Budget 2026 : ఎస్టీటీ పెంపుతో స్టాక్ మార్కెట్లు క్రాష్- ఆ స్టాక్స్లో రక్తపాతం!
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్కి సంబంధించి ఎస్టీటీని పెంచుతున్నట్టు నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ 2026 ప్రసంగంలో ప్రకటించారు. ఫలితంగా స్టాక్ మార్కెట్లు క్రాష్ అయ్యాయి. మరీ ముఖ్యంగా కొన్ని స్టాక్స్ 10శాతం కన్నా ఎక్కువ నష్టపోయాయి.
కేంద్ర బడ్జెట్ 2026లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు, ముఖ్యంగా డెరివేటివ్స్ (ఎఫ్ అండ్ ఓ) ట్రేడర్లకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గట్టి షాక్ ఇచ్చారు. మార్కెట్లో మితిమీరిన ఊహాజనిత ట్రేడింగ్ను అరికట్టేందుకు సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్టీటీ)ని పెంచుతున్నట్లు ఆమె ప్రకటించారు. ఫలితంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవారు ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

తాజా పరిణామాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.
బడ్జెట్ 2026- పెరిగిన పన్నుల వివరాలు..
ఫ్యూచర్స్: ఫ్యూచర్స్ ట్రేడింగ్పై ఎస్టీటీని 0.05 శాతానికి పెంచారు.
ఆప్షన్స్: ఆప్షన్స్ ట్రేడింగ్పై పన్నును ఏకంగా 0.15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ పెంపునకు ముందు ఫ్యూచర్స్పై ఎస్టీటీ 0.02శాతంగా ఉండేది. ఆప్షన్స్పై ఎస్టీటీ 0.01శాతంగా ఉండేది. అంటే ఒకేసారి 50శాతం పెంచినట్టు.
ట్రేడింగ్ పరిమాణం ఎక్కువగా ఉండే భారీ ట్రేడర్లకు, తరచుగా బై అండ్ సెల్ చేసే స్కాల్పర్లకు ఈ తాజా ఎస్టీటీ పెంపు భారంగా మారనుంది. లాభాల్లో పన్ను వాటా పెరగడంతో నికర లాభం తగ్గే అవకాశం ఉంది.
ఎందుకు ఈ నిర్ణయం?
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రిటైల్ ఇన్వెస్టర్లు ఎటువంటి అవగాహన లేకుండా ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్లో భారీగా నష్టపోతున్నారు. ఈ ధోరణిని అరికట్టేందుకు, స్వల్పకాలిక ట్రేడింగ్ను నిరుత్సాహపరిచి, దీర్ఘకాలిక పెట్టుబడులను ప్రోత్సహించేందుకే ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. అలాగే దీని ద్వారా ప్రభుత్వానికి అదనపు పన్ను ఆదాయం కూడా సమకూరనుంది.
“గతేడాది ఎస్టీటీని పెంచారు. ఇప్పుడు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్పై మళ్లీ ఎస్టీటీని పెంచుతున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. ఇది ట్రేడర్లు, ఇన్వెస్టర్లు, హెడ్జర్లపై అదనపు భారం వేస్తుంది. దీని వల్ల డెరివేటివ్స్లో యాక్టివిటీ తగ్గొచ్చు. ఫలితంగా వాల్యూమ్స్ పడిపోవచ్చు. అయితే, ఆదాయం పెంచుకునేందుకు కాకుండా, వాల్యూమ్స్ని తగ్గించే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది,” అని కొటాక్ సెక్యూరిటీస్ ఎండీ అండ్ సీఈఓ శ్రీపాల్ షా తెలిపారు.
పన్నుల విషయంలో ఊరట లభిస్తుందని ఆశిస్తే.. కేంద్ర ఎస్టీటీని పెంచి షాక్ ఇచ్చిందని రెలిగేర్ బ్రోకింగ్కి సంబంధించిన అజిత్ మిశ్రా తెలిపారు.
“ఎస్టీటీ పెంపు వల్ల మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్గా మారింది. డైలీ వాల్యూమ్స్లో డెరివేటివ్స్ సెగ్మెంట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు ఎస్టీటీని పెంచితే ట్రేడింగ్ ప్రాఫిటెబులిటీ తగ్గిపోతుంది. యాక్టివ్ ట్రేడర్లు తగ్గిపోతారు. దీని వల్ల లిక్విడిటీ తగ్గిపోతుంది,” అని ఆయన అన్నారు.
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
నిర్మలా సీతారామన్ ఎస్టీటీ ప్రకటన అనంతరం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల సమయానికి నిఫ్టీ50 410 పాయింట్ల నష్టంతో 25,009 వద్ద కొనసాగుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ 1221 పాయింట్లు కోల్పోయి 81,345 వద్దకు చేరింది. బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 1.2శాతం నష్టాలతో 58,864 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్పై ఎస్టీటీ పెంపు నిర్ణయంతో గ్రో, ఏంజిల్ వన్ వంటి బ్రోకరేజ్ సంస్థలతో పాటు బీఎస్ఈ స్టాక్ పతనమైంది.
ఏంజిల్ వన్, బీఎస్ఈ షేర్లు 10శాతం నష్టాల్లోకి వెళ్లాయి. గ్రో షేర్లు 9శాతం మేర నష్టపోయాయి. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ స్టాక్ దాదాపు 5శాతం డౌన్ అయ్యింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


