దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం సన్నాహాలు చేస్తున్న అభ్యర్థులకు కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్ఈ) కీలక సమాచారం అందించింది. 22వ ఎడిషన్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) పరీక్షల తేదీలను అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 12, 13 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ స్పష్టం చేసింది.
పరీక్ష విధానం - పేపర్ల వివరాలు

పాఠశాలల్లో ప్రాథమిక (ఎలిమెంటరీ), ప్రాథమికోన్నత (సెకండరీ) స్థాయిలో బోధించాలనుకునే అభ్యర్థుల అర్హత నిర్ధారణ కోసం సీటెట్ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి.
పేపర్-1: 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించాలనుకునే అభ్యర్థుల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు.
పేపర్-2: 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించడానికి అర్హత సాధించాలనుకునే వారు పేపర్-2 రాయాల్సి ఉంటుంది.
రెండు స్థాయిల్లోనూ బోధించడానికి అర్హత ఉన్న అభ్యర్థులు పేపర్-1, పేపర్-2 రెండింటికీ హాజరయ్యే అవకాశం ఉంది.
హాల్ టికెట్లు, పరీక్ష కేంద్రాల సమాచారం
పరీక్ష రాయబోయే అభ్యర్థులకు తమ పరీక్ష తేదీ, కేటాయించిన నగరం (Exam City) వివరాలను పరీక్షకు దాదాపు 15 రోజుల ముందే సీటెట్ అధికారిక పోర్టల్ ద్వారా తెలియజేస్తారు. కేటాయించిన పరీక్ష కేంద్రాన్ని స్పష్టంగా పేర్కొంటూ హాల్ టికెట్లను (అడ్మిట్ కార్డులు) పరీక్ష ప్రారంభానికి రెండు రోజుల ముందు డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచుతారు.