డైరక్ట్​ వర్సెస్​ రెగ్యులర్​ Mutual funds.. తేడా ఏంటి? ఏది లాభదాయకం?

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి: రెగ్యులర్ వర్సెస్​ డైరెక్ట్ ప్లాన్స్.. రెండింటి మధ్య తేడాలు ఏంటి? మన ఇన్వెస్ట్​మెంట్​ జర్నీకి ఏది బెటర్​? ఏది లాభదాయకం? వివరంగా ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 16, 2025, 06:45:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇప్పుడిప్పుడే తమ ఇన్వెస్ట్​మెంట్​ జర్నీని ప్రారంభించిన వారు తరచుగా వివిధ పెట్టుబడి ఎంపికలను పరిశీలిస్తుంటారు. కొందరు స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపితే, మరికొందరు మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకుంటారు. అయితే.. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారి కోసం, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే మార్గాన్ని బట్టి వాటిని ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు: 1. రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ 2. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్.

డైరక్ట్​ వర్సెస్​ రెగ్యులర్​ మ్యూచువల్​ ఫండ్స్​.. తేడా ఏంటి?
డైరక్ట్​ వర్సెస్​ రెగ్యులర్​ మ్యూచువల్​ ఫండ్స్​.. తేడా ఏంటి?

సాధారణంగా, రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్‌ను మీరు ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్​ ద్వారా కొనుగోలు చేస్తారు. మరోవైపు, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే, మీరు గ్రోవ్ లేదా జెరోధా కాయిన్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నేరుగా కొనుగోలు చేసేవి.

మరి ఈ రెండింటికీ తేడా ఏంటి? ఇక్కడ తెలుసుకోండి..

డైరెక్ట్ వర్సెస్​ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్: తేడాలు

మీరు పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్ స్కీమ్​ ఒకటే అయినప్పటికీ, మీరు ఎంచుకునే పెట్టుబడి మార్గం అది రెగ్యులర్ ఫండా లేదా డైరెక్ట్ ఫండా అనే విషయాన్ని నిర్ణయిస్తుంది.

ఎక్స్​పెన్స్​ రేషియో:

డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల తక్కువ ఎక్స్​పెన్స్​ రేషియో ఉంటుంది. కాబట్టి ఇది లాభదాయకం.

రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఖర్చు నిష్పత్తి అధికంగా ఉంటుంది. ఎందుకంటే, డిస్ట్రిబ్యూటర్లు తమ ఖాతాదారులకు 'సరైన' ఫండ్‌ను సిఫారసు చేసినందుకు తమ కమీషన్‌ను ఛార్జ్ చేస్తారు. ఈ కమీషన్ వల్ల పెట్టుబడిదారులకు వచ్చే లాభం తగ్గుతుంది!

పెట్టుబడి పెట్టడం కొత్తగా ప్రారంభించిన వారు, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మార్గదర్శకత్వం, సూచనలు అవసరమైన వారికి రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం మంచిది.

రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ ఎవరికి అనుకూలం?

  • మ్యూచువల్ ఫండ్స్ గురించి, పెట్టుబడుల గురించి కనీస అవగాహన లేని వారు.
  • ఇప్పటికే పలు ఆస్తులలో పెట్టుబడి పెట్టి, సొంత పరిశోధన చేయడానికి సమయం లేని వారు.
  • స్వయంగా నిర్ణయం తీసుకోవడం కంటే, ఒక మధ్యవర్తి ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడేవారు.

డైరెక్ట్ మ్యూచువల్​ ఫండ్స్ ఎవరికి అనుకూలం?

బ్రోకర్లకు ఇచ్చే కమీషన్‌ను ఆదా చేయాలనుకునే పెట్టుబడిదారులు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవడానికి ఇష్టపడతారు.

పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్ గురించి కనీసం ప్రాథమిక అంశాలు తెలిసిన వారు రెగ్యులర్ ఫండ్స్ కంటే డైరెక్ట్ ఫండ్స్‌ను ఎంచుకుంటారు.

అదనంగా, గ్రో- జెరోధా వంటి ఆన్‌లైన్ బ్రోకింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఇప్పటికే ఖాతా ఉన్న కొందరు పెట్టుబడిదారులు, వేర్వేరు అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల వెబ్‌సైట్‌లకు వెళ్లకుండా, వాటి ద్వారానే నేరుగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతారు.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా మ్యూచువల్​ ఫండ్​లో ఇన్వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More