భార్యను చంపి.. 'దృశ్యం' సినిమా తరహాలో ఆధారాలు మాయం చేశాడు! చివరికి..
భార్యను చంపి, ఆధారాలు మాయం చేసేందుకు ‘దృశ్యం’ సినిమా తరహాలో ప్లాన్ వేశాడు ఓ వ్యక్తి. మహారాష్ట్ర పూణెలో ఈ భయంకర నేరం వెలుగులోకి వచ్చింది. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
ప్రముఖ మలయాళ థ్రిల్లర్ దృశ్యం సినిమాను గుర్తుచేసే విధంగా మహారాష్ట్ర పూణెలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది! ఏ 42ఏళ్ల వ్యక్తి, తన భార్యను హత్య చేసి, ఆధారాలేవీ లేకుండా నాశనం చేసే ప్రయత్నం చేశాడు. చివరికి పోలీసులకు దొరికిపోయాడు.

నిందితుడిని సమీర్ పంజాబ్రావ్ జాదవ్గా గుర్తించారు. హత్యకు ప్లాన్ చేస్తున్నప్పుడు అతను "సినిమా ద్వారా ప్రభావితమయ్యాను" అని అంగీకరించినట్లు తెలుస్తోంది.
శివనేలోని తలఠీ కార్యాలయం సమీపంలో ఉన్న స్వామి సంకుల్ అపార్ట్మెంట్లో నివసించే జాదవ్.. ఆటోమొబైల్ గ్యారేజీని నడుపుతున్నాడు. అతనికి ఆటోమొబైల్లో డిప్లొమా ఉంది. అతని భార్య, అంజలి సమీర్ జాదవ్ (38) ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారు.
అక్రమ సంబంధం, క్రూరమైన పథకం!
దర్యాప్తు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సమీర్ మరొక మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు. అతను తన భార్య అంజలిపై అవిశ్వాసాన్ని నిరూపించడానికి, ఆమెను రెచ్చగొట్టడానికి ఉద్దేశపూర్వకంగా ఒక స్నేహితుడి ఫోన్ నుంచి సందేశాలు పంపడం ప్రారంభించాడు.
పోలీసుల సమాచారం మేరకు, సమీర్ తను జాగ్రత్తగా రూపొందించిన హత్య ప్లాన్ను అక్టోబర్ 26న అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు.. భార్యాభర్తలు కలిసి ఖేడ్ శివాపూర్ సమీపంలోని మరియాయి ఘాట్ వద్దకు డ్రైవ్కు వెళ్లారు.
తిరిగి వచ్చేటప్పుడు, అతను అంజలిని షిండేవాడిలోని గోగల్వాడి ఫాటా వద్ద అద్దెకు తీసుకున్న గోడౌన్కు పట్టికెళ్లాడు. అక్కడ, ఇద్దరూ కలిసి భోజనం చేస్తున్న సమయంలో, ఆమెను గొంతు నులిమి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఆధారాలను మాయం చేసే ‘దృశ్యం’ స్టైల్ కవర్-అప్!
ఆధారాలను పూర్తిగా మాయం చేయడానికి, నిందితుడైన భర్త ముందుగా సిద్ధం చేసుకున్న ఒక పెద్ద ఇనుప పెట్టెలో భార్య మృతదేహాన్ని ఉంచాడు. అందులో ఇంతకు ముందే నిల్వ చేసిన కట్టెల సాయంతో ఆ పెట్టెకు నిప్పు పెట్టాడు. ఆ తర్వాత, మిగిలిన బూడిదను సమీపంలోని నదిలో పారేశాడు. చివరికి, ఎటువంటి ఆనవాళ్లు లేకుండా చూసుకునేందుకు ఆ లోహపు పెట్టెను కూడా అతను శుభ్రం చేశాడు.
"నిందితుడు చాలా వివరంగా ప్లాన్ రచించాడు. అతను నెలకు రూ. 18,000 అద్దెకు గోడౌన్ తీసుకున్నాడు. అక్కడే ఇనుప పెట్టె తయారు చేయించుకున్నాడు, కట్టెలను కూడా నిల్వ చేసుకున్నాడు," అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శంభాజీ కదమ్ తెలిపారు.
హత్యను దాచిపెట్టడానికి ఒక వ్యక్తి విపరీతంగా ప్రయత్నించే ‘దృశ్యం’ చిత్రంలోని సన్నివేశాల మాదిరిగానే, మర్డర్ జరిగిన రెండు రోజుల తర్వాత, సమీర్ వర్జే-మాల్వాడి పోలీస్ స్టేషన్కు వెళ్లి తన భార్య కనిపించలేదంటూ మిస్సింగ్ కేసు కూడా నమోదు చేశాడు.
ఆందోళన చెందుతున్న భర్తలా నటిస్తూ, కేసు పురోగతి గురించి తెలుసుకోవడానికి అతను పోలీసు స్టేషన్ను పలుసార్లు సందర్శించినట్లు తెలిసింది.
వాస్తవానికి దర్యాప్తును తర్వాత రాజ్గడ్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేసినప్పటికీ, కేసు తీవ్రత కారణంగా వర్జే-మాల్వాడి బృందం కూడా దర్యాప్తును కొనసాగించింది. ఈ దశలోనే పోలీసులు అతని కథనంలో పొంతన లేని విషయాలను గమనించడం మొదలుపెట్టారు.
"సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక దర్యాప్తును విశ్లేషించిన తర్వాత నిందితుడు ఇచ్చిన సమాచారంలో తేడా ఉన్నట్లు మేము కనుగొన్నాము. అతన్ని పిలిచి విచారించగా, నేరాన్ని అంగీకరించాడు," అని సీనియర్ ఇన్స్పెక్టర్ విశ్వజీత్ కినెగాడే తెలిపారు.
నిందితుడుని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


