...
...
Next Story

ఉచిత కార్ల ఆఫర్‌ను తిరస్కరించిన డీఎంకే: తమిళనాడు అసెంబ్లీలో కాక

తమిళనాడు ఎమ్మెల్యేలకు ఉచిత వాహనాలు అందించాలన్న సీఎం విజయ్ ప్రతిపాదనను ప్రధాన ప్రతిపక్షం డీఎంకే తోసిపుచ్చింది. రాష్ట్రం తీవ్ర అప్పుల్లో ఉందంటూ తమ పార్టీకి చెందిన 59 మంది ఎమ్మెల్యేలు ఈ ఆఫర్‌ను తిరస్కరిస్తున్నారని అసెంబ్లీ విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ప్రకటించారు.

Published on: Aug 21, 2026, 16:29:56 IST
Advertisement

తమిళనాడు రాజకీయాల్లో ఉచిత వాహనాల పంపిణీ అంశం తీవ్ర దుమారం రేపుతోంది. రాష్ట్రంలోని శాసనసభ్యులందరికీ ఉచితంగా అధికారిక వాహనాలు అందజేస్తామని ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రకటించిన కొన్ని రోజులకే, ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే ఈ ఆఫర్‌ను తీవ్రంగా వ్యతిరేకించింది. రాష్ట్రం తీవ్ర ఆర్థిక లోటు, అప్పుల్లో కూరుకుపోయిన వేళ ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేయడం తగదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై తమిళనాడు శాసనసభలో తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి.

అప్పుల వేళ ఈ ఖర్చులు అవసరమా?

ఉచిత కార్ల ఆఫర్‌ను తిరస్కరించిన డీఎంకే: తమిళనాడు అసెంబ్లీలో కాక
ఉచిత కార్ల ఆఫర్‌ను తిరస్కరించిన డీఎంకే: తమిళనాడు అసెంబ్లీలో కాక

శాసనసభ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీలో మాట్లాడుతూ, డీఎంకేకి చెందిన 59 మంది ఎమ్మెల్యేలు ఎవరూ ఈ ఉచిత కార్లను తీసుకోకూడదని నిర్ణయించినట్లు వెల్లడించారు.

"టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే రాష్ట్రం తీవ్ర అప్పుల్లో ఉందని చెబుతోంది. అలాంటప్పుడు ఇలాంటి ఉచిత ఆఫర్లు ఇవ్వడం సరైంది కాదు. ఎమ్మెల్యేలకు కార్లు ఇచ్చే ముందు వారి ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించాలి. వారికి ఇప్పటికే సొంత కార్లు ఉన్నాయా లేదా, వారి ఆర్థిక పరిస్థితి ఏమిటనేది తనిఖీ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి" అని ఉదయనిధి డిమాండ్ చేశారు. ఉచితాలను వ్యతిరేకిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ప్రజాధనంతో విలాసాలకు స్వస్తి పలకాలని ఎండగట్టారు.

సమానత్వంతోనే నిర్ణయం: టీవీకే సమర్థన

డీఎంకే విమర్శలపై టీవీకే మంత్రి అధవ్ అర్జున ఘాటుగా స్పందించారు. శాసనసభ్యులందరినీ సమానంగా చూడాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. వీసీకే, కమ్యూనిస్ట్ పార్టీల వంటి చిన్న పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేల ఆర్థిక పరిస్థితి అంతగా బాగులేదని, నియోజకవర్గాల్లో పర్యటించడానికి కార్లు విలాసం కాదని, అదొక ప్రాథమిక అవసరమని వివరించారు.

సచివాలయానికి రావడానికి రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నానంటూ వీసీకే ఎమ్మెల్యే ఎల్.ఇ. జోతిమణి ఆగస్టు 12న చేసిన విజ్ఞప్తిపై సీఎం విజయ్ స్పందించారు. సొంత వాహనాలు లేని ఎమ్మెల్యేలు నియోజకవర్గ పనులను సమీక్షించడం కష్టమవుతోందని పేర్కొంటూ 234 మంది ఎమ్మెల్యేలకు ఉచిత వాహనాలు ఇస్తామని ప్రకటించారు. డ్రైవర్ జీతం, ఇంధనం, వాహన నిర్వహణ కోసం నెలకు రూ. 75,000, కార్యాలయ సహాయకుడి కోసం రూ. 25,000 చొప్పున మొత్తం రూ. 1 లక్ష అలవెన్స్ ఇస్తామని వెల్లడించారు.

సచివాలయం వద్ద మహీంద్రా స్కార్పియో, ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ వంటి వాహనాలను కూడా సిద్ధం చేశారు. అయితే సీపీఐ ఎమ్మెల్యే తలై రామచంద్రన్ కూడా ఈ వాహనాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించగా, ఎమ్మెల్యేల ఆర్థిక స్థితిని తనిఖీ చేయాలన్న డిమాండ్‌కు పీఎంకే ఎమ్మెల్యే గణేష్ కుమార్ మద్దతు తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe