తెలంగాణ డిగ్రీ ప్రవేశాల్లో భారీగా సీట్లు ఖాళీ.. 64 డిగ్రీ కళాశాలల్లో జీరో అడ్మిషన్లు!
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు నిర్వహించిన దోస్త్ 2025 కౌన్సెలింగ్ ముగిసింది. అయితే ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు జరగలేదు.
తెలంగాణలోని దోస్త్ కౌన్సెలింగ్ ముగిసింది. 64 డిగ్రీ కళాశాలలు సున్నా ప్రవేశాలను నమోదు చేశాయి. 4.36 లక్షల సీట్లలో దాదాపు 2.94 లక్షలు ఖాళీగా ఉన్నాయి. అంటే దాదాపు 3 లక్షలకు దగ్గరలో సీట్లు ఖాళీ అన్నమాట. జూలై 5న కళాశాలల కన్ఫర్మేషన్ ఎంపికతో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) 2025 వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ముగిసింది.

తెలంగాణ ఉన్నత విద్యా మండలి పంచుకున్న దోస్త్ 2025 అడ్మిషన్ల గణాంకాలను పరిశీలించినప్పుడు దారుణంగా ఉన్నాయి. 64 డిగ్రీ కళాశాలలు 2025-26 విద్యా సంవత్సరానికి ఒక్క విద్యార్థిని కూడా అడ్మిషన్ పొందడంలో ఆకర్శించలేదు. ఈ కళాశాలల్లో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. మొత్తం 20,260 సీట్లు ఉన్నాయి.
కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో అత్యధికంగా 22 కళాశాలలు, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం 14 కళాశాలలు ఉన్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 13 కళాశాలలు సున్నా ప్రవేశాలతో ఉన్నాయి. అదే విధంగా పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని ఐదు కళాశాలలు కూడా ఉన్నాయి. శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని ఒక ప్రభుత్వ, ఒక ప్రైవేట్ కళాశాలకు ఒక్క ప్రవేశం కూడా రాలేదు.
మూడు రౌండ్ల వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ తర్వాత, 4,36,927 సీట్లలో 1,43,037 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ప్రభుత్వ, విశ్వవిద్యాలయ, ప్రైవేట్ కళాశాలలతో సహా 957 డిగ్రీ కళాశాలల్లో 2,93,890 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
విశ్వవిద్యాలయాల వారీగా ప్రవేశాల విషయానికొస్తే ఉస్మానియా విశ్వవిద్యాలయ కళాశాలలు 1,95,397 సీట్లలో 34 శాతం మాత్రమే ప్రవేశాలు పొందాయి. కాకతీయ విశ్వవిద్యాలయ కళాశాలలు మొత్తం 1,07,080 సీట్లలో 31 శాతం ప్రవేశాలు వచ్చాయి.
ఉన్నత విద్యా మండలి, కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ దోస్త్ ఇంట్రా-కాలేజీ అడ్మిషన్ను ప్రకటించాయి. ఒకే కళాశాలలో తమ ప్రోగ్రామ్ను మార్చుకోవాలనుకునే విద్యార్థులు వెబ్ ఆప్షన్లలో పాల్గొనవచ్చు. ఇది జూలై 9, 10 తేదీలలో అందుబాటులో ఉంటుంది. సీట్లు జూలై 11న కేటాయిస్తారు. వెబ్ కౌన్సెలింగ్ మొదటి, రెండు, మూడవ దశలలో కేటాయించిన సీట్లను నిర్ధారించుకున్న అభ్యర్థులు ఇంట్రా-ఫేజ్ కౌన్సెలింగ్కు అర్హులు.

E-Paper












