UPI charges : రూ. 2వేల వరకు యూపీఐ ట్రాన్స్​క్షన్​పై చార్జీలు ఉండవు.. మరి ఆ తర్వాత?

రూ.2,000 వరకు చేసే యూపీఐ లావాదేవీలపై ఎలాంటి రుసుములు వసూలు చేయకూడదని కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రూ.2,000 దాటితే వినియోగదారుల ఖాతాల నుంచి డబ్బులు కట్ అవుతాయా? ఆ ప్రచారంలో ఉన్న అసలు నిజాలు, నిబంధనలు ఇవే..

Published on: Sep 15, 2026, 09:09:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టీ కొట్టు వద్ద పది రూపాయలు చెల్లించాలన్నా, షాపింగ్ మాల్‌లో వేల రూపాయల బిల్లు కట్టాలన్నా సగటు భారతీయుడికి యూపీఐ డిజిటల్ చెల్లింపులు దైనందిన జీవితంలో భాగమైపోయాయి. ఫోన్ తీయడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, పిన్ ఎంటర్ చేయడంతో సెకన్లలో పని పూర్తవుతోంది. అయితే, యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధిస్తారంటూ సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న విస్తృత ప్రచారం సాధారణ వినియోగదారుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ఈ గందరగోళానికి తెర దించుతూ కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది.

యూపీఐ చార్జీలపై కేంద్రం కీలక వివరణ.. (AI generated image for representational purposes only)
యూపీఐ చార్జీలపై కేంద్రం కీలక వివరణ.. (AI generated image for representational purposes only)

కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ ఏం చెబుతోంది?

సెప్టెంబర్ 14న కేంద్ర ఆర్థిక శాఖ ఒక అధికారిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ప్రకారం, రూ.2,000 వరకు జరిపే యూపీఐ లావాదేవీలతో పాటు రూపే డెబిట్ కార్డు ద్వారా చేసే చెల్లింపులపై బ్యాంకులు గానీ, పేమెంట్ యాప్‌ల నిర్వాహకులు గానీ ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్ష రుసుములను వసూలు చేయడానికి వీల్లేదు!

అంటే, మీ ఖాతా నుంచి రూ.2,000 వరకు ఇతరులకు పంపినా లేదా మీ వ్యాపారానికి ఆ మొత్తం స్వీకరించినా పైసా అదనపు చార్జ్ పడదు. కొనుగోలుదారులు, అమ్మకందారులు ఇద్దరికీ ఈ మినహాయింపు వర్తిస్తుంది.

రూ.2,000 దాటితే డబ్బులు కట్ అవుతాయా?

ఇక్కడే చాలామంది పొరబడుతున్నారు. రూ. 2,000 కంటే ఎక్కువ మొత్తంలో చేసే లావాదేవీలపై వెంటనే చార్జీలు పడతాయని ఈ నోటిఫికేషన్ అర్థం కాదు.

మీరు యూపీఐ ద్వారా రూ. 2,500, రూ. 5,000 లేదా రూ. 20,000 పంపినా సరే, మీ బ్యాంక్ ఖాతా నుంచి ఎటువంటి అదనపు రుసుము కట్ కాదని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టంలో చేసిన మార్పులు భవిష్యత్తులో నిర్దిష్టమైన కేటగిరీల్లో చార్జీల నియంత్రణకు వెసులుబాటును కల్పించేందుకు మాత్రమే రూపొందించాయి తప్ప, సాధారణ ప్రజలపై భారం మోపేందుకు కాదని అధికారులు స్పష్టం చేశారు.

అసలు రూ.2,000 పరిమితి ప్రస్తావన ఎందుకు వచ్చింది?

యూపీఐ వినియోగం దేశంలో ఆకాశాన్ని తాకుతోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేవలం 44 బ్యాంకులు మాత్రమే యూపీఐ నెట్‌వర్క్‌లో ఉండగా, 2026 జులై నాటికి ఆ సంఖ్య ఏకంగా 741 బ్యాంకులకు చేరింది. ఒక్క 2026 జులై నెలలోనే 2,366 కోట్లకు పైగా యుపిఐ లావాదేవీలు నమోదయ్యాయి.

ఈ స్థాయిలో లావాదేవీలు జరుగుతున్నప్పుడు డేటా సెంటర్లు, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫ్రాడ్స్ అడ్డుకోవడం వంటి మౌలిక వసతుల నిర్వహణకు బ్యాంకులు, పేమెంట్ కంపెనీలకు భారీగా ఖర్చు అవుతుంది. ఈ మౌలిక వసతుల వ్యయాన్ని భరించడానికి ఒక ఆదాయ నమూనా అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే రూ.2,000 వరకు ఉచిత పరిమితిని చట్టబద్ధంగా రక్షిత కేటగిరీగా నిర్ధారించింది.

ఎండీఆర్ అంటే ఏంటి? ఎవరిపై ప్రభావం చూపుతుంది?

మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆఱ్) అంటే డిజిటల్ చెల్లింపులను ప్రాసెస్ చేసినందుకు గాను వ్యాపారుల నుంచి వసూలు చేసే రుసుము.

రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున యూపీఐ చెల్లింపులను స్వీకరించే బడా వ్యాపార సంస్థలు, కార్పొరేట్ మాల్స్ పరిధిలోని లావాదేవీలపై 0.25 శాతం నుంచి 0.4 శాతం వరకు నామమాత్రపు ఎండీఆర్ విధించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ప్రభుత్వం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ ఎండీఆర్ అమలు చేసినా, ఆ భారం వ్యాపార సంస్థలు లేదా పేమెంట్ నెట్‌వర్క్ భరిస్తాయి తప్ప, సగటు వినియోగదారుల ఖాతాల నుంచి అదనంగా రూపాయి కూడా కట్ కాదని అధికారులు చెబుతున్నారు.

"సాధారణ పౌరులకు యూపీఐ సేవలు ఎల్లప్పుడూ ఉచితంగానే అందుబాటులో ఉంటాయి," అని ప్రభుత్వం పునరుద్ఘాటించింది.

కాబట్టి, సాధారణ వినియోగదారులు యూపీఐ ద్వారా ఎంత మొత్తం బదిలీ చేసినా భయపడాల్సిన పనిలేదు! రూ.2,000 అనేది వినియోగదారుల పరిమితి కానే కాదు, అది కేవలం డిజిటల్ వ్యవస్థల నిర్వహణ కోసం ప్రభుత్వం రూపొందించిన ఒక సాంకేతిక నిబంధన మాత్రమే అని అధికారులు అంటున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More