బ్యాంకు పనుల కోసం రేపు (గురువారం) బయటకు వెళ్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పలు బ్యాంక్ యూనియన్లు పిలుపునిచ్చాయి. ఈ సమ్మె కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) ఇప్పటికే తన ఖాతాదారులను, స్టాక్ ఎక్స్ఛేంజీలను అప్రమత్తం చేసింది.
సమ్మెలో పాల్గొంటున్న సంఘాలు ఇవే..
ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI) సంయుక్తంగా ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. గురువారం నాడు దేశవ్యాప్తంగా విధులను బహిష్కరిస్తున్నట్లు ఈ సంఘాలు ప్రకటించాయి.
బ్యాంకులకు రేపు అధికారిక సెలవా?
ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే.. ఫిబ్రవరి 12న ప్రభుత్వం కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కానీ ఎలాంటి అధికారిక సెలవు ప్రకటించలేదు. ఇది కేవలం ఉద్యోగ సంఘాలు చేపట్టిన 'సమ్మె' మాత్రమే.
ప్రభుత్వ రంగ బ్యాంకులు: ఎస్బీఐ, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రభుత్వ బ్యాంకులపై సమ్మె ప్రభావం ఉండే అవకాశం ఉంది. బ్యాంకులు తమ కార్యకలాపాలను సాఫీగా నిర్వహించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, సిబ్బంది కొరత వల్ల సేవల్లో జాప్యం జరగవచ్చు.
ప్రైవేటు బ్యాంకులు: హెచ్డిఎఫ్సి (HDFC), ఐసీఐసీఐ (ICICI), యాక్సిస్ బ్యాంక్ మరియు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వంటి ప్రైవేటు బ్యాంకుల ఉద్యోగులు ఈ సంఘాలలో భాగం కాదు. కాబట్టి, ఈ బ్యాంకుల్లో సేవలు యథాతథంగా కొనసాగే అవకాశం ఉంది.
సమ్మెకు ప్రధాన కారణాలు ఏమిటి?
బ్యాంక్ ఉద్యోగులు ప్రధానంగా రెండు డిమాండ్ల కోసం ఈ పోరాటం చేస్తున్నారు.
{{/usCountry}}బ్యాంక్ ఉద్యోగులు ప్రధానంగా రెండు డిమాండ్ల కోసం ఈ పోరాటం చేస్తున్నారు.
{{/usCountry}}వారానికి 5 రోజుల పని: ప్రస్తుతం బ్యాంకులకు రెండో శనివారం, నాలుగో శనివారం మాత్రమే సెలవులు ఉంటున్నాయి. అయితే, అన్ని శనివారాలు సెలవు ఇవ్వాలని, వారానికి ఐదు రోజులే పని దినాలు ఉండాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. గతంలోనే దీనిపై ఐబీఏ (IBA) తో ఒప్పందం కుదిరినప్పటికీ, ప్రభుత్వం నుంచి అధికారిక నోటిఫికేషన్ రాకపోవడంపై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కొత్త లేబర్ కోడ్ల రద్దు: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్లను రద్దు చేయాలని వారు కోరుతున్నారు. ఇవి కార్మిక వర్గ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయని సంఘాలు ఆరోపిస్తున్నాయి.
గత నెలలోనూ ఇదే పరిస్థితి..
జనవరి 27న కూడా ఇదే తరహాలో దేశవ్యాప్త సమ్మె జరిగింది. అప్పట్లో రిపబ్లిక్ డే సెలవుల తర్వాత బ్యాంకులు తెరుచుకున్న వెంటనే సమ్మె జరగడంతో సాధారణ ప్రజలు నగదు ఉపసంహరణలు, ఇతర లావాదేవీల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మళ్లీ ఫిబ్రవరి 12న సమ్మె పిలుపునివ్వడంతో బ్యాంకింగ్ సేవలు ప్రభావితం కానున్నాయి.
ఖాతాదారులకు సూచన: డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ (UPI), నెట్ బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండకపోవచ్చు.