సీబీఎస్ఈ కీలక నిర్ణయం: ఆ విద్యార్థులకు 'మూడు భాషల' విధానం నుండి మినహాయింపు
జాతీయ విద్యా విధానం (NEP) 2020లో భాగంగా ప్రతిపాదించిన మూడు భాషల సూత్రం అమలుపై ప్రస్తుత 9వ తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ ఒకేసారి సడలింపు ప్రకటించింది. ఇతర నాన్-నేటివ్ భాషలను ఎంచుకున్న విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్రస్తుత విద్యాసంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పెద్ద ఉపశమనం కలిగించింది. జాతీయ విద్యా విధానం (NEP) 2020 కింద ప్రతిపాదించిన మూడు భాషల సూత్రాన్ని (Three-Language Formula) అమలు చేయడంలో ఒకేసారి మినహాయింపు (One-time relaxation) ఇస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. పరివర్తన కాలంలో (Transitional period) విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ తాత్కాలిక సడలింపులు ఇచ్చినట్లు బోర్డు స్పష్టం చేసింది.

ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం, రెండు నాన్-నేటివ్ భాషలను (ఉదాహరణకు ఇంగ్లీష్, ఫ్రెంచ్) ఎంచుకున్న 9వ తరగతి విద్యార్థులు అదే కాంబినేషన్ను కొనసాగించవచ్చు. అయితే, వారు మూడవ భాషగా ఒక భారతీయ భాషను అదనంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. "ఈ మార్పుల వల్ల ఏ విద్యార్థి కూడా నష్టపోకూడదు" అని బోర్డు స్పష్టం చేసింది. ఈ అదనపు మూడవ భాషకు స్కూల్ స్థాయిలోనే అంతర్గత మూల్యాంకనం (Internal assessment) ఉంటుంది తప్ప, ఈ బ్యాచ్ విద్యార్థులు 2027-28లో 10వ తరగతికి వెళ్లినప్పుడు ఎలాంటి సీబీఎస్ఈ బోర్డు పరీక్ష రాయాల్సిన అవసరం లేదు.
వివాదాస్పద సర్క్యులర్ - నేపథ్యం
అంతకుముందు మే 15న సీబీఎస్ఈ ఒక సర్క్యులర్ జారీ చేస్తూ, అనుబంధ పాఠశాలలన్నీ జూలై 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు మూడు భాషలను తప్పనిసరి చేయాలని ఆదేశించింది. ఇందులో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలని స్పష్టం చేసింది. అయితే ఎన్సీఈఆర్టీ (NCERT) ప్రత్యేక పాఠ్యపుస్తకాలను విడుదల చేసే వరకు ఈ విధానాన్ని నిలిపివేయాలని డిసెంబర్ 2025లో సీబీఎస్ఈ గవర్నింగ్ బాడీ తీసుకున్న నిర్ణయానికి ఈ సర్క్యులర్ విరుద్ధంగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. విద్యాసంవత్సరం మధ్యలో ఇలాంటి నిర్ణయాల వల్ల పాఠశాలల నిర్వహణ, విద్యా ప్రణాళికలు దెబ్బతింటాయని ప్రిన్సిపాల్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే బోర్డు తాజా సడలింపులు ఇచ్చింది.
మిగతా తరగతుల పరిస్థితి ఏంటి?
ప్రస్తుత విద్యాసంవత్సరంలో 7, 8 తరగతుల్లో ఉంటూ రెండు నాన్-నేటివ్ భాషలు చదువుతున్న విద్యార్థులకు కూడా ఇదే సడలింపు వర్తిస్తుంది. వారు కూడా ఒక భారతీయ భాషను మూడవ భాషగా జోడించుకోవాలి. దీనికి కేవలం అంతర్గత పరీక్షలే ఉంటాయి తప్ప 10వ తరగతి బోర్డు పరీక్ష ఉండదు.
మరోవైపు, ప్రస్తుత 10వ తరగతి (2026-27) బ్యాచ్ విద్యార్థులకు ఎటువంటి మార్పులు లేవు. వారు పాత రెండు భాషల విధానంలోనే కొనసాగుతారు. వీరు మూడవ భాషను చదవాల్సిన అవసరం లేదు.
అయితే, 2026-27 విద్యాసంవత్సరంలో 6వ తరగతిలోకి ప్రవేశించే విద్యార్థులకు, ఆ తర్వాతి బ్యాచ్లకు ఈ మూడు భాషల విధానం పూర్తిగా వర్తిస్తుంది. వారు తప్పనిసరిగా రెండు భారతీయ భాషలను చదవాలి. ఈ బ్యాచ్లు 10వ తరగతికి వచ్చేసరికి మూడవ భాష (R3) కు కూడా బోర్డు పరీక్ష రాయాల్సి ఉంటుంది. దీనికోసమే 22 భారతీయ భాషలకు సంబంధించిన 6వ తరగతి ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
టీచర్ల కొరత అధిగమించేందుకు.. మినహాయింపులు ఇవే
పాఠశాలల్లో భాషా ఉపాధ్యాయుల కొరతను అధిగమించడానికి సీబీఎస్ఈ కొన్ని వెసులుబాట్లు కల్పించింది. రిటైర్డ్ టీచర్లు, వర్చువల్ లేదా హైబ్రిడ్ బోధనా పద్ధతులు, సాహోదయ స్కూల్ క్లస్టర్ల సేవలను వాడుకోవడానికి పాఠశాలలకు అనుమతి ఇచ్చింది.
ఇక ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు (Children with Special Needs) రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసిబిలిటీస్ యాక్ట్, 2016 ప్రకారం ఈ విధానం నుండి మినహాయింపులు ఉంటాయి. అలాగే భారతదేశం వెలుపల ఉన్న సీబీఎస్ఈ స్కూళ్లకు, విదేశాల నుండి తిరిగి వచ్చే విదేశీ విద్యార్థులకు భారతీయ భాషను మూడవ భాషగా చదవడం నుండి పూర్తి మినహాయింపు ఇచ్చారు.
సుప్రీంకోర్టులో సవాలు
సీబీఎస్ఈ ప్రవేశపెట్టిన ఈ మూడు భాషల విధానాన్ని సవాలు చేస్తూ మే 27న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్.. పాఠశాలల్లో తగినన్ని పుస్తకాలు, ఉపాధ్యాయులు, మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, చెన్నైలకు చెందిన 19 మంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వేసిన ఈ పిటిషన్పై జూలై రెండో వారంలో తదుపరి విచారణ జరగనుంది. అప్పటివరకు సీబీఎస్ఈ ఇచ్చిన తాజా మినహాయింపులు విద్యార్థులకు, పాఠశాల యాజమాన్యాలకు పెద్ద ఊరటనిచ్చాయనే చెప్పాలి.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


