LPG cylinder price : బడ్జెట్కి ముందే షాక్! ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర పెంపు..
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న రోజే సామాన్యుడిపై ధరల భారం పడింది. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 49 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఫిబ్రవరి 1, 2026 నుంచి ఈ పెంచిన ధరలు అమలులోకి వచ్చాయి. అయితే, గృహ అవసరాలకు వాడే 14.2 కిలోల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ 2026ను ప్రవేశపెట్టడానికి ముందే షాక్ తగిలింది! కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఆదివారం పెరిగింది. నెలవారీ ధరల సవరణలో భాగంగా 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు మార్కెటింగ్ సంస్థలు రూ. 49 మేర పెంచినట్టు వార్తా సంస్థ ఏఎన్ఐ వెల్లడించింది.

ఈ పెంపుతో దేశ రాజధాని దిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1740.50 కి చేరింది. నిన్నటి వరకు (జనవరి 1న చేసిన సవరణ ప్రకారం) దీని ధర రూ. 1691.50గా ఉండేది. జనవరిలో ఏకంగా రూ. 110 మేర పెరిగిన సంగతి తెలిసిందే.
గడిచిన రెండు నెలల్లో ధరలు పెరగడం ఇది రెండోసారి.
ఇక హైదరాబాద్లో నిన్నటి వరకు రూ. 1912.50గా ఉన్న 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఈరోజు రూ. 1967కి పెరిగింది. వరంగల్లో ఈ ధర రూ. 2007గా కొనసాగుతోంది.
అమరావతిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1901గా ఉంది. విజయవాడలో కూడా ఇదే రేటు కొనసాగుతోంది.
హోటళ్లు, రెస్టారెంట్లకు పెరగనున్న ఖర్చులు..
తాజా ధరల పెంపు ప్రభావం ప్రధానంగా హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్లు, వీధి వ్యాపారులపై పడనుంది. రోజువారీ కార్యకలాపాల కోసం గ్యాస్పై ఆధారపడే చిన్న తరహా వాణిజ్య సంస్థలకు ఇది అదనపు భారం కానుంది. దీనివల్ల బయట దొరికే ఆహార పదార్థాల ధరలు కూడా స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. ఈ విధంగా ఇది సామాన్యుడిపై ప్రభావం చూపించనుంది.
అయితే గృహాల్లో వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇది సామాన్య ప్రజలకు ఒకింత ఊరటనిచ్చే అంశం. ఇళ్లలో వాడే 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరను చమురు సంస్థలు యథాతథంగా ఉంచాయి. దేశీయ వినియోగదారులకు భారంగా మారకుండా ప్రభుత్వం ఈ ధరలను నియంత్రిస్తోంది.
హైదరాబాద్లో 14 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 855గా ఉంది. వరంగల్లో ఈ ధర రూ. 874గా కొనసాగుతోంది.
అమరావతిలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 827.50 గా ఉంది. విజయవాడలో కూడా ఇదే రేటు కొనసాగుతోంది.
ఎల్పీజీ సిలిండర్ ధరల పెంపునకు కారణాలివే..
భారతదేశం తన మొత్తం గ్యాస్ అవసరాలలో 60 శాతానికి పైగా దిగుమతుల ద్వారానే పొందుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ, రవాణా ఖర్చులు, ఇన్సూరెన్స్, కస్టమ్స్ డ్యూటీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇండియన్ ఆయిల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రతి నెలా ఒకటో తేదీన ధరలను సవరిస్తుంటాయి.
ప్రస్తుతం ధర పెరిగినప్పటికీ, గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే ధరలు తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవాలి. 2025 ఫిబ్రవరిలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1797గా ఉండగా, ఇప్పుడు అది రూ. 1740.50 వద్ద ఉంది. అంటే గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికీ సుమారు రూ. 56 తక్కువ ధరకే లభిస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


