కాలిఫోర్నియాలో భారీ వర్షాలు, వరదలు.. లాస్ ఏంజెల్స్‌లో కొనసాగుతున్న తరలింపులు

అమెరికాలోని కాలిఫోర్నియాలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. లాస్ ఏంజెల్స్‌లో తరలింపు ఆదేశాలను పొడిగించగా, వేలాది ఇళ్లకు విద్యుత్ నిలిచిపోయింది. విమాన ప్రయాణాలు, రహదారులు స్తంభించడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Published on: Dec 27, 2025, 06:07:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో అల్లాడిపోతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వానలతో జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా లాస్ ఏంజెల్స్ (LA) కౌంటీలో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో, అధికారులు తరలింపు ఆదేశాలను (Evacuation orders) పొడిగించారు. క్రిస్మస్ సెలవుల సమయంలో ఈ ప్రకృతి ప్రకోపం పర్యాటకులను, స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.

డిసెంబర్ 26, 2025న అమెరికాలోని కాలిఫోర్నియాలోని రైట్‌వుడ్‌లో భారీ వర్షాల కారణంగా మట్టిలో కూరుకుపోయిన కారు (REUTERS)
డిసెంబర్ 26, 2025న అమెరికాలోని కాలిఫోర్నియాలోని రైట్‌వుడ్‌లో భారీ వర్షాల కారణంగా మట్టిలో కూరుకుపోయిన కారు (REUTERS)

తీరప్రాంతంపై ఆకస్మిక వరద ముప్పు

శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మధ్యస్థం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ హెచ్చరించింది. మాలిబు నుంచి వెస్ట్ హాలీవుడ్ వరకు ఆకస్మిక వరద హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం ఉదయం నాటికి ఉత్తర కాలిఫోర్నియాలో సుమారు 50,000 ఇళ్లు, వ్యాపార సంస్థలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరద ఉధృతికి కొట్టుకుపోతున్న ఒక మహిళను లాస్ ఏంజెల్స్ అగ్నిమాపక సిబ్బంది హెలికాప్టర్ ద్వారా అత్యంత సాహసోపేతంగా రక్షించారు.

కార్చిచ్చు గాయాలు.. వరద ముప్పును పెంచుతున్నాయి

దాదాపు ఏడాది క్రితం ఈ ప్రాంతంలో సంభవించిన భారీ కార్చిచ్చులే ప్రస్తుత వరద తీవ్రతకు ప్రధాన కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. అగ్నిప్రమాదాల వల్ల చెట్లు, మొక్కలు కాలిపోయి నేల పూర్తిగా గట్టిపడిపోయింది.

"ఆ ప్రాంతంలోని నేల ఇంకా నీటిని పీల్చుకోలేని స్థితిలో (Hydrophobic) ఉంది. అంటే వర్షం పడగానే నీరు భూమిలోకి ఇంకకుండా, కాంక్రీటుపై పారినట్లుగా వేగంగా ప్రవహిస్తోంది. ఇలాంటి 'బర్న్ స్కార్స్' (Burn scars) కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది" అని వాతావరణ నిపుణుడు స్కాట్ క్లీబౌర్ వివరించారు.

దీనివల్ల కొండచరియలు విరిగిపడటం, మట్టి ప్రవాహాలు (Mudslides) పెరగడం వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి.

స్తంభించిన ప్రయాణాలు.. విరిగిపడుతున్న కొండచరియలు

సెలవుల వేళ విమాన ప్రయాణాలు ఆలస్యమవుతున్నాయి. రహదారులు నీటమునగడం, చెట్లు కూలడం, మట్టి దిబ్బలు పేరుకుపోవడంతో లాస్ ఏంజెల్స్ పరిసరాల్లో డజన్ల కొద్దీ రోడ్లను మూసివేశారు. మౌంట్ బాల్డీ వంటి పర్వత ప్రాంతాల్లో 6 అంగుళాల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రైట్‌వుడ్ వంటి చోట్ల మట్టి ప్రవాహాలు రోడ్లను ముంచెత్తాయి.

మరోవైపు పర్వత ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. మామత్ మౌంటైన్, లేక్ తాహో వంటి స్కీ రిసార్టుల వద్ద 12 నుంచి 31 అంగుళాల కొత్త మంచు పేరుకుపోయింది. బలమైన గాలుల వల్ల కంటిచూపు కూడా ఆనని రీతిలో (White out conditions) వాతావరణం ఉండటంతో పర్వత ప్రాంతాల్లో ప్రయాణాలు ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు.

రికార్డు స్థాయిలో వర్షపాతం

పసిఫిక్ సముద్రం నుంచి వచ్చే భారీ తేమతో కూడిన మేఘాలు (Atmospheric Rivers) ఈ అకాల వర్షాలకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఏడాది క్రిస్మస్ సమయంలో కురిసిన వర్షాలు 1971 నాటి రికార్డులను అధిగమించాయి. 1877 తర్వాత అత్యంత భారీ వర్షాలు కురిసిన నాల్గవ క్రిస్మస్ సీజన్‌గా ఇది నమోదైంది. ఈ తుపానుల కారణంగా ఇప్పటివరకు కనీసం ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అయితే శుక్రవారం సాయంత్రం నుంచి వర్షాల ఉధృతి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఊరటనిచ్చే వార్త చెప్పింది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More