుల్ విష్‌బోన్ సస్పెన్షన్ సెటప్ ఉంది. ఇది గంటకు 110 కిమీ గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది, పూర్తి ఛార్జ్‌పై 200 కిమీ కంటే ఎక్కువ రేంజ్​ని ఇస్తుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More