...
...
Next Story

AI దెబ్బకు ఐటీ స్టాక్స్ విలవిల: ఒక్క టూల్‌తో అతలాకుతలం

ఆంత్రోపిక్ (Anthropic) విడుదల చేసిన కొత్త ఏఐ టూల్ అంతర్జాతీయ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించింది. సాఫ్ట్‌వేర్, ఫైనాన్షియల్ కంపెనీల భవిష్యత్తుపై ఆందోళనలతో ఇన్వెస్టర్లు భారీగా షేర్లను విక్రయించడంతో, అమెరికన్ మార్కెట్లలో ఏకంగా $285 బిలియన్ల సంపద ఆవిరైపోయింది.

Published on: Feb 4, 2026, 11:13:15 IST
Advertisement

అంతర్జాతీయ మార్కెట్లను ఇప్పుడు 'ఏఐ' (Artificial Intelligence) భయం వెంటాడుతోంది. ప్రముఖ ఏఐ స్టార్టప్ 'ఆంత్రోపిక్' (Anthropic) విడుదల చేసిన ఒక కొత్త ఆటోమేషన్ టూల్, అమెరికా స్టాక్ మార్కెట్లలో పెను తుఫానును సృష్టించింది. మంగళవారం ఒక్కరోజే సాఫ్ట్‌వేర్, ఫైనాన్షియల్ సర్వీసెస్, అసెట్ మేనేజ్‌మెంట్ రంగాలకు చెందిన అమెరికన్ కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా 285 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 24 లక్షల కోట్లకు పైగా) పడిపోయింది. ఇక బుధవారం భారత స్టాక్ మార్కెట్లు కూడా తీవ్ర ప్రభావానికి లోనయ్యాయి. టీసీఎస్ 6 శాతం, ఇన్ఫోసిస్ 7 శాతం, హెచ్‌సీఎల్ 5 శాతం, విప్రో 4 శాతం, ఎల్‌టీఐఎం 7 శాతం నష్టపోయాయి.

వణికిపోయిన సాఫ్ట్‌వేర్ రంగం

కొత్త ఏఐ టూల్స్ తో పాత ఐటీ కంపెనీల్లో దడ
కొత్త ఏఐ టూల్స్ తో పాత ఐటీ కంపెనీల్లో దడ

మార్కెట్ ప్రారంభానికి ముందే ఆంత్రోపిక్ వెబ్‌సైట్‌లో వచ్చిన ఒక ప్రకటన ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. దీంతో ఎక్స్పీరియన్ (Experian), RELX, లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ వంటి దిగ్గజ సంస్థల షేర్లు కుప్పకూలాయి. గోల్డ్‌మన్ సాక్స్ విశ్లేషణ ప్రకారం.. అమెరికా సాఫ్ట్‌వేర్ స్టాక్స్ ఏకంగా 6 శాతం పతనమయ్యాయి. ఏప్రిల్ తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం ఇదే మొదటిసారి. అటు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ కూడా 7 శాతం మేర క్షీణించింది. నాస్‌డాక్ (Nasdaq) 100 ఇండెక్స్ ఒక దశలో 2.4 శాతం వరకు నష్టపోయింది.

సాంప్రదాయ సంస్థలకు ఏఐ ముప్పు?

ఆంత్రోపిక్ విడుదల చేసిన 'క్లాడ్ కోవర్క్' (Claude Cowork) అనే టూల్ ముఖ్యంగా లీగల్ (న్యాయ) రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. కాంట్రాక్టుల రివ్యూ, లీగల్ బ్రీఫింగ్స్ వంటి పనులను ఇది ఆటోమేట్ చేస్తుంది. ఇప్పటివరకు థామ్సన్ రాయిటర్స్, లీగల్‌జూమ్ వంటి సంస్థలు అందిస్తున్న సేవలకు ఇది ప్రత్యక్ష పోటీగా మారనుంది.

"ఏఐ రంగంలో ఎవరు విజేతలుగా నిలుస్తారు, ఎవరు బాధితులుగా మిగిలిపోతారు అనేది తేలిపోయే కీలక ఏడాది ఇది. ఏఐ దారికి అడ్డుగా నిలబడటం ప్రస్తుతం చాలా ప్రమాదకరం" అని బ్లూ వేల్ గ్రోత్ ఫండ్ సీఐఓ స్టీఫెన్ యూ వ్యాఖ్యానించారు.

పెరుగుతున్న పోటీ.. మారుతున్న సమీకరణాలు

ఒకవైపు ఏఐ భయాలు వెంటాడుతుంటే, మరోవైపు సాఫ్ట్‌వేర్ కంపెనీల ఆదాయాలు కూడా ఆశాజనకంగా లేవు. ఎస్ అండ్ పీ 500 (S&P 500) లోని సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో కేవలం 71 శాతం మాత్రమే అంచనాలను అందుకున్నాయి. మొత్తం టెక్ రంగంతో (85%) పోలిస్తే ఇది చాలా తక్కువ. దీనికి తోడు గూగుల్ (Alphabet) కూడా 'ప్రాజెక్ట్ జీనీ' వంటి టూల్స్‌ను తీసుకురావడం గేమింగ్ వంటి ఇతర రంగాల్లోనూ కలవరం రేపుతోంది.

మొత్తానికి, ఏఐ సాంకేతికత పాత తరం సాఫ్ట్‌వేర్ కంపెనీల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోందన్న ఆందోళన ఇన్వెస్టర్లలో స్పష్టంగా కనిపిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe