దక్షిణాదిలో పెరిగిన వాయు కాలుష్యం: CSTEP అధ్యయనంలో కీలక అంశాలు
వాయు కాలుష్య నివారణ కేవలం ఒక నగరానికో లేదా రాష్ట్రానికో పరిమితం కాదని, ప్రాంతీయ స్థాయి ఉమ్మడి విధానాలు అవసరమని సీఎస్టీఈపీ (CSTEP) అధ్యయనం స్పష్టం చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో పెరుగుతున్న కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు CAQM తరహా ప్రత్యేక ఉమ్మడి వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.
వాయు కాలుష్య సమస్య ప్రాంతీయ పరిపాలనా సరిహద్దులకేమీ పరిమితం కాదని, దీని నివారణకు ప్రాంతీయ స్థాయిలో ఉమ్మడి కార్యాచరణ అవసరమని బెంగళూరుకు చెందిన ప్రముఖ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ (CSTEP) తేల్చిచెప్పింది. బెంగళూరు వేదికగా జరిగిన 'ఇండియా క్లీన్ ఎయిర్ సమిట్' (ICAS) 2026 సదస్సులో ఈ అధ్యయన నివేదికలను ఆవిష్కరించారు. జాతీయ పరిశుభ్రమైన గాలి కార్యక్రమం (NCAP) ప్రస్తుతం కేవలం నగరాల కేంద్రీకృతంగా మాత్రమే పని చేస్తోందని, దీనివల్ల ప్రాంతీయ స్థాయి కాలుష్య సమస్యకు పూర్తి పరిష్కారం లభించడం లేదని సిస్టెప్ స్పష్టం చేసింది.

దక్షిణాది రాష్ట్రాల్లో కాలుష్య విస్తరణ
'దక్షిణ భారతదేశంలో ఎయిర్షెడ్ స్థాయి వాయు నాణ్యత నిర్వహణ కోసం పాలనా ముసాయిదా' పేరుతో రూపొందించిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) నివేదికల ప్రకారం దక్షిణాదిలోని ప్రధాన పట్టణాలు ఆమోదయోగ్యమైన వార్షిక సగటు ధూళి కణాల (PM10) పరిమితిని మించిపోయాయి. దీంతో ఎన్సీఏపీ దక్షిణాదిలోని 25 నగరాలను నాన్-అటైన్మెంట్ నగరాలుగా గుర్తించింది.
దక్షిణాది రాష్ట్రాల్లో నమోదవుతున్న వార్షిక సగటు కాలుష్యంలో 38 శాతం నుంచి 65 శాతం వరకు స్థానిక మూలాల నుంచే వస్తోంది. తెలంగాణలో స్థానిక కాలుష్య వాటా అత్యల్పంగా 38 శాతంగా నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్లో 44 శాతం, కర్ణాటకలో 47 శాతంగా నమోదైంది. అత్యధికంగా కేరళలో 65 శాతం, తమిళనాడులో 61 శాతం కాలుష్యం ఆయా రాష్ట్రాల స్థానిక మూలాల నుంచే వస్తోంది.
ఏపీ, తమిళనాడుల నుంచి పొరుగు రాష్ట్రాలకు వ్యాప్తి
ఇండో-గాంగ్టిక్ మైదాన ప్రాంతంతో పోలిస్తే దక్షిణాదిలో వాయు కాలుష్య వ్యాప్తి వాతావరణ పరిస్థితులు, భౌగోళిక అంశాలపై ఆధారపడి మారుతోంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తాము పొందే కాలుష్యం కంటే పొరుగు రాష్ట్రాలకు పంపే కాలుష్యమే ఎక్కువగా ఉండి 'నెట్ కంట్రిబ్యూటర్లు'గా పనిచేస్తున్నాయి.
మరోవైపు కేరళ, తెలంగాణ రాష్ట్రాలు తాము వెదజల్లే కాలుష్యం కంటే ఇతర ప్రాంతాల నుంచి పొందే కాలుష్యమే ఎక్కువగా ఉండి 'నెట్ రిసీవర్లు'గా మారాయి. కర్ణాటక ప్రాంతీయంగా మధ్యస్థ భౌగోళిక స్థానంలో ఉండటం వల్ల సమాన స్థాయిలో కాలుష్యాన్ని స్వీకరిస్తూ, ఇతర రాష్ట్రాలకు పంపుతోంది. గృహావసరాలు, పరిశ్రమలు, చెత్తను బహిరంగంగా తగలబెట్టడం దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లోనూ ప్రధాన స్థానిక కాలుష్య మూలాలుగా నిలుస్తున్నాయి.
ప్రత్యేక కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు ప్రతిపాదన
ఢిల్లీ, దాని అనుబంధ ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణకు పనిచేస్తున్న సీఏక్యూఎమ్ (CAQM) తరహాలోనే దక్షిణాది రాష్ట్రాల కోసం కూడా ఒక ప్రత్యేక ఉమ్మడి మండలిని ఏర్పాటు చేయాలని సిస్టెప్ ప్రతిపాదించింది. ఐదు దక్షిణాది రాష్ట్రాలు ఉమ్మడి డేటా సేకరణ, పర్యవేక్షణ, నిధుల సమీకరణ దిశగా దశలవారీగా కలసి పనిచేయాలని సూచించింది.
దీనితో పాటు ఐదు రాష్ట్రాల్లో ఆమోదిత స్వచ్ఛ ఇంధన ముసాయిదాను అమలు చేయడం, ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని పెంచడం, పాత వాహనాలను దశలవారీగా తొలగించడం వంటి చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ కార్యక్రమాలకు ఎన్సీఏపీ మరియు రాష్ట్ర కార్యాచరణ ప్రణాళిక నిధులను ఉపయోగించుకోవచ్చని సిస్టెప్ సిఫార్సు చేసింది.
ఇండో-గాంగ్టిక్ మైదాన ప్రాంతంలో పరిస్థితి
'ఇండో-గాంగ్టిక్ మైదానంలో అంతర్రాష్ట్ర వాయు కాలుష్య రవాణా పరిమాణం - రంగాలు వారీగా పరిష్కారాలు' అనే మరో అధ్యయనంలో నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) కాలుష్య మూలాలను విశ్లేషించారు. ఎన్సీఆర్లో నమోదయ్యే మొత్తం PM2.5 ఉద్గారాలలో కేవలం 28 శాతం మాత్రమే స్థానిక మూలాల ద్వారా వస్తోంది. ఇందులో నివాస ప్రాంతాల కార్యకలాపాలు ప్రధాన మూలంగా ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో పరిశ్రమలు, వ్యవసాయం, రవాణా రంగాలు ఉన్నాయి.
ఎన్సీఆర్లోని PM2.5 కాలుష్యంలో మూడో వంతు ఐజీపీలోని ఇతర రాష్ట్రాల నుంచి, మరో మూడో వంతు పొరుగు దేశాల నుంచి వస్తోందని సిస్టెప్ పేర్కొంది. విడివిడిగా చర్యలు తీసుకోవడం కంటే అన్ని రంగాలను ఏకీకృతం చేస్తూ పంట వ్యర్థాల దహన పర్యవేక్షణకు ఉపగ్రహ సాంకేతికతను వాడాలని, పరిశ్రమల్లో నిరంతర ఉద్గారాల పర్యవేక్షణ వ్యవస్థను విస్తరించాలని సిఫార్సు చేసింది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


