...
...
Next Story

EPF vs stock market : ఈపీఎఫ్​ వర్సెస్ స్టాక్​ మార్కెట్- ఏది బెస్ట్? వ్యత్యాసాలు ఏంటి?

స్టాక్ మార్కెట్ పెట్టుబడులతో పోలిస్తే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఏ విధంగా సురక్షితమైనదో ఈపీఎఫ్‌ఓ స్పష్టం చేసింది. పదవీ విరమణ భద్రతకు ఈపీఎఫ్‌నే అత్యంత నమ్మకమైనదంటూ అధికారిక వీడియోలో వివరించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Published on: Aug 23, 2026, 06:47:00 IST
Advertisement

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్​ఓ) పెట్టుబడులకు సంబంధించి చేసిన ఒక వీడియో ఇప్పుడు ఇన్వెస్టర్లలో చర్చనీయాంశంగా మారింది. షేర్ మార్కెట్ పెట్టుబడులతో పోలిస్తే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) దీర్ఘకాలంలో ఏ విధంగా మెరుగైన భద్రతను ఇస్తుందో వివరిస్తూ తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియోను విడుదల చేసింది.

పీఎఫ్​ వర్సెస్ స్టాక్​ మార్కెట్.. (AI image)
పీఎఫ్​ వర్సెస్ స్టాక్​ మార్కెట్.. (AI image)

ఈపీఎఫ్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే చట్టబద్ధమైన సామాజిక భద్రతా పథకం. ఇది ఎవరికి నచ్చితే వారు స్వచ్ఛందంగా ఎంచుకునేది కాదు. ఈపీఎఫ్ చట్టం పరిధిలోకి వచ్చే సంస్థల్లో పనిచేస్తూ, నిర్ణీత వేతన పరిమితి రూ. 15,000 లోపు ఉన్న ఉద్యోగులందరూ దీనిలో సభ్యులుగా చేరడం తప్పనిసరి.

ఈపీఎఫ్ ఖాతాలోని డబ్బును నిబంధనల ప్రకారం నిర్దిష్ట అవసరాలకు మాత్రమే విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతిస్తారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి లేదా ఇతర ఆర్థిక సాధనాల కోసం మెంబర్లు తమ పీఎఫ్ డబ్బును డ్రా చేయడానికి వీలుపడదు.

పీఎఫ్ వర్సెస్ స్టాక్ మార్కెట్: కీలక వ్యత్యాసాలు..

స్టాక్ మార్కెట్ అనేది పూర్తిగా స్వచ్ఛందంగా, మార్కెట్ ఒడిదుడుకులపై ఆధారపడే పెట్టుబడి మార్గం. ఇది లాభాలను తెచ్చిపెట్టినప్పటికీ, ఇందులో భారీ రిస్క్ ఉంటుంది. కానీ, ఈపీఎఫ్ అలా కాదు. ప్రతి నెలా చేసే తప్పనిసరి నెలవారీ జమలు, ప్రభుత్వం ప్రకటించే స్థిరమైన వడ్డీ రేటు ఆధారంగా ఇది నడుస్తుంది.

ఈపీఎఫ్‌లో ఉన్న అతిపెద్ద ప్రయోజనం యజమాని (కంపెనీ) నుంచి వచ్చే వాటా. ఉద్యోగితో పాటు యజమాని కూడా ప్రతి నెలా వేతనంలో 12 శాతం చొప్పున ఫండ్‌కు జమ చేస్తారు. అయితే, స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు మాత్రం ఎవరి డబ్బు వారే పెట్టుకోవాలి. ప్రైవెట్ ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలో ఏ కంపెనీ కూడా అదనంగా పైసా జమ చేయదు.

అంతేకాకుండా ఈపీఎఫ్‌లో జమ చేసే మొత్తం, వచ్చే వడ్డీ, అర్హత కలిగిన విత్‌డ్రాలు అన్నీ పన్ను రహితమే. షేర్ మార్కెట్ లాభాలపై మాత్రం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడుతుంది.

పెన్షన్, ఆర్థిక క్రమశిక్షణ వంటి అదనపు లాభాలు..

రిటైర్మెంట్ తర్వాత ఈపీఎఫ్ ద్వారా పెన్షన్ ప్రయోజనాలతో పాటు, ఉద్యోగంలో ఉన్నకాలంలో బీమా భద్రత కూడా లభిస్తుంది. షేర్ మార్కెట్‌లో ఇవేవీ ఉండవు.

ఈపీఎఫ్ అనేది ప్రతి నెలా జీతంలో కోత విధించడం ద్వారా ఉద్యోగులలో ఆర్థిక క్రమశిక్షణను అలవాటు చేస్తుంది. షేర్ మార్కెట్ భాగస్వామ్యం మాత్రం పూర్తిగా వ్యక్తిగత ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. చాలా మంది ఉద్యోగులకు ఈపీఎఫ్ అనేది జీవితాంతం పొదుపు చేసుకునే ఒక బలవంతపు సేవింగ్స్ మెకానిజంగా పనిచేస్తుంది.

అయితే ఈపీఎఫ్, స్టాక్ మార్కెట్ రెండూ వేర్వేరు అవసరాల కోసం పనిచేస్తాయని ఈపీఎఫ్‌ఓ అంగీకరించింది. సంపద సృష్టికి, మూలధన వృద్ధికి షేర్ మార్కెట్ దానికదే ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. అయినప్పటికీ, పదవీ విరమణ భద్రత విషయంలో మాత్రం ఏ మార్కెట్ ఆధారిత ప్రొడక్ట్ ఇవ్వలేని స్థిరత్వాన్ని, ప్రభుత్వ హామీని ఈపీఎఫ్ అందిస్తుందని వివరించింది.

ఈపీఎఫ్ ఒక్కటే చాలు!

"ఆర్థిక లక్ష్యాలు వేర్వేరు అయినప్పటికీ, కేవలం రిటైర్మెంట్ భద్రత కోణంలో చూస్తే మాత్రం ఈపీఎఫ్ అత్యంత సురక్షితమైనది, స్థిరమైనది, నమ్మదగినది," అని ఈపీఎఫ్​ఓ తన యూట్యూబ్​ వీడియో ద్వారా తెలిపింది.

"సమగ్రంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. మీ ఈపీఎఫ్‌ను భద్రంగా ఉంచుకోండి. ఎందుకంటే తెలివైన వారికి ఈపీఎఫ్ ఒక్కటే చాలు," అని ఆ వీడియో ముగింపు సందేశం ఇస్తోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe