సిటీలో బిడ్డను పెంచాలంటే రూ. 6.75 కోట్లు! ఫైనాన్షియల్ నిపుణుడు చెబుతున్న షాకింగ్ లెక్కలు..
Education inflation in India : భారతదేశంలోని మెట్రో నగరాల్లో ఒక బిడ్డను 21 ఏళ్ల పాటు పెంచడానికి సుమారు రూ. 6.75 కోట్లు ఖర్చవుతుందని ఆర్థిక నిపుణుడు ఉదయన్ ఆధ్వే అంచనా వేశారు. విద్యా రంగంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణమే ఇందుకు ప్రధాన కారణమని ఆయన పేర్కొన్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.
Cost of raising a child in India : నేటి కాలంలో పిల్లలను పెంచడం అనేది కేవలం ఒక బాధ్యత మాత్రమే కాదు, అది ఒక భారీ ఆర్థిక లక్ష్యంగా మారిపోయింది. ముఖ్యంగా ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో నివసించే తల్లిదండ్రులకు ఇది పెను సవాలుగా పరిణమిస్తోంది. ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్, కంటెంట్ క్రియేటర్ ఉదయన్ ఆధ్వే ఇటీవలే చేసిన ఒక విశ్లేషణ ఇప్పుడు ఇంటర్నెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయన లెక్కల ప్రకారం.. భారత దేశ మెట్రో నగరాల్లో ఒక బిడ్డ పుట్టినప్పటి నుంచి 21 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పెంచడానికి కనీసం రూ. 6.75 కోట్లు అవసరమవుతాయట!

విద్యా ద్రవ్యోల్బణమే ప్రధాన శత్రువు..
తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం చేసే పొదుపులో విద్య, వైద్యం, జీవనశైలి ఖర్చులను తక్కువగా అంచనా వేస్తారని, కానీ పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని ఉదయన్ అభిప్రాయపడ్డారు. ఈ రూ. 6.75 కోట్ల భారీ అంచనా వెనుక ఉన్న ప్రధాన కారణం విద్యా రంగంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం. సాధారణంగా వస్తువుల ధరలు 5-6% పెరిగితే, విద్యా వ్యయం ఏటా 10-12% మేర పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల ప్రతి ఆరేళ్లకోసారి చదువుల ఖర్చు రెట్టింపు అవుతుంది.
ఉదాహరణకు: ప్రస్తుతం ఒక ఫోర్ ఇయర్స్ డిగ్రీ కోర్సు కోసం రూ. 20 లక్షలు ఖర్చవుతుంటే, నేడు పుట్టిన బిడ్డ 18 ఏళ్ల తర్వాత కాలేజీకి వెళ్లే సమయానికి అదే కోర్సుకు రూ. 1.6 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని ఉదయన్ వివరించారు!
కేవలం చదువే కాదు.. ఇతర ఖర్చులు కూడా!
ఈ రూ. 6.75 కోట్ల అంచనాలో కేవలం కాలేజీ ఫీజులే కాదు, మరిన్ని ఇతర ఖర్చులను కూడా ఆయన చేర్చారు:
ప్రైవేట్ పాఠశాలల ఫీజులు, కోచింగ్ సెంటర్లు.
క్రీడలు, సంగీతం వంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్.
ఆధునిక గ్యాడ్జెట్లు, ల్యాప్టాప్లు, వెకేషన్లు.
హెల్త్కేర్, నానీ (పిల్లల సంరక్షకులు) సర్వీసులు.
మెట్రో నగరాల్లో ఉండే హై-ఎండ్ లైఫ్ స్టైల్ ఖర్చులు.
“మెట్రో నగరాల్లో పిల్లల పెంపకం అనేది ఇకపై కేవలం భావోద్వేగపూరితమైన నిర్ణయం కాదు. ఇదొక సీరియస్ ఆర్థిక లక్ష్యం. స్కూల్, కాలేజీ, కోచింగ్, లైఫ్ స్టైల్, హెల్త్కేర్, గ్యాడ్జెట్లు.. ఇలా అన్నీ కలిపి 21 ఏళ్లలో నిశ్శబ్దంగా చక్రవడ్డీలా పెరుగుతాయి. కేవలం సాధారణ చైల్డ్ ప్లాన్లు ఈ అవసరాలను తీర్చలేవు,” అని ఉదయన్ తన వీడియో క్యాప్షన్లో పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు!
ఉదయన్ చేసిన ఈ ప్రకటన నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. కొందరు దీనిని 'ఫియర్ మాంగరింగ్' (భయపెట్టడం) అని కొట్టిపారేస్తున్నారు. ఇది కేవలం అతి సంపన్న వర్గాల జీవనశైలిని మాత్రమే ప్రతిబింబిస్తోందని, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఇది వర్తించదని విమర్శిస్తున్నారు.
అయితే ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో నివసించే మరికొందరు మాత్రం ఈ లెక్కలు వాస్తవానికి దగ్గరగానే ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో ఎల్కేజీ సీటుకే లక్షల్లో డొనేషన్లు కట్టాల్సి వస్తున్న పరిస్థితుల్లో, 21 ఏళ్ల సుదీర్ఘ కాలానికి ఈ మొత్తం అతిశయోక్తి కాదని వారు వాదిస్తున్నారు.
మరి దీనిపై మీరేం అంటారు?
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


