తీవ్ర విషాదం! సోదరుడి అంత్యక్రియలకు వెళుతూ, రోడ్డు ప్రమాదంలో ఆంధ్ర మహిళ మృతి..
ముంబైలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సోదరుడు అంత్యక్రియలకు వెళుతూ.. ఆంధ్రప్రదేశ్కి చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది!
సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ముంబైకి వెళ్లిన 70 ఏళ్ల సరస్వతి పుచ్లా అనే వృద్ధురాలు ఓ విషాదకర సంఘటనలో మృతి చెందారు. సోమవారం రోజున దేవనార్ స్మశానవాటికలో తన సోదరుడికి వీడ్కోలు చెప్పకముందే, ఆమె ప్రయాణిస్తున్న స్కూటర్ను ట్రక్కు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో కన్నుమూశారు.

శివాజీ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవండిలోని శివాజీ నగర్ బస్ డిపో సమీపంలో ఉన్న అహల్యాదేవి హోల్కర్ మార్గ్ను మృతురాలు, ఆమె బంధువులు ఇద్దరు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ముగ్గురూ రోడ్డుపై పడగా, ట్రక్కు వెనుక టైరు బంధువుల్లో ఒకరి చేయి మీదుగా, అలాగే సరస్వతి పుచ్లా తలపై నుంచి దూసుకెళ్లింది.
పోలీస్ అధికారి చెప్పిన దాని ప్రకారం.. ప్రమాదానికి గురైన మహిళను వెంటనే ఘాట్కోపర్లోని రాజావాడి ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ మహమ్మద్ సిరాజ్ షేక్ పారిపోవడానికి ప్రయత్నించగా, అటుగా వెళుతున్న ప్రయాణికులు అతడిని ఆపి, పోలీసులకు అప్పగించినట్లు అధికారి తెలిపారు.
అంత్యక్రియల వేళ విషాదం
మృతి చెందిన మహిళ మేనల్లుడు సుధీర్ గుడ్లా (21) పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ప్రభాదేవిలోని మ్హడా కాలనీలో నివసించే సుధీర్ గుడ్లా, తన మామ అజయ్ పుచ్లా ఆదివారం మరణించినట్లు తెలిపారు. అజయ్ పుచ్లా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు, ఆయన సోదరి సరస్వతి పుచ్లా ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం నుంచి ముంబై వచ్చారు. కుటుంబ సభ్యులంతా గోవండిలోని అజయ్ ఇంట్లో గుమిగూడారు. మరుసటి రోజు (సోమవారం) అంత్యక్రియలు జరగాల్సి ఉంది.
తాను, తన సోదరుడు సోను అంత్యక్రియల కోసం స్మశానవాటికకు వెళుతుండగా, తన అత్త సరస్వతి పుచ్లా కూడా తమతో వస్తానని పట్టుబట్టారని గుడ్లా తెలిపారు. ఈ ముగ్గురూ ద్విచక్ర వాహనంపై వెళుతండగానే ఈ ఘోరం జరిగిందని ఆయన వివరించారు.
పోలీసులు సోమవారం రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ట్రక్కు డ్రైవర్ మహమ్మద్ సిరాజ్ షేక్పై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 106 (నిర్లక్ష్యంతో మరణాన్ని కలిగించడం), సెక్షన్ 125 (మానవ జీవితానికి లేదా ఇతరుల వ్యక్తిగత భద్రతకు ప్రమాదం కలిగించే చర్యలు), సెక్షన్ 281 (ప్రమాదకరమైన రీతిలో వాహనం నడపడం), సెక్షన్ 324 (హాని కలిగించే పనులు) కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


