Assam floods : కంటతడి పెట్టిస్తున్న అసోం దుస్థితి.. వరదలకు విలవిల- రంగంలోకి సల్మాన్ ఖాన్!

Assam floods 2026 news : అసోంలో సంభవించిన భారీ వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఇప్పటివరకు మృతుల సంఖ్య 80కి చేరగా, బాధితులకు చేయూతనందించేందుకు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నేరుగా మైదానంలోకి దిగగా, ఆలియా భట్, భూమి పెడ్నేకర్ సహాయక చర్యలకై పిలుపునిచ్చారు.

Published on: Jul 31, 2026, 05:42:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈశాన్య రాష్ట్రమైన అసోంను ప్రళయకర వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ప్రవాహంతో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. గురువారం మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఏడాది వరదల వల్ల మరణించిన వారి సంఖ్య ఏకంగా 80కి చేరినట్లు అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏఎస్​డీఎంఏ) అధికారికంగా ధృవీకరించింది.

అసోం వరదల పరిస్థితి.. (abdul sajid)
అసోం వరదల పరిస్థితి.. (abdul sajid)

ప్రస్తుతం చరాయిదేవ్, గోలాఘాట్, జోర్‌హాట్, శివసాగర్ జిల్లాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. సుమారు 2.12 లక్షల మంది ప్రజలు ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం నాటికి నాలుగు జిల్లాల్లో 3 లక్షలకు పైగా ప్రజలు బాధితులుగా ఉండగా, గురువారానికి నీటి మట్టం కాస్త తగ్గడంతో బాధితుల సంఖ్య కొద్దిగా తగ్గడం ఊరటనిచ్చే అంశం. అయినప్పటికీ అనేక ప్రాంతాల్లో పరిస్థితులు ఇంకా ఆందోళనకరంగానే ఉన్నాయి.

చరాయిదేవ్ జిల్లా అత్యంత తీవ్రంగా దెబ్బతింది. అక్కడ దాదాపు 80,000 మంది వరద బారిన పడగా, శివసాగర్‌లో 71,000 మంది, జోర్‌హాట్‌లో 40,000 మంది ఆపదలో ఉన్నారు.

అసోం వరదలు- ముమ్మరంగా సహాయక చర్యలు

అసోం వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం 112 సహాయక శిబిరాలు, నిత్యావసర సరుకుల పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ శిబిరాల్లో 75,583 మందికి ఆశ్రయం కల్పిస్తున్నారు. భారత ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక శోధన సిబ్బంది, పోలీసులు, స్థానిక యంత్రాంగం ఉమ్మడిగా రంగంలోకి దిగి అప్పర్ అసోంలోని అనేక ప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

బాధితుల ఆకలి తీర్చేందుకు గత 24 గంటల్లో 918.55 క్వింటాళ్ల బియ్యం, 203.9 క్వింటాళ్ల పప్పు, 146.7 క్వింటాళ్ల ఉప్పుతో పాటు 17,546.4 లీటర్ల నువ్వుల నూనెను అధికారులు పంపిణీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 437 గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. 17,198 హెక్టార్ల పంట పొలాలు నాశనమయ్యాయి. వరద ప్రవాహానికి కాజ్‌వేలు, రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నుమాలిగఢ్ వద్ద ధన్సిరి నది ఇప్పటికీ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

మానవాళితో పాటు దాదాపు 2,97,384 పెంపుడు జంతువులు, పక్షులు కూడా ఈ ప్రళయంలో చిక్కుకున్నాయి!

అండగా నిలిచిన సల్మాన్ ఖాన్!

వరదలతో నరకయాతన అనుభవిస్తున్న అసోం ప్రజలకు బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ తనవంతు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా నిశ్శబ్దంగా ఆయన తన 'బీయింగ్ హ్యూమన్' స్వచ్ఛంద సంస్థ ద్వారా స్థానిక ఫ్యాన్ క్లబ్‌లతో కలిసి విడతల వారీగా సహాయక చర్యలు చేపట్టారు.

తొలి విడతగా వరద ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే తినడానికి వీలైన ఆహార ప్యాకెట్లు, నిత్యావసర వస్తువుల పంపిణీని ఇప్పటికే ప్రారంభించారు. రాబోయే వారాల్లో రేషన్ కిట్లు, మందులు, సురక్షిత తాగునీరు, శానిటరీ ప్యాడ్లు, దోమల నివారణ స్ప్రేలను బాధితులకు అందించనున్నారు. అంతేకాకుండా దెబ్బతిన్న పాఠశాలలు, ఆసుపత్రుల పునర్నిర్మాణానికి కూడా సల్మాన్ బృందం తోడ్పాటు అందించనుంది.

ఈ విధంగా సల్మాన్ ఖాన్ నేరుగా మైదానంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టడం పట్ల ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

స్పందించిన ఆలియా భట్, భూమి పెడ్నేకర్..

అసోం వరదల తీవ్రతపై నటి ఆలియా భట్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "మన దేశంలో చాలా ప్రాంతాలు వరదలతో విలవిలలాడుతున్నాయి, అందులో అసోం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. సర్వస్వం కోల్పోయిన వారికి తక్షణమే సహాయం అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది," అని ఇన్​స్టాగ్రామ్ వేదికగా ఆలియా పిలుపునిచ్చారు. ప్రతీ ఏటా ఈ ప్రకృతి విపత్తు వస్తున్నప్పటికీ మనం ఊహించని రీతిలో దెబ్బతింటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే నటి భూమి పెడ్నేకర్ సైతం అసోం పరిస్థితులపై వరుస వీడియోలను షేర్ చేస్తూ, బాధితులను ఆదుకోవడానికి విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More