చైనాలో ‘డెక్కన్ రైస్’.. యూఎస్ మార్కెట్లో ఇప్పటికే అగ్రస్థానం
డెక్కన్ బ్రాండ్ పేరుతో బియ్యం ఎగుమతుల్లో ఉన్న డెక్కన్ గ్రెయింజ్ ఇండియా తాజాగా చైనాలో అడుగుపెట్టింది. ఇప్పటికే కంపెనీ చాలా దేశాల్లో 30 రకాల బియ్యాన్ని పరిచయం చేసింది.
హైదరాబాద్, జూలై 10: డెక్కన్ బ్రాండ్ పేరుతో రైస్ ఎగుమతుల్లో ఉన్న డెక్కన్ గ్రెయింజ్ ఇండియా తాజాగా చైనాలో అడుగుపెట్టింది. ఇప్పటికే కంపెనీ స్వీడన్, యూకే, జర్మనీ, ఐర్లాండ్, లండన్, యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, ఈయూ, టర్కీలో 30 రకాల భారతీయ రైస్ను పరిచయం చేసింది. ఈ స్థాయిలో విదేశీ గడ్డపై విస్తరించిన ఏకైక దక్షిణ భారత బ్రాండ్గా స్థానం సంపాదించామని డెక్కన్ గ్రెయింజ్ ఇండియా డైరెక్టర్ కిరణ్ కుమార్ పోలా తెలిపారు.

బియ్యం ఉత్పత్తిలో భారత్ తర్వాత ప్రపంచంలో రెండవ స్థానంలో నిలిచిన చైనాలో కంపెనీ ప్రవేశించడం మైలురాయిగా అభివర్ణించారు. యూఎస్ మార్కెట్లో నాన్ బాస్మతి రైస్ విభాగంలో డెక్కన్ ఫుడ్స్ నంబర్ వన్ స్థానం కైవసం చేసుకున్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల్లోని వేలాది మంది రైతుల నుంచి నాణ్యమైన బియ్యం కొనుగోలు చేసి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు వివరించారు.
భారత్లో త్వరలో ఎంట్రీ..
దశాబ్దంన్నర ప్రయాణంలో కంపెనీ 7 కోట్లకుపైగా బ్యాగ్స్ను విదేశాల్లో విక్రయించింది. ‘మొత్తం అమ్మకాల్లో సోనా మసూరి అత్యధికంగా 60 శాతం వాటా ఉంటుంది. హైదరాబాద్ సమీపంలోని సుల్తాన్పూర్ వద్ద అత్యాధునిక జపాన్ సాంకేతికత ఆధారిత రైస్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఉంది. ఈ కేంద్రం సామర్థ్యం నెలకు 5,500 మెట్రిక్ టన్నులు. కంపెనీలో 100 మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ రచ్చ గెలిచి ఇంట గెలిచేందుకు సిద్ధం అయ్యాం. 2026 ప్రారంభంలో డెక్కన్ గ్రెయింజ్ భారత్లో ఎంట్రీ ఇవ్వనుంది’ అని కిరణ్ కుమార్ తెలిపారు.
మూడు దశాబ్దాల అనుభవం..
బియ్యం వ్యాపారంలో కిరణ్కు 30 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హైదరాబాద్లోని కొత్తపేటలో 1995లో ఓ రైస్ మిల్లులో ఆరు నెలలు పరిచేశారు. ఆ తర్వాత ఐశ్వర్య ఇండస్ట్రీస్లో చిరుద్యోగిగా చేరారు. విదేశాలకు బియ్యం ఎగుమతి చేసే స్థాయికి కంపెనీ ఎదగడంలో కిరణ్ శ్రమించారు. 14 ఏళ్లకుపైగా ఈ కంపెనీలో కొనసాగారు. లండన్ వేదికగా 2008లో డెక్కన్ బ్రాండ్ ఊపిరి పోసుకుంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


