Khamenei death : ఇరాన్​లోని సీసీటీవీలు ఇజ్రాయెల్​ చేతిలో! 'ఖమేనీ హతం' వెనుక మైండ్​ బ్లోయింగ్​​ నిజాలు..

శనివారం జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అల్​ ఖమేనీ మరణం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. ఇది ప్రపంచానికి అకస్మాత్తుగా జరిగిన దాడిలా కనిపించినప్పటికీ, దీని వెనుక ఇజ్రాయెల్ నిఘా వర్గాలు ఏళ్ల తరబడి సాగించిన అత్యంత సంక్లిష్టమైన ప్రణాళిక ఉంది.

Published on: Mar 03, 2026 3:05 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇరాన్ అగ్రనేత అయతొల్లా అల్​ ఖమేనీని అంతం చేయడం అనేది కేవలం ఒక సాంకేతిక విజయం మాత్రమే కాదు, అది దశాబ్దాల పాటు సాగిన ఇజ్రాయెల్ నిఘా వ్యూహాల శక్తికి చిహ్నం! గత కొన్ని దశాబ్దాలుగా ఇజ్రాయెల్ విదేశీ గడ్డపై వందలాది ఆపరేషన్లు నిర్వహించింది. ఉగ్రవాద నాయకులు, అణు శాస్త్రవేత్తలు, కెమికల్ ఇంజనీర్లను లక్ష్యంగా చేసుకుంది. అయితే, ఖమేనీ వంటి అత్యున్నత స్థాయి నేతను చంపడం ద్వారా ఇజ్రాయెల్ సాధించిన వ్యూహాత్మక ప్రయోజనాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఖమేనీ అంతం ముందు, తెరవెనుక జరిగిన కీలక పరిణామాలను ఇక్కడ తెలుసుకోండి..

ఇరాన్ అగ్రనేత అయతొల్లా అల్​ ఖమేనీ (AP)
ఇరాన్ అగ్రనేత అయతొల్లా అల్​ ఖమేనీ (AP)

1. ‘ముందుగా వారి కళ్లను తీసేశాం’

గత ఏడాది జూన్‌లో జరిగిన 12 రోజుల యుద్ధంలోనే ఇజ్రాయెల్ తన నిఘా శక్తిని నిరూపించుకుంది. కేవలం నిమిషాల వ్యవధిలోనే డజనుకు పైగా ఇరాన్ అణు శాస్త్రవేత్తలను, సైనిక అధికారులను అంతం చేసింది. ఇరాన్​కు చెందిన రష్యన్ నిర్మిత క్షిపణి వ్యవస్థలకు అనుసంధానించిన రాడార్లను, గగనతల రక్షణ వ్యవస్థలను సైబర్ దాడులు, డ్రోన్ల ద్వారా ఇజ్రాయెల్ నిర్వీర్యం చేసింది.

“మేము ముందుగా వారి కళ్లను తీసేశాం” అని ఒక నిఘా అధికారి పేర్కొన్నారు.

ఈ ఆపరేషన్లలో ఇజ్రాయెల్ ‘స్పారో’ క్షిపణి రకాలను ఉపయోగించింది. ఇవి 1,000 కిలోమీటర్ల దూరం నుంచి కూడా కేవలం ఒక డైనింగ్ టేబుల్ అంత చిన్న లక్ష్యాన్ని కచ్చితంగా కొట్టగలవు.

2. ఖమేనీ దాక్కోలేదు.. కానీ అప్రమత్తం అయ్యారు

హిజ్బుల్లా నేత హసన్ నస్రల్లా లానే ఖమేనీ కూడా ఎప్పుడూ భూగర్భ బంకర్లలో దాక్కోలేదు. తన హత్య జరిగే అవకాశం ఉందని ఆయనకు ముందే తెలుసు, దానిని ఆయన ఒక వీరమరణంలా భావించేవారు. అయినప్పటికీ, యుద్ధ సమయంలో ఆయన కొన్ని జాగ్రత్తలు తీసుకునేవారు. ఆయనకు రెండు ప్రత్యేకమైన బంకర్లు ఉన్నాయి. ఒకవేళ ఆయన ఆ బంకర్లలో ఉండి ఉంటే, ఇజ్రాయెల్ వద్ద ఉన్న బాంబులతో ఆయనను తాకడం సాధ్యం అయ్యేది కాదు. అయితే, శనివారం ఉదయం ఆయన బంకర్‌లో లేకపోవడం ఇజ్రాయెల్‌కు భారీ అవకాశంగా మారింది.

3. ట్రంప్ అసంతృప్తి, యుద్ధానికి మార్గం

అణు ఒప్పందం విషయంలో బహిరంగంగా చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నప్పటికీ, లోలోపల ఇరాన్ ఇస్తున్న సమాధానాల పట్ల తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు. ఒమన్ దేశం మధ్యవర్తిత్వం వహిస్తూ, ఇరాన్ రాయితీలకు సిద్ధంగా ఉందని చెప్పినా, చివరికి ట్రంప్ మాత్రం యుద్ధం వైపు మొగ్గు చూపారు.

ఖమేనీ, ఇతర సీనియర్ నాయకులు శనివారం ఉదయం తేహ్రాన్‌లోని తమ కాంపౌండ్‌లో సమావేశమవుతున్నారని నిర్ధారించుకున్న తర్వాత, ఆపరేషన్ సమయాన్ని మార్చారు.

ఒకసారి పూర్తిస్థాయి యుద్ధం మొదలైతే, వీరంతా భూగర్భ బంకర్లలోకి వెళతారని, అప్పుడు వారిని పట్టుకోవడం అసాధ్యమని ఇంటెలిజెన్స్ వర్గాలు భావించాయి. అంటే ఒక్క షాట్​తోనే ఖమేనీని అంతం చేయాల్సి ఉంటుందని వారందరికి తెలుసు.

4. డబుల్ వెరిఫికేషన్: ఖమేనీని గుర్తించిన తీరు

ఇంతకుముందు ఒక వ్యక్తిని గుర్తించడానికి చాలా శ్రమించాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ వద్ద ఉన్న అల్గారిథమ్స్ ఆ ప్రక్రియను ఆటోమేట్ చేశాయి! అయితే ఖమేనీ వంటి అగ్రనేత విషయంలో ఎటువంటి పొరపాట్లు జరగకూడదని ఇజ్రాయెల్ ‘డబుల్ వెరిఫికేషన్’ నిబంధనను పెట్టింది. ఇద్దరు స్వతంత్ర సీనియర్ అధికారులు ఆ వ్యక్తి ఖమేనీయే అని నిర్ధారించాలి. ఇందుకోసం ‘యూనిట్ 8200’ ట్రాఫిక్ సీసీటీవీ కెమెరాలను, హ్యాక్ చేసిన మొబైల్ నెట్‌వర్క్‌లను ఉపయోగించింది. అమెరికా నిఘా సంస్థ సీఐఏ వద్ద ఉన్న ఒక ‘హ్యూమన్ అసెట్’ (గూఢచారి) కూడా ఖమేనీ ఉనికిని ధృవీకరించినట్లు సమాచారం.

5. ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’, ‘రోరింగ్ లయన్’

శుక్రవారం మధ్యాహ్నం 3:38 గంటలకు ట్రంప్ ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానంలో ప్రయాణిస్తుండగా ఈ దాడికి అనుమతి ఇచ్చారు. అమెరికా దీనిని ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ అని పిలవగా, ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’ అని పిలిచింది.

సైబర్ దాడి: ఇరాన్ సమాచార వ్యవస్థలను, కమ్యూనికేషన్‌ను అమెరికా సైన్యం సైబర్ దాడులతో స్తంభింపజేసింది.

దాడి సమయం: స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం ఇరాన్ నేతలు అల్పాహారం తీసుకుంటున్న సమయంలో దాదాపు 30 ప్రిసిషన్ గైడెడ్ బాంబులతో కాంపౌండ్‌ను ధ్వంసం చేశారు. ఇరాన్ అప్రమత్తంగా ఉన్నా, ఉదయం పూట దాడి చేయడం వల్ల వారిని తేలికగా ఆశ్చర్యపరచడం సాధ్యమైందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

6. చరిత్ర మార్చిన రెండు మలుపులు

మాజీ మొసాద్ అధికారిణి సీమా షైన్ ప్రకారం, ఈ ఆపరేషన్ రెండు దశాబ్దాల నాటి నిర్ణయాల ఫలితం:

మొదటి మలుపు (2001): అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఏరియల్ షారోన్, మొసాద్ చీఫ్ మీర్ దగన్‌తో మాట్లాడుతూ, “మొసాద్ చేస్తున్న ఇతర పనులు పక్కన పెట్టండి.. నాకు కావలసింది ఇరాన్. అదే మీ ప్రధాన లక్ష్యం” అని ఆదేశించారు. అప్పటి నుంచి ఇరాన్.. ఇజ్రాయెల్ ప్రధాన టార్గెట్‌గా మారింది.

రెండో మలుపు (అక్టోబర్ 7, 2023): హమాస్ జరిపిన దాడుల తర్వాత ఇజ్రాయెల్ ఆలోచనా విధానం మారింది. యుద్ధ సమయంలో విదేశీ దేశాధినేతలను చంపకూడదు అనే నిబంధనను పక్కన పెట్టి, వారిని కూడా లక్ష్యంగా చేసుకోవాలని నిర్ణయించుకుంది.

7. ఇరాన్ ఎదురుదాడి, నిఘా వైఫల్యాలు

ఇరాన్ కూడా తక్కువ ఏమీ కాదు! 2022లో మొసాద్ చీఫ్ భార్య ఫోన్ నుంచి డేటాను హ్యాక్ చేసింది. 2025 యుద్ధంలో జెరూసలేంలోని సీసీ కెమెరాలను హ్యాక్ చేసి యుద్ధ నష్టాన్ని అంచనా వేసింది.

అయితే, హమాస్ నేత ఇస్మాయిల్ హనియేను తేహ్రాన్‌లోనే చంపడం, హిజ్బుల్లా పేజర్లు, రేడియోలను పేల్చడం వంటి ఇజ్రాయెల్ నిఘా విజయాలు ఒక కొత్త ఊపును ఇచ్చాయి.

“ఎంత తింటే అంత ఆకలి పెరుగుతుంది” అన్నట్లుగా, ఈ వరుస విజయాలు ఖమేనీని అంతం చేసేలా ఇజ్రాయెల్‌ను పురికొల్పాయి.

దేశాధినేతలను చంపడం వల్ల రాజకీయంగా, ఆపరేషనల్​గా భారీ రిస్క్ ఉంటుంది. గతంలో ఫిడెల్ కాస్ట్రోపై జరిగిన దాడులు విఫలమై ఆయన స్థాయిని పెంచాయి. కానీ, ఖమేనీ విషయంలో ఇజ్రాయెల్, అమెరికా సాధించిన ఈ విజయం మధ్యప్రాచ్య రాజకీయాలను సమూలంగా మార్చేయనుంది.