...
...
Next Story

ఢిల్లీ ఎర్ర కోట దగ్గర కారు బాంబు పేలుడు.. 8 మంది మృతి

ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడులో 8 మంది మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పలు కీలక నగరాలు, ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూడండి.

Published on: Nov 10, 2025, 20:44:47 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం (నవంబర్ 10) సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. పార్కింగ్ చేసిన కారులో శక్తివంతమైన పేలుడు జరగడంతో కనీసం 8 మంది మరణించారు. 24 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. వీళ్లను హాస్పిటల్ కు తరలించగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ పేలుడు కారణంగా పక్కనే ఉన్న అనేక వాహనాలకు మంటలు అంటుకున్నాయి.

ఎర్రకోట మెట్రో వద్ద బీభత్సం

ఢిల్లీ ఎర్ర కోట దగ్గర కారు బాంబు పేలుడు.. 8 మంది మృతి (Sanjeev Verma/HT Photo)
ఢిల్లీ ఎర్ర కోట దగ్గర కారు బాంబు పేలుడు.. 8 మంది మృతి (Sanjeev Verma/HT Photo)

ఢిల్లీలోని ఎర్ర కోట మెట్రో స్టేషన్ దగ్గర సోమవారం (నవంబర్ 10) సాయంత్రం 6.52 గంటల ప్రాంతంలో ఈ పేలుడు జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. రెడ్ సిగ్నల్ దగ్గర కారు మెల్లగా కదులుతున్న సమయంలో ఈ పేలుడు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. దీంతో ఆత్మాహుతి దళాల ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నారు. పేలుడు జరిగిన వెంటనే ఎన్ఐఏ సహా ఢిల్లీ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా రంగంలోకి దిగింది.

పేలుడు జరిగిన చోటుకు 70 మీటర్ల దూరంలోనే గౌరీ శంకర్ ఆలయం ఉంది. కార్తీక సోమవారం కావడంతో పెద్ద ఎత్తున జనం గుడికి వచ్చారు. ఢిల్లీలో 14 ఏళ్ల కిందట హైకోర్టు దగ్గర జరిగిన పేలుడు తర్వాత మళ్లీ ఇలాంటి పేలుళ్లు ఇదే తొలిసారి.

లాల్ ఖిలా (Lal Quila) మెట్రో స్టేషన్ గేట్ నెం. 1 సమీపంలో జరిగిన ఈ పేలుడు తీవ్రతకు కొన్ని మీటర్ల దూరంలో ఉన్న వాహనాల అద్దాలు కూడా పగిలిపోయాయి. సమీప భవనాలకు కూడా పేలుడు శబ్దం గట్టిగా వినిపించింది.

ఢిల్లీ అగ్నిమాపక సేవల ప్రకారం ఈ పేలుడుతో మూడు నుంచి నాలుగు వాహనాల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే ఏడు ఫైర్ టెండర్లను ఘటనా స్థలానికి పంపారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని మూసివేసి, నగరం అంతటా హై అలర్ట్ ప్రకటించారు.

పేలుడు తర్వాత ఢిల్లీ అధికారులు హై అలర్ట్ ప్రకటించగా, ముంబైలోని మహారాష్ట్ర, కోల్‌కతా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.

పోలీస్ చీఫ్ సతీష్ గోల్చా మాట్లాడుతూ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో తాను సంప్రదింపుల్లో ఉన్నానని, పేలుడు గురించి ఆయనకు నిరంతరం సమాచారం అందిస్తున్నామని విలేకరులకు తెలిపారు.

పేలుడులో గాయపడిన ఒక ఆటో డ్రైవర్ పీటీఐతో మాట్లాడుతూ, "నా ముందున్న కారు రెండు అడుగుల దూరంలో ఉంది. అందులో బాంబు ఉందో లేక మరేదైనా ఉందో నాకు తెలియదు. కానీ అది పేలింది. అది స్విఫ్ట్ డిజైర్ కారు" అని వెల్లడించారు.

మోదీ, అమిత్ షా ఆరా

ఢిల్లీ పేలుడు ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోదీ కూడా అమిత్ షాను ఈ పేలుడు ఘటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు.

ఈ పేలుడు సరిగ్గా జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇతర ఏజెన్సీలతో కలిసి ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టిన రోజునే జరగడం గమనార్హం. జైష్-ఎ-మొహమ్మద్ (Jaish-e-Mohammed), అన్సార్ గజ్వత్-ఉల్-హింద్ (Ansar Ghazwat-ul-Hind)లకు సంబంధించిన ఒక ఉగ్రవాద మాడ్యూల్‌ను కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న ఫరీదాబాద్‌లో ఛేదించి, ముగ్గురు వైద్యులతో సహా ఎనిమిది మందిని అరెస్టు చేశారు.

ఈ ఉగ్రవాద మాడ్యూల్‌ను పట్టుకున్నప్పుడు ధౌజ్ గ్రామంలోని ఒక డాక్టర్ అద్దెకు తీసుకున్న ఇంట్లో 360 కిలోల పేలుడు పదార్థాలు, ఆయుధాలు కూడా దొరికాయి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe