బోర్డు పరీక్షల మూల్యాంకనంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది సీబీఎస్ఈ. 2026 నుంచి 12వ తరగతి సమాధాన పత్రాలను 'ఆన్-స్క్రీన్ మార్కింగ్' (ఓఎస్ఎం) విధానంలో డిజిటల్గా దిద్దాలని నిర్ణయించింది. దీనివల్ల ఫలితాల వెల్లడిలో వేగం, పారదర్శకత పెరుగుతాయని బోర్డు చెబుతోంది.
సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) బోర్డు పరీక్షల మూల్యాంకన ప్రక్రియను మరింత ఆధునీకరించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈ 2026 విద్యా సంవత్సరం నుంచే 12వ తరగతి బోర్డు పరీక్షల పేపర్లను ఆన్లైన్ విధానంలో (ఆన్-స్క్రీన్ మార్కింగ్) దిద్దనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే, 10వ తరగతి విద్యార్థులకు మాత్రం ప్రస్తుతానికి పాత పద్ధతిలోనే (భౌతికంగా) మూల్యాంకనం కొనసాగుతుందని స్పష్టం చేసింది.
సీబీఎస్ఈ నుంచి బిగ్ అప్డేట్.. (HT_PRINT)
సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు 2026- ఏంటీ ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్?
ఈ పద్ధతిలో విద్యార్థుల సమాధాన పత్రాలను స్కాన్ చేసి డిజిటల్ రూపంలోకి మారుస్తారు. ఉపాధ్యాయులు కంప్యూటర్ స్క్రీన్పైనే ఆ పత్రాలను చూస్తూ మార్కులు వేస్తారు. దీనివల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు..
తప్పులకు తావుండదు: మార్కుల లెక్కింపులో (టోటలింగ్) మనుషుల వల్ల జరిగే పొరపాట్లు పూర్తిగా తొలగిపోతాయి.
వేగవంతమైన ఫలితాలు: మాన్యువల్ పద్ధతి కంటే ఇది వేగంగా పూర్తవుతుంది. ఫలితంగా ఫలితాల వెల్లడిలో జాప్యం ఉండదు.
టీచర్లకు వెసులుబాటు: ఉపాధ్యాయులు తమ సొంత స్కూళ్ల నుంచే మూల్యాంకనం చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల సాధారణ బోధన పనులకు ఆటంకం కలగదు.
వెరిఫికేషన్ అవసరం ఉండదు: డిజిటల్ పద్ధతిలో మార్కులు వేయడం వల్ల, ఫలితాల తర్వాత మళ్లీ రీ-వెరిఫికేషన్ లేదా మార్కుల లెక్కింపు కోసం దరఖాస్తు చేసుకునే అవసరం ఉండదని బోర్డు పేర్కొంది.
సీబీఎస్ఈ పరీక్షలు 2026- స్కూళ్లకు బోర్డు ఆదేశాలు..
ఈ నూతన విధానానికి అనుగుణంగా పాఠశాలలు తమ కంప్యూటర్ ల్యాబ్లను సిద్ధం చేసుకోవాలని సీబీఎస్ఈ సూచించింది. కనీసం 4జీబీ ర్యామ్, విండోస్ 8 అంతకంటే పై వెర్షన్ ఉన్న సిస్టమ్స్, కనీసం 2 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ వేగం, నిరంతర విద్యుత్ సరఫరా వంటి సదుపాయాలు ఉండాలని స్పష్టం చేసింది.
అంతేకాదు, ఉపాధ్యాయులకు ఈ కొత్త సిస్టమ్పై పట్టు వచ్చేలా సీబీఎస్ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనుంది. ట్రైనింగ్ వీడియోలతో పాటు ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే పరిష్కరించడానికి ప్రత్యేకంగా కాల్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తోంది.
సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17న ప్రారంభంకానున్నాయి. ప్రస్తుతం భారత్ సహా 26 దేశాల్లో సుమారు 46 లక్షల మంది విద్యార్థులు సీబీఎస్ఈ పరీక్షలు రాస్తున్నారు. ఈ భారీ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది.