Rohit Sharma : రిలాక్స్ గాయ్స్.. రోహిత్​ శర్మ రిటైర్​ అవ్వట్లేదు- రూమర్స్​కి చెక్​ పెట్టిన బీసీసీఐ..

Rohit Sharma retirement : భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ వన్డే రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలను భారత క్రికెట్ నియంత్రణ మండలి తీవ్రంగా ఖండించింది. ఇంగ్లాండ్‌తో ఆదివారం లార్డ్స్ మైదానంలో జరగబోయే మూడో వన్డేనే రోహిత్‌కు చివరి మ్యాచ్ అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.

Published on: Jul 18, 2026, 05:25:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ.. వన్డే కెరీర్‌కు సంబంధించి గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో, క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున రేగిన దుమారానికి బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) చెక్ పెట్టింది. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో ఆదివారం జరగబోయే మూడో వన్డే మ్యాచ్ హిట్​ మ్యాన్​ కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ కాబోతోందంటూ వస్తున్న రూమర్లను బోర్డు పూర్తిగా కొట్టిపారేసింది.

రోహిత్ శర్మ.. (ANI)
రోహిత్ శర్మ.. (ANI)

'హిట్‌మ్యాన్' భవిష్యత్తుపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది.

నిజానికి గురువారం కార్డిఫ్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే.. రోహిత్ శర్మ వన్డేల నుంచి తప్పుకోబోతున్నాడనే వార్త దావానలంలా వ్యాపించింది. ప్రముఖ ఆంగ్ల పత్రిక 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' ప్రచురించిన కథనం ఈ సంచలనానికి కేంద్రబిందువైంది. దక్షిణాఫ్రికా వేదికగా 2027లో జరగబోయే వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్ శర్మ లేడని, యువ ఆటగాళ్లతో ముందుకెళ్లాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించుకుందని ఆ నివేదిక పేర్కొంది.

అంతేకాదు, వారం రోజుల క్రితమే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ విషయమై రోహిత్ శర్మతో స్వయంగా మాట్లాడారని, బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంపై రోహిత్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని ఆ పత్రిక తన కథనంలో రాసుకొచ్చింది. ఒక ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు ముందు సీనియర్ క్రికెటర్‌తో ఇలా వ్యవహరించడంపై రోహిత్ హర్ట్ అయ్యాడని పేర్కొంది. ఇంగ్లాండ్ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌ల్లో రోహిత్ తక్కువ స్కోర్లకే అవుట్ కావడం కూడా ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది.

బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా క్లారిటీ!

ఈ వార్తలు కాస్తా అభిమానుల్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టించడంతో బీసీసీఐ టాప్ మేనేజ్‌మెంట్ వెంటనే అప్రమత్తమైంది. సెలెక్టర్లు, కోచ్ తీసుకున్న విధానంపై తీవ్ర చర్చల అనంతరం బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా అధికారిక ప్రకటనతో రంగంలోకి దిగారు.

"మీడియాలో రోహిత్ శర్మ రిటైర్మెంట్​ గురించి ఎన్నో రకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. వాటన్నింటినీ నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఆదివారం లార్డ్స్ వేదికగా రోహిత్ శర్మ తన కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడబోతున్నాడనే అంశంపై బోర్డులో ఎలాంటి చర్చా జరగలేదు. రోహిత్ శర్మ భారత వన్డే జట్టులో ఒక రెగ్యులర్ సభ్యుడు. భవిష్యత్తు ప్రణాళికల్లో అతను ఉన్నంత కాలం దేశం తరఫున ఆడుతూనే ఉంటాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. లార్డ్స్ వన్డే రోహిత్‌కు చివరి మ్యాచ్ ఎంతమాత్రం కాదు," అని దేవాజిత్ సైకియా పీటీఐ వార్తా సంస్థతో పేర్కొన్నారు.

మరోవైపు 2023 ప్రపంచకప్ చేజారినప్పటి నుంచి ఎలాగైనా 2027 వన్డే వరల్డ్ కప్ ఆడి తీరాలనే గట్టి పట్టుదలతో రోహిత్ శర్మ ఉన్నాడు. అందుకోసం తన ఫిట్‌నెస్‌పై కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడు.

రోహిత్ శర్మకు బ్యాటింగ్ కోచ్ మద్దతు..

మరోవైపు, రోహిత్ శర్మ ఫామ్‌పై వస్తున్న విమర్శలను భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ తిప్పికొట్టారు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ విఫలమైనప్పటికీ, అతను ఎలాంటి ఒత్తిడిలో లేడని, ఫామ్ లేమితో బాధపడటం లేదని స్పష్టం చేశారు.

ఓపెనింగ్ స్థానం కోసం యశస్వి జైస్వాల్ లేదా ఇషాన్ కిషన్ వంటి యువ ఆటగాళ్లను పరిశీలిస్తారా అని ప్రశ్నించగా, కోటక్ గట్టిగా స్పందించారు.

"రోహిత్ శర్మ లాంటి స్థాయి ఉన్న ఆటగాడు ఎలాంటి ఒత్తిడికి లోనవుతాడని నేను అనుకోవడం లేదు. ఆ ఫీలింగ్ తెచ్చుకోవడానికి అతను చాలా గొప్ప ఆటగాడు. అవును, గత రెండు మ్యాచ్‌ల్లో అతను పరుగులు చేయలేదు, కానీ దానివల్ల ఎలాంటి తేడా రాదు. ఈ రోజు కూడా అతను మంచి ఇన్నింగ్స్ ఆడేలా కనిపించాడు, కానీ దురదృష్టవశాత్తు అవుటయ్యాడు. అంతమాత్రాన అతను ఇబ్బంది పడుతున్నాడని నేను అనను. బహుశా పిచ్‌పై డబుల్ బౌన్స్ కారణంగా అతను సాధారణంగా ఆడే షాట్లను ఆడటంలో కాస్త అసౌకర్యానికి గురై ఉండవచ్చు," అని సితాంశు కోటక్ మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More