ఓఎస్‌ఎం టెండర్లపై సీబీఎస్‌ఈని నిలదీసిన ఎంపీలు.. బాధ్యులపై చర్యలకు డిమాండ్

ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) టెండర్ల ప్రక్రియలో జరిగిన అవకతవకలపై పార్లమెంటరీ కమిటీ సమావేశంలో సీబీఎస్‌ఈ అధికారులు నీళ్లు నమలడం తీవ్ర కలకలం రేపింది. ఒక ఇంటర్ విద్యార్థి లేవనెత్తిన సాంకేతిక ఆధారాలకు సమాధానం చెప్పలేక అధికారులు చేతులెత్తేయడంతో ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published on: Jun 3, 2026, 09:42:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) వివాదాస్పద ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానంపై పార్లమెంటరీ కమిటీ ముందు బుక్కయింది. టెండర్ల కేటాయింపులో జరిగిన లోపాలపై ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి సంధించిన ప్రశ్నలకు బోర్డు అధికారులు నీళ్లు నమలడం తీవ్ర దుమారం రేపింది. మంగళవారం జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ ఉదంతం చోటుచేసుకోగా.. ఇందుకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఉన్నతాధికారుల పదవులు ఊడాల్సిందేనని ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్లమెంటరీ కమిటీ ముందుకు సార్థక్ సిద్దాంత్
పార్లమెంటరీ కమిటీ ముందుకు సార్థక్ సిద్దాంత్

గత ఏడాది (2025) ఫిబ్రవరి నుంచి ఆగస్టు మధ్య కాలంలో జారీ చేసిన మూడు ఓఎస్‌ఎం టెండర్లకు సంబంధించిన పూర్తి రికార్డులను సమర్పించాలని ‘విద్య, మహిళలు, చిన్నారులు, యువజన, క్రీడల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ’ ఆదేశించింది. ఇందులో ప్రీ-బిడ్ వివరణలు, సాంకేతిక, ఆర్థిక మూల్యాంకన వివరాలు, కాంట్రాక్ట్ రద్దు లేదా కేటాయింపు పత్రాలు ఉన్నాయి. అయితే, అధికారులు ఈ కీలక పత్రాలను దాచిపెట్టి, కేవలం టెండర్ల తేదీల కాలపట్టికను మాత్రమే కమిటీ ముందు ఉంచడం గమనార్హం.

నిబంధనల సవరణపై అధికారుల తడబాటు

టెండర్ దక్కించుకున్న సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టే అధికారాన్ని సీబీఎస్‌ఈకి తొలగిస్తూ 2025 సెప్టెంబర్ 20న జారీ చేసిన సవరణ (కొరిజెండం)పై ఎంపీలు గట్టిగా నిలదీశారు. అయితే, అక్కడికి వచ్చిన అధికారుల్లో చాలామందికి ఈ మార్పు గురించిన కనీస అవగాహన కూడా లేకపోవడం గమనార్హం. ఆగస్టులో విడుదల చేసిన టెండర్‌లో బ్లాక్‌లిస్ట్ నిబంధన ఉన్నప్పటికీ, సెప్టెంబర్ 20 నాటి సవరణలో దానిని ఎందుకు తొలగించారో చెప్పడానికి అధికారులు తడబడ్డారు. ఆ తర్వాత డిసెంబర్ 5న కోఎంప్ట్ ఎడ్యు టెక్ (Coempt Edu Teck) సంస్థకు ఈ కాంట్రాక్ట్ దక్కింది. 12వ తరగతి బోర్డు పరీక్షల్లో ఓఎస్‌ఎం విధానం అమలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించేందుకు ఈ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

సీబీఎస్‌ఈ గుట్టురట్టు చేసిన 17 ఏళ్ల విద్యార్థి

ఈ సమావేశంలో 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థి సార్థక్ సిద్ధాంత్ కమిటీ ముందుకు వచ్చి, ఓఎస్‌ఎం టెండర్ల ప్రక్రియలోని లొసుగులను ఆధారాలతో సహా వివరించారు. టెండర్ పత్రాలను లోతుగా అధ్యయనం చేసిన సార్థక్.. సీబీఎస్‌ఈ మొత్తం మూడు వేర్వేరు టెండర్లను పిలిచిందని తెలిపారు. 2025 ఫిబ్రవరిలో వేసిన మొదటి టెండర్ విజయవంతం కాకపోవడంతో రద్దు చేశారు. మే నెలలో వేసిన రెండో టెండర్‌కు నాలుగు బిడ్లు వచ్చినా ఎవరికీ కేటాయించలేదు. ఇక ఆగస్టులో వేసిన మూడో టెండర్‌లో ర్యాంక్‌గురు, టీసీఎస్, కోఎంప్ట్ సంస్థలు పోటీ పడగా.. టెక్నికల్ రౌండ్‌లో ర్యాంక్‌గురు అర్హత సాధించకపోవడంతో కోఎంప్ట్‌కు కాంట్రాక్ట్ దక్కింది.

నిబంధనలు ఎందుకు మార్చారు?

మే నెల టెండర్‌తో పోలిస్తే ఆగస్టు నాటి టెండర్‌లో అర్హత ప్రమాణాలను పూర్తిగా మార్చేశారని సార్థక్ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. మే నెల టెండర్‌లో ప్రైమరీ, సెకండరీ టైర్-3 డేటా సెంటర్ల యాజమాన్య హక్కులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వగా, చివరి టెండర్‌లో ఆ నిబంధనను నీరుగార్చారు. అలాగే సాఫ్ట్‌వేర్ పూర్తి సోర్స్ కోడ్‌పై బిడ్డర్లకు యాజమాన్య హక్కులు ఉండాలనే నిబంధనను కూడా ఆగస్టు టెండర్ నుంచి తొలగించారని సార్థక్ వివరించారు. ప్రాజెక్ట్ పరిమాణం, స్కానింగ్ సామర్థ్యం వంటి సాంకేతిక పారామితులను మార్చి, కేవలం ప్రాసెస్ చేసిన ఆన్సర్ బుక్స్, పూర్తి చేసిన ప్రాజెక్టుల సంఖ్యకే ప్రాధాన్యత ఇచ్చారని.. ఇది కొందరికి లబ్ధి చేకూర్చేలా ఉందన్న అనుమానాలను లేవనెత్తారు.

అంతేకాదు, గతంలో జరిగిన ఆన్‌మార్క్స్ డేటా లీక్‌లో బయటపడిన జవాబు పత్రాలపై నీడలు, మడతలు కనిపిస్తున్నాయని.. వాటిని స్కానర్లతో కాకుండా మొబైల్ కెమెరాలతో ఫోటోలు తీసినట్లు స్పష్టమవుతోందని సార్థక్ వివరించారు.

'ప్రస్తుతానికి నా దగ్గర సమాచారం లేదు'

విద్యార్థి లేవనెత్తిన ఈ నిర్దిష్ట సాంకేతిక అంశాలపై ఎంపీలు సీబీఎస్‌ఈ అధికారులను వరుస ప్రశ్నలతో ముంచెత్తారు.

“ప్రస్తుతానికి నా దగ్గర దీనికి సంబంధించిన పూర్తి వివరాలు లేవు, కేవలం నా జ్ఞాపకశక్తి ఆధారంగానే చెబుతున్నాను” అని అప్పటి సీబీఎస్‌ఈ ఛైర్మన్ రాహుల్ సింగ్ (ప్రస్తుతం ఈయన బదిలీ అయ్యారు) కమిటీకి తెలిపారు.

సార్థక్ అడిగిన పాయింట్లకు సమాధానం చెప్పకుండా, ప్రభుత్వ సాధారణ కొనుగోలు నిబంధనలను మాత్రమే ఆయన వివరించారు. టెండర్లు విజయవంతం కావడానికే ఈ మార్పులు చేశామని సమర్థించుకునే ప్రయత్నం చేశారు.

ఎంపీల అసంతృప్తి.. తదుపరి చర్యలపై స్పష్టత

సమావేశంలో సీబీఎస్‌ఈ అధికారులు టెండర్ ప్రక్రియను వదిలేసి, విధానపరమైన సవాళ్లపైనే ఎక్కువ మాట్లాడారు. రీ-ఇవాల్యుయేషన్ పోర్టల్‌లో పేమెంట్ వైఫల్యాలు జరిగాయని, ఓఎస్‌ఎం ప్లాట్‌ఫామ్‌పై సైబర్ దాడి కూడా జరిగిందని అంగీకరించారు. అయితే తాము ప్రస్తుతం విద్యార్థుల పునఃసమీక్ష సేవలపైనే దృష్టి పెట్టామని చెప్పుకొచ్చారు. అధికారుల సమాధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎంపీలు.. ఈ లోపాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.

“బాధిత విద్యార్థుల్లో ఒకడైన సార్థక్ సిద్ధాంత్ తన ప్రెజెంటేషన్‌ను కమిటీ ముందు ఉంచారు. సీబీఎస్‌ఈ ఇచ్చిన సమాధానాలపై కమిటీ త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తుంది. మొత్తం కమిటీ దీనిపై ఆందోళనతో ఉంది, విద్యార్థుల ప్రయోజనాలే పరమావధిగా తగిన చర్యలు తీసుకుంటాం” అని సమావేశం అనంతరం కాంగ్రెస్ ఎంపీ, కమిటీ ఛైర్మన్ దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు.

టెండర్ మార్పుల వెనుక ఉన్న అసలు కారణాలను బోర్డు అధికారులు వివరించలేకపోవడంతో కమిటీలోని ఏ ఒక్క ఎంపీ కూడా సంతృప్తి చెందలేదు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. సీబీఎస్‌ఈ ఓఎస్‌ఎం (OSM) వివాదం ఏమిటి? 12వ తరగతి జవాబు పత్రాల డిజిటల్ మూల్యాంకనం కోసం తీసుకొచ్చిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానం టెండర్ల కేటాయింపులో తీవ్ర అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. నిబంధనలను ఉద్దేశపూర్వకంగా మార్చారనే అంశంపై పార్లమెంటరీ కమిటీ విచారణ జరుపుతోంది.

2. పార్లమెంటరీ కమిటీ ముందు విద్యార్థి ఏ అంశాలను లేవనెత్తాడు? 17 ఏళ్ల విద్యార్థి సార్థక్ సిద్ధాంత్ టెండర్ నిబంధనలను ఒక నిర్దిష్ట సంస్థకు లబ్ధి చేకూర్చేలా మార్చారని, డేటా సెంటర్ యాజమాన్య హక్కులు, సోర్స్ కోడ్ నిబంధనలను నీరుగార్చారని ఆధారాలతో సహా నిరూపించాడు.

3. టెండర్ నిబంధనలలో జరిగిన ప్రధాన మార్పు ఏమిటి? 2025 సెప్టెంబర్ 20 నాటి సవరణ ద్వారా సదరు కాంట్రాక్ట్ సంస్థ తప్పు చేస్తే బ్లాక్‌లిస్ట్‌లో పెట్టే అత్యంత కీలకమైన అధికారాన్ని సీబీఎస్‌ఈ స్వయంగా తొలగించుకుంది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More