...
...
Next Story

BSNL phone : ఐఫోన్ 17 కన్నా ఖరీదైన ఫోన్​ని లాంచ్​ చేసిన బీఎస్​ఎన్​ఎల్! ఎందుకు అంత కాస్ట్?

BSNL launches satellite phone : మొబైల్ సిగ్నల్స్ లేని మారుమూల ప్రాంతాలు, సముద్ర తీరాలు, దట్టమైన అడవుల్లోనూ నిరంతర కనెక్టివిటీని అందించే సరికొత్త శాటిలైట్ ఫోన్ సర్వీసును బీఎస్ఎన్ఎల్ విస్తరించింది. అత్యవసర రక్షణ రంగం, విపత్తు నిర్వహణ బృందాలతో పాటు సాహసయాత్రికులకు ఇది వరంగా మారనుంది. పూర్తి వివరాలు..

Published on: Jul 10, 2026, 10:43:59 IST
Advertisement

భారతదేశంలో టెలికాం నెట్‌వర్క్ ఎంతో విస్తరిస్తున్నప్పటికీ.. కొన్ని కొండ ప్రాంతాలు, లోతైన లోయలు, దట్టమైన అడవులు, సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికీ సాధారణ మొబైల్ సిగ్నల్స్ దొరకడం గగనంగానే మారుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు లేదా నల్లమల అడవుల్లోకి వెళ్లేటప్పుడు కూడా ఈ సిగ్నల్ సమస్యలను మనం గమనిస్తూనే ఉంటాము. ఇలాంటి నెట్‌వర్క్ లేని మారుమూల ప్రదేశాల్లో చిక్కుకుపోయినప్పుడు ప్రపంచంతో సంబంధాలు తెగిపోకుండా ఉండేందుకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్​ఎన్​ఎల్) ఒక అద్భుతమైన పరిష్కారాన్ని ముందుకు తెచ్చింది. గ్లోబల్ శాటిలైట్ కమ్యూనికేషన్ రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతూ ‘బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్’ని మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.

బీఎస్​ఎన్​ఎల్ శాటిలైట్ ఫోన్ లాంచ్- స్పెషాలిటీ ఇదే.. (Representational/ Unsplash)
బీఎస్​ఎన్​ఎల్ శాటిలైట్ ఫోన్ లాంచ్- స్పెషాలిటీ ఇదే.. (Representational/ Unsplash)

ఈ అత్యాధునిక హ్యాండ్‌సెట్ అంతర్జాతీయ ఉపగ్రహ దిగ్గజం 'ఇన్మార్​సాట్' శాటిలైట్ నెట్‌వర్క్ ఆధారంగా పనిచేస్తుంది. ఇది సాధారణ సిగ్నల్స్ లేని చోట నేరుగా అంతరిక్షంలోని ఉపగ్రహాల ద్వారా వాయిస్ కాల్స్, ఎస్ఎమ్ఎస్ సేవలను సులభతరం చేస్తుంది.

ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుంది?

బీఎస్​ఎన్​ఎల్ శాటిలైట్ ఫోన్‌ను విపత్కర పరిస్థితులను తట్టుకునేలా అత్యంత పటిష్టంగా రూపొందించారు.

రక్షణ, భద్రతా రంగాలు: సరిహద్దుల్లో పహారా కాసే సైనికులు, సముద్రంలో వేటకు వెళ్లే జాలర్లు, నావికాదళ సిబ్బందికి ఇది ఎంతగానో రక్షణ ఇస్తుంది.

విపత్తు నిర్వహణ: తుపాన్లు, భూకంపాలు సంభవించినప్పుడు సాధారణ కమ్యూనికేషన్ టవర్లు కూలిపోతాయి. అలాంటి సమయాల్లో ఎన్డీఆర్ఎఫ్ వంటి సహాయక బృందాలకు ఈ ఫోన్ ప్రాణాధారంగా మారుతుంది.

గనుల తవ్వకం, అడ్వెంచర్ ట్రావెల్: భూగర్భ గనుల్లో పనిచేసే నిపుణులు, ఎత్తైన పర్వతాలు అధిరోహించే సాహసయాత్రికులకు, పర్యాటకులకు అత్యవసర కనెక్టివిటీని అందిస్తుంది.

బీఎస్​ఎన్​ఎల్ శాటిలైట్ ఫోన్- ప్రాణాలు కాపాడే 'SOS' సేఫ్టీ ఫీచర్లు..

కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో, దారి తప్పిన సమయంలో రక్షణ కోరడానికి ఈ బీఎస్​ఎన్​ఎల్ శాటిలైట్​ ఫోన్‌లో ప్రత్యేకంగా 'SOS' ఎమర్జెన్సీ బటన్‌ను అమర్చారు. దీనిని నొక్కడం ద్వారా తక్షణమే సహాయక బృందాలకు సమాచారం అందుతుంది. అత్యంత స్పష్టమైన వాయిస్ కాలింగ్ ఫీచర్‌తో పాటు బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా ఎక్కువ సమయం వచ్చేలా దీనిని డిజైన్ చేశారు. భద్రతా పరంగా ఈ ఫోన్ ద్వారా మాట్లాడే ప్రతి సంభాషణ పూర్తిగా ఎన్‌క్రిప్ట్ చేసి ఉంటుంది. అంటే హ్యాకింగ్ లేదా సమాచారం లీక్ అయ్యే ప్రమాదం అస్సలు ఉండదు.

బీఎస్​ఎన్​ఎల్ శాటిలైట్ ఫోన్- ధర ఎంత? ఎక్కడ లభిస్తుంది?

ఈ ఫోన్ కోసం కస్టమర్లు తమకు దగ్గర్లోని బీఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించవచ్చు లేదా కంపెనీ కేటాయించిన ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను సంప్రదించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

సాధారణ ప్రజలతో పాటు ప్రైవేట్ సంస్థలకు కూడా ఈ గ్లోబల్ శాటిలైట్ ఫోన్ సర్వీసులను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. అయితే, దేశ రక్షణ- అంతర్గత భద్రతా కారణాల దృష్ట్యా ఈ ఫోన్ కనెక్షన్ తీసుకోవడానికి కఠినమైన నిబంధనలు ఉన్నాయి. కస్టమర్లు సాధారణ మొబైల్ సిమ్ కార్డు తరహాలోనే పూర్తి వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. వీటితో పాటు ఈ ఫోన్‌ను ఏ ప్రాంతంలో వాడుతున్నారు, ఎంత కాలం వాడుతారు, అసలు ఏ అవసరం కోసం కొనుగోలు చేస్తున్నారనే పూర్తి వివరాలను ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా సమర్పించాల్సి ఉంటుంది.

ఇక ప్లాన్ల విషయానికి వస్తే ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రూపంలో ప్రత్యేక ప్యాకేజీలు ఉన్నాయి.

ప్రభుత్వ రంగ వినియోగదారుల కోసం పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ ప్లాన్లు నెలకు రూ.3,500 ల నుంచే ప్రారంభమవుతాయి.

బీఎస్​ఎన్​ఎల్ శాటిలైట్ ఫోన్ కమర్షియల్ లేదా ప్రైవేట్ రంగ వినియోగదారుల కోసం కనీస ప్లాన్ నెలకు రూ.5,835 గా ఉంది. అవసరాన్ని బట్టి నెలకు రూ.11,670 విలువైన ప్రీమియం ప్లాన్లను కూడా ఎంచుకోవచ్చు.

అదనపు టాప్-అప్ వోచర్లు రూ.200 నుంచి రూ.10,000 ధరలో లభిస్తాయి.

సాధారణ మొబైల్ నెట్‌వర్క్‌ల పరిధి దాటి వెళ్లే కార్పొరేట్ సంస్థలకు, ప్రభుత్వ విభాగాలకు ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ ఒక తిరుగులేని ఆయుధంగా మారనుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe