Renault Cars : డస్టర్ హైబ్రిడ్ నుంచి 7 సీటర్ ఎస్​యూవీ వరకు- లాంచ్​కు రెడీ అవుతున్న 4 రెనాల్ట్ కార్లు ఇవే..

భారత ఆటోమొబైల్ మార్కెట్లో పూర్వ వైభవాన్ని సాధించేందుకు ఫ్రెంచ్ కార్ల తయారీ దిగ్గజం రెనాల్ట్ భారీ వ్యూహాన్ని రచించింది. డస్టర్ హైబ్రిడ్‌తో పాటు 7 సీటర్ ఎస్‌యూవీ, క్విడ్ ఫేస్‌లిఫ్ట్, సబ్-4 మీటర్ 'బ్రిడ్జర్' మోడళ్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సమాయత్తమవుతోంది. ఆ వివరాలు..

Published on: Aug 30, 2026, 11:20:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఐకానిక్ డస్టర్‌ను భారత్ మార్కెట్లోకి ప్రవేశపెట్టి గ్రాండ్​గా రీ-ఎంట్రీ ఇచ్చిన రెనాల్ట్ సంస్థ.. 2027 నాటికి మరో నాలుగు సరికొత్త కార్లను రోడ్డెక్కించేందుకు సిద్ధమైంది. మిడ్‌సైజ్ ఎస్‌యూవీ, ఫ్యామిలీ 7-సీటర్, ఎంట్రీ లెవెల్ హ్యాచ్‌బ్యాక్, సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగాల్లో ఈ మోడళ్లు రానున్నాయి. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..

రెనాల్ట్ డస్టర్ ఎస్​యూవీ..
రెనాల్ట్ డస్టర్ ఎస్​యూవీ..

డస్టర్ హైబ్రిడ్: దీపావళికి తొలి ఎలక్ట్రిఫైడ్ కారు!

ఈ పండగ సీజన్‌లో (దీపావళి) రెనాల్ట్ తన మొదటి ఎలక్ట్రిఫైడ్ కార్ 'డస్టర్ హైబ్రిడ్'ను మార్కెట్లోకి తెస్తోంది. ఇందులో ‘ఈ-టెక్ 160’ ఫుల్-హైబ్రిడ్ సాంకేతికతను అందించారు. 1.8-లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజిన్‌ను ఎలక్ట్రిక్ మోటార్‌తో అనుసంధానించడం ద్వారా ఇది 160 హెచ్‌పీ పవర్, 172 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.4 కిలోవాట్ అవర్ (కేడబ్ల్యూహెచ్) బ్యాటరీ ప్యాక్ సహాయంతో నగర ప్రయాణాల్లో దాదాపు 80 శాతం సమయం పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌లోనే ప్రయాణించవచ్చు. దీనివల్ల ఇంధన వినియోగం దాదాపు 40 శాతం వరకు తగ్గుతుంది.

ఒక్కసారి ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ చేస్తే ఏకంగా 1,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని, లీటరుకు దాదాపు 20 కిలోమీటర్ల మైలేజ్ సాధించవచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో మైలేజ్ కోరుకునే భారతీయ కస్టమర్లకు ఇది గొప్ప ఉపశమనం కానుంది.

కుటుంబ ప్రయాణాల కోసం 7-సీటర్ ఎస్‌యూవీ..

2027 ఆరంభం నాటికి డస్టర్ ఆధారిత 3-రో (మూడు వరుసల సీటింగ్) ఎస్‌యూవీని రెనాల్ట్ పరిచయం చేయనుంది. ఎక్కువమంది సభ్యులు ఉన్న కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని 7 సీట్ల సామర్థ్యంతో ఈ మోడల్ రాబోతోంది. పొడిగించిన వీల్‌బేస్ వల్ల రెండో వరుస ప్రయాణికులకు లెగ్‌రూమ్ పెరగడమే కాకుండా, ప్రయాణం మరింత విలాసవంతంగా మారుతుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ700, టాటా సఫరీ వంటి మోడళ్లకు ఇది పోటీగా నిలవనుంది. ఇందులో 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు హైబ్రిడ్ ఆప్షన్‌ను కూడా ప్రారంభం నుంచే అందించనున్నారు.

సరికొత్త అవతార్‌లో రెనాల్ట్ క్విడ్..

ఎంట్రీ లెవెల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో సంచలనం సృష్టించిన క్విడ్.. 2027 మధ్య నాటికి సరికొత్త ఫేస్‌లిఫ్ట్ రూపంలో రానుంది. కొత్త గ్రిల్, స్ల్పిట్ హెడ్‌ల్యాంప్స్, 14-అంగుళాల అల్లాయ్ వీల్స్, షార్క్-ఫిన్ యాంటెన్నాతో దీనికి స్పోర్టీ లుక్ ఇచ్చారు. కేబిన్ లోపల 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటి ప్రీమియం ఫీచర్లను జోడించనున్నారు.

టాటా నెక్సాన్‌కు పోటీగా 'బ్రిడ్జర్' ఎస్‌యూవీ..

2027 చివరి త్రైమాసికంలో రెనాల్ట్ నుంచి రాబోతున్న అత్యంత కీలకమైన మోడల్ ‘బ్రిడ్జర్’. సబ్-4 మీటర్ల కేటగిరీలో రానున్న ఈ కారు బాక్సీ డిజైన్, రగ్గడ్ లుక్, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌తో రోడ్డుపై గంభీరంగా కనిపించనుంది. వెనుక భాగంలో స్పేర్ వీల్ అమర్చడం దీని ప్రత్యేకత. కేబిన్ లోపల 400 లీటర్ల బూట్ స్పేస్, 200 మిమీ రియర్ నీ-రూమ్‌తో కేటగిరీలోనే అత్యధిక స్థలాన్ని ఆఫర్ చేయనుంది. టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మారుతీ సుజుకీ బ్రెజ్జాలకు సవాల్ విసురుతూ పెట్రోల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో ఈ మోడల్ లభించనుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More