Crime news : రూ. 400 కోసం యువకుడి హత్య.. సినిమా స్టైల్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్!
దిల్లీలోని దయాల్పూర్ ప్రాంతంలో ఘోరం జరిగింది. కేవలం 400 రూపాయల అప్పు తిరిగి ఇవ్వలేదన్న నెపంతో ముగ్గురు మైనర్లు ఒక యువకుడిని దారుణంగా పొడిచి చంపారు. ఈ దారుణాన్ని వీడియో తీసి, సినిమా డైలాగులతో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సంచలనం రేపుతోంది.
దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా చిన్న చిన్న విషయాలకే దాడులు, హత్యల వరకు వెళుతున్నారు! దిల్లీలో తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈశాన్య దిల్లీలోని దయాల్పూర్ పరిధిలో కేవలం రూ. 400 గురించి మొదలైన వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. 26 ఏళ్ల మహమ్మద్ కైఫ్ అనే యువకుడిని ముగ్గురు మైనర్లు కలిసి కిరాతకంగా హత్య చేశారు.

అసలేం జరిగింది?
న్యూ ముస్తఫాబాద్కు చెందిన మహమ్మద్ కైఫ్, స్థానికంగా ఉండే ముగ్గురు మైనర్ల (సుమారు 16 ఏళ్ల వయస్సు) వద్ద రూ. 400 అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బు తిరిగి ఇచ్చే విషయంలో గత కొంతకాలంగా వీరి మధ్య గొడవ జరుగుతోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో 25 ఫీట్ల రోడ్డులోని ఒక షాపు వద్ద కైఫ్ ఒంటరిగా ఉన్న సమయం చూసి, ఆ ముగ్గురు అతనిపై దాడి చేశారు.
సినిమా ప్రేరణతో ఘాతుకం.. వీడియో వైరల్!
ఈ దారుణ హత్యను నిందితులు అత్యంత పైశాచికంగా చిత్రీకరించారు. కైఫ్ను అడ్డుకుని, కత్తులతో విచక్షణారహితంగా పొడుస్తున్న దృశ్యాలను వీడియో తీశారు. అనంతరం ఆ వీడియోను ఒక పాపులర్ సినిమాలోని డైలాగులు, క్యాప్షన్లతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
పోలీసుల చర్యలు..
బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. జగ్ ప్రవేశ్ చంద్ర ఆసుపత్రి నుంచి సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అప్పటికే కైఫ్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
డీసీపీ (నార్త్ ఈస్ట్) ఆశిష్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసులో ముగ్గురు మైనర్లను శనివారం అదుపులోకి తీసుకున్నారు.
"విచారణలో నిందితులు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. బాధితుడు తమ వద్ద తీసుకున్న రూ. 400 తిరిగి ఇవ్వకపోవడంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలిపారు. హత్యకు ఉపయోగించిన మూడు కత్తులను స్వాధీనం చేసుకున్నాం," అని డీసీపీ వివరించారు.
ఈ వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
మృతి చెందిన కైఫ్కు తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని, భయాందోళనలను నింపింది. చిన్నారులు నేరాల బాట పట్టడం, అది కూడా సినిమాల ప్రభావంతో ఇలాంటి ఘాతుకాలకు పాల్పడటం సామాజిక వేత్తలను కలవరపెడుతోంది.
దిల్లీలో మిస్టరీ మరణాలు..
పశ్చిమ దిల్లీలోని ఉత్తమ్ నగర్ ప్రాంతంలో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్న ఇద్దరు అన్నదమ్ములు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులను దేవేందర్ కుమార్ (50), అమిత్ (45)గా పోలీసులు గుర్తించారు. వీరు నెల రోజుల క్రితమే ఆ ఫ్లాట్ను అద్దెకు తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
శుక్రవారం రాత్రి ఆ ఫ్లాట్ నుంచి పెద్దగా కేకలు, గొడవలు వినిపించాయని స్థానికులు యజమాని నరేష్కు ఫిర్యాదు చేశారు. యజమాని అక్కడికి వెళ్లి విచారించగా, దేవేందర్ కుమారుడు ఎదురయ్యాడు. తన తండ్రి, బాబాయ్ మద్యం సేవించి ఎప్పుడూ ఇలాగే గొడవ పడుతుంటారని చెప్పి అతడిని పంపించేశాడు. అయితే, శనివారం సాయంత్రం 4:30 గంటల సమయంలో తన తండ్రి, బాబాయ్ చనిపోయారని ఆ యువకుడే స్థానికులకు చెప్పడం సంచలనం కలిగించింది.
"అతిగా మద్యం సేవించడం వల్ల లేదా గొడవ పడటం వల్ల వారు చనిపోయి ఉండవచ్చు," అని ఇరుగుపొరుగు వారికి చెప్పిన ఆ యువకుడు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తానని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. రాత్రి 7 గంటల వరకు అతను తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ప్రస్తుతం పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డీసీపీ (ద్వారక) కుశాల్ పాల్ సింగ్ మాట్లాడుతూ.. మరణానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదని, కేసు దర్యాప్తులో ఉందని తెలిపారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


