ఇరాన్ కీలక నేత లారిజానీ హత్య: ‘వ్యక్తులు పోయినా వ్యవస్థ బలంగా ఉంటుంది’.. ఇజ్రాయెల్‌కు విదేశాంగ మంత్రి హెచ్చరిక

ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఇరాన్ కీలక నేత అలీ లారిజానీ మరణించారు. అయితే, ఈ హత్యతో ఇరాన్ నాయకత్వం బలహీనపడదని, తమ రాజకీయ నిర్మాణం ఏ ఒక్క వ్యక్తిపై ఆధారపడి లేదని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్పష్టం చేశారు.

Published on: Mar 18, 2026, 10:21:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీని ఇజ్రాయెల్ హత్య చేసిన నేపథ్యంలో, ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వం ఏ ఒక్క వ్యక్తి మరణంతోనూ కుప్పకూలిపోయేంత బలహీనమైనది కాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. లారిజానీ మరణం ఇరాన్ నాయకత్వానికి తీరని లోటు కాదని, తమ వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉందని పేర్కొన్నారు.

విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి (REUTERS)
విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి (REUTERS)

మంగళవారం రాత్రి టెహ్రాన్ శివార్లలోని పర్దిస్ జిల్లాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 67 ఏళ్ల అలీ లారిజానీ మరణించారు. తన కుమార్తెను కలిసేందుకు వెళ్లిన సమయంలో జరిగిన ఈ దాడిలో లారిజానీతో పాటు ఆయన కుమారుడు మొర్తేజా కూడా ప్రాణాలు కోల్పోయారు. లారిజానీ మరణాన్ని ఆయన నేతృత్వం వహించిన సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికారికంగా ధృవీకరించింది.

మా నిర్మాణం చెక్కు చెదరదు

లారిజానీ హత్య అనంతరం ‘అల్ జజీరా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అరాగ్చి మాట్లాడుతూ.. “అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇప్పటికీ ఒక ప్రాథమిక విషయాన్ని అర్థం చేసుకోవడం లేదు. ఇరాన్ ప్రభుత్వం ఏ ఒక్క వ్యక్తి మీద ఆధారపడి నడవడం లేదు. మాకు పటిష్టమైన రాజకీయ, ఆర్థిక, సామాజిక సంస్థలు ఉన్నాయి. ఏ ఒక్క వ్యక్తి ఉన్నా లేకపోయినా ఈ నిర్మాణం చెక్కుచెదరదు” అని స్పష్టం చేశారు. వ్యక్తులు వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తారనే విషయాన్ని అంగీకరిస్తూనే, ఏ ఒక్కరి మరణం వ్యవస్థను దెబ్బతీయలేదని ఆయన వివరించారు.

ప్రతీకార దాడులతో దద్దరిల్లిన ఇజ్రాయెల్

లారిజానీ హత్యకు ప్రతిచర్యగా బుధవారం ఇరాన్ తన ‘నిర్ణయాత్మక’ ప్రతీకారాన్ని మొదలుపెట్టింది. ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ వాణిజ్య కేంద్రమైన టెల్ అవీవ్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, రాకెట్లను గల్ఫ్ దేశాలు అడ్డుకున్నప్పటికీ, ఉద్రిక్తతలు మాత్రం తారస్థాయికి చేరాయి.

ఫిబ్రవరి 28న ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్య తర్వాత, ఇరాన్ నాయకత్వంలో జరిగిన అత్యంత కీలకమైన హత్య లారిజానీదే. ఈ పరిణామాలపై ఇరాన్ సైన్యాధిపతి అమీర్ హతమీ స్పందిస్తూ.. “ఈ హత్యకు మా సమాధానం అత్యంత కఠినంగా, ఇజ్రాయెల్ పశ్చాత్తాపపడేలా ఉంటుంది” అని హెచ్చరించారు.

అమెరికా జోక్యం.. ముదురుతున్న సంక్షోభం

మరోవైపు, ఇరాన్ తీర ప్రాంతంలోని క్షిపణి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా భారీ బాంబులతో దాడులు చేసింది. అంతర్జాతీయ రవాణా నౌకలకు ముప్పు పొంచి ఉందన్న కారణంతో ఈ దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అటు డొనాల్డ్ ట్రంప్ సైతం హార్ముజ్ జలసంధిలో ట్యాంకర్ల రక్షణ విషయంలో మిత్రదేశాల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

బుధవారం లారిజానీతో పాటు, ఇజ్రాయెల్ దాడిలో మరణించిన బాసిజ్ పారామిలటరీ దళం చీఫ్ గులామ్రేజా సులేమానీ అంత్యక్రియలు జరగనున్నాయి. తాజా పరిణామాలతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకున్నాయి.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More