Crime news : షాకింగ్! భర్త సాయంతో లవర్​ని చంపిన మహిళ- డెడ్​ బాడీని డ్రమ్​లో కుక్కి..

Maharastra murder case : మహారాష్ట్రలోని ముంబ్రాలో దారుణం జరిగింది. డబ్బులు ఇవ్వడం లేదనే కోపంతో 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను అతని లవర్, ఆమె భర్త, తమ్ముడు కలిసి దారుణంగా కొట్టి చంపారు. అనంతరం మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కి వసాయ్ పరిసరాల్లోని డ్రెయినేజీలో పడేశారు.

Published on: May 16, 2026, 09:08:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Woman Kills Lover Vasai : రాత్రిపూట ఛాటింగ్‌లు, ప్రేమ సందేశాలతో మొదలైన ఒక అక్రమ సంబంధం.. చివరికి ఒక యువ ఇంజనీర్ దారుణ హత్యతో ముగిసింది! మహారాష్ట్రలోని ముంబ్రాలో వెలుగుచూసిన ఈ ఘోర హత్యోదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వడం లేదనే కోపంతో.. ప్రియురాలు, ఆమె భర్త, మరో ఇద్దరితో కలిసి సదరు యువకుడిని ప్లాస్టిక్ పైపుతో కొట్టి చంపేశారు. ఆపై శవాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కి, వసాయ్ ప్రాంతంలోని ఒక నిర్మానుష్య డ్రెయినేజీ కాలువలో పారేశారు.

భర్త సాయంతో లవర్​ని చంపిన మహిళ..
భర్త సాయంతో లవర్​ని చంపిన మహిళ..

ఈ కేసును ఛేదించిన ముంబ్రా పోలీసులు.. మహిళతో పాటు ఆమె తమ్ముడిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఆమె భర్త, అతడి స్నేహితుడి కోసం గాలిస్తున్నారు.

అసలేం జరిగింది?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబ్రా నివాసి అయిన అర్బాజ్ మక్సూద్ అలీ ఖాన్ (26) డోంబివ్లిలోని ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ సంస్థలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. వసాయ్ ప్రాంతానికి చెందిన మెహజబీన్ ఖాతున్ ఎక్రాన్ షేక్ (25) అనే వివాహితతో అర్బాజ్‌కు 2021 నుంచి పరిచయం ఉంది. అది కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. మొదట్లో వీరిద్దరి మధ్య చాటింగ్‌లు, ఫోన్ కాల్స్ బాగానే సాగాయి. అయితే, కొన్నాళ్ల తర్వాత మెహజబీన్ తన అవసరాల కోసం అర్బాజ్ నుంచి డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. ఆమె అడిగినప్పుడల్లా అర్బాజ్ క్రమం తప్పకుండా ఆమె బ్యాంక్ ఖాతాకు డబ్బులు బదిలీ చేసేవాడు.

కానీ, గత కొన్ని నెలలుగా ప్రతి నెలా డబ్బులు పంపడానికి అర్బాజ్ నిరాకరించడంతో వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అర్బాజ్ నుంచి ఎలాగైనా భారీగా డబ్బులు వసూలు చేయాలని భావించిన మెహజబీన్.. తన భర్త హసన్ షేక్, తమ్ముడు తారిఖ్ షేక్, అతడి స్నేహితుడు మొజ్జం పఠాన్‌ల సాయం తీసుకుంది. అవసరమైతే అర్బాజ్‌ను హతమార్చడానికి సిద్ధపడింది.

ఏప్రిల్ 3వ తేదీన అర్బాజ్ తన కంపెనీకి సంబంధించిన నగదును కలెక్ట్ చేయడానికి దాదర్‌కు వెళ్లాడు. కానీ ఆ తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. అతడి మొబైల్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో ఆందోళన చెందిన తండ్రి.. మరుసటి రోజు ముంబ్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అర్బాజ్ కాల్ డేటా రికార్డులను, మొబైల్ లొకేషన్‌ను పరిశీలించారు. అతడు కనిపించకుండా పోయిన రోజున అర్బాజ్ లొకేషన్, వసాయ్‌లోని మెహజబీన్ నివాస లొకేషన్ ఒకేలా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా, కనిపించకుండా పోవడానికి సరిగ్గా ఒక రోజు ముందు అర్బాజ్ ఆమె ఖాతాకు రూ. 50,000 బదిలీ చేసినట్లు తేలింది.

దీనితో అనుమానం వచ్చిన పోలీసులు మెహజబీన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. మొదట్లో తనకు ఏమీ తెలియదని నటించినప్పటికీ, పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం ఒప్పుకుంది! ఏప్రిల్ 3న తానే అర్బాజ్‌ను వసాయ్‌లోని భోయిదాపాడలో ఉన్న తన ఇంటికి పిలిపించినట్లు అంగీకరించింది.

పోలీసుల విచారణలో వెల్లడైన మరిన్ని షాకింగ్ నిజాలు..

ఇంటికి వచ్చిన అర్బాజ్‌ను మెహజబీన్ మరిన్ని డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేసింది. అయితే తన వద్ద డబ్బులు లేవని అర్బాజ్ చెప్పడంతో, నిందితులు అతడిపై దాడికి దిగారు. మెహజబీన్ భర్త హసన్, తమ్ముడు తారిఖ్, స్నేహితుడు మొజ్జం కలిసి అర్బాజ్ కాళ్లు, చేతులు కట్టేసి ప్లాస్టిక్ పైపుతో విచక్షణారహితంగా కొట్టారు. ఈ దాడిలో అర్బాజ్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అనంతరం సాక్ష్యాలను నాశనం చేయడానికి, మృతదేహాన్ని ఒక పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కి, వసాయ్‌లోని వాలీవ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న డ్రెయినేజీ కాలువలో పారేశారు.

ముంబ్రా అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ప్రియా దామలే మాట్లాడుతూ.. “మెహజబీన్ అర్బాజ్ నుంచి డబ్బులు గుంజాలని చూసింది. అందులో విఫలం కావడంతో మిగతా ముగ్గురితో కలిసి అతడిని దారుణంగా హత్య చేసింది. సాక్ష్యాలను తుడిచేయడానికి శవాన్ని డ్రమ్ములో పెట్టి వసాయ్ శివార్లలో పడేశారు. సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అనిల్ షిండే, క్రైమ్ ఇన్‌స్పెక్టర్ శరద్ కుంభార్ నేతృత్వంలోని బృందం ఈ కేసును ఛేదించి, మృతదేహం ఉన్న డ్రమ్మును స్వాధీనం చేసుకుంది,” అని తెలిపారు.

నిందితులైన మెహజబీన్, ఆమె తమ్ముడు తారిఖ్ షేక్‌లను మే 7న అరెస్ట్ చేశామని, పరారీలో ఉన్న మిగతా ఇద్దరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అనిల్ షిండే వెల్లడించారు. నలుగురు నిందితులపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 140, 3(5) (కిడ్నాప్ లేదా హత్య కోసం అపహరణ), 103(1) (హత్య), 238 (సాక్ష్యాల నాశనం) కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More