ఈపీఎఫ్ విత్డ్రాయల్ కొత్త రూల్స్ 2026: కేంద్రం కీలక ప్రకటన.. పిఎఫ్ డబ్బులు ఎలా, ఎప్పుడు తీసుకోవచ్చంటే?
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఫైనల్ సెటిల్మెంట్, పెన్షన్ ఉపసంహరణ విధానంలో నూతన నిబంధనలను తీసుకువచ్చింది. పూర్తి పీఎఫ్ రద్దుకు 12 నెలలు, ఈపీఎస్ పెన్షన్ విత్డ్రావల్కు 36 నెలల వెయిటింగ్ పీరియడ్ విధిస్తూనే.. అత్యవసరాల కోసం 75% వరకు పాక్షిక విత్డ్రావల్స్ చేసుకునే వెసులుబాటును సవరించింది.
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తమ చందాదారుల విత్డ్రాయల్ నిబంధనలలో కీలక మార్పులు తీసుకొచ్చింది. 'ఈపీఎఫ్ స్కీమ్ 2026' అమలులోకి రావడంతో పీఎఫ్ సొమ్ము, పెన్షన్ ఉపసంహరణ విధానాలపై పొదుపుదారుల్లో తలెత్తిన అనుమానాలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఆగస్టు 10న లోక్సభలో అడిగిన ప్రశ్నకు కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి శోభా కరండ్లజే లిఖితపూర్వక సమాధానమిస్తూ నూతన మార్గదర్శకాలను వివరించారు.

ఫైనల్ సెటిల్మెంట్కు వెయిటింగ్ పీరియడ్ ఎంత?
ఉద్యోగం వదిలేసిన వెంటనే పీఎఫ్ ఖాతాలోని మొత్తం సొమ్మును ఒకేసారి తీసుకునేందుకు ఇకపై వీలుండదు.
ఈపీఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ (EPF Final Settlement): గడువుకు ముందే పీఎఫ్ ఖాతాను పూర్తిగా క్లోజ్ చేసి మొత్తం నిధులు ఉపసంహరించుకోవడానికి 12 నెలల వెయిటింగ్ పీరియడ్ నిర్దేశించారు.
ఈపీఎస్ పెన్షన్ విత్డ్రావల్ (EPS Withdrawal): ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS) కింద వచ్చే ప్రయోజనాలను ఉపసంహరించుకోవడానికి 36 నెలల వెయిటింగ్ పీరియడ్ వర్తిస్తుంది.
75% వరకు పాక్షిక ఉపసంహరణకు అవకాశం!
వెయిటింగ్ పీరియడ్ విధించినప్పటికీ ఉద్యోగులు అత్యవసర పరిస్థితుల్లో నిధులు పొందకుండా పూర్తిగా అడ్డుకోవడం లేదని మంత్రి స్పష్టం చేశారు. అదే సమయంలో పాక్షిక విత్డ్రావల్స్ (Partial Withdrawals), అడ్వాన్స్ నిబంధనలను మరింత సరళతరం చేసినట్లు చెప్పారు.
చందాదారులు తమ ఖాతాలోని నిధుల్లో గరిష్టంగా 75 శాతం వరకు ఈ క్రింది మూడు ప్రధాన విభాగాల కింద ఉపసంహరించుకోవచ్చు:
అత్యవసర అవసరాలు (Essential needs): వైద్య ఖర్చులు, నిరుద్యోగ భృతి, పిల్లల విద్య మొదలైనవి.
గృహ అవసరాలు (Housing needs): ఇల్లు నిర్మాణం, కొనుగోలు లేదా రుణం చెల్లింపులు.
ప్రత్యేక పరిస్థితులు (Special circumstances): ఎలాంటి కారణం చెప్పకుండానే ఏడాదికి రెండుసార్లు తమ పీఎఫ్ బ్యాలెన్స్లో 75% వరకు విత్డ్రా చేసుకునే వెసులుబాటును కల్పించారు.
"నూతన నిబంధనల ప్రకారం పీఎఫ్ ఖాతాదారులు అత్యవసరాలు, ఇళ్ల నిర్మాణం లేదా ప్రత్యేక పరిస్థితుల్లో ఎలాంటి కారణాలు సూచించకుండానే సంవత్సరానికి రెండుసార్లు తమ బ్యాలెన్స్ నుండి 75% నిధులను ఉపసంహరించుకోవచ్చు" అని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి శోభా కరండ్లజే తెలిపారు.
సీబీటీ ఆమోదంతోనే నిర్ణయం
ఈ నూతన నిబంధనలు కార్మికులు, ఉద్యోగ సంఘాల అభిప్రాయాలకు అనుగుణంగానే రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మార్పులన్నీ ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) 238వ సమావేశంలో సమగ్రంగా చర్చించిన తర్వాతే ప్రభుత్వానికి సిఫార్సు చేశారని మంత్రి తెలిపారు. ఈ బోర్డులో కార్మిక సంఘాలు, యాజమాన్య ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
కార్మికులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా, ఈపీఎఫ్ఓ కింది చర్యలను వేగవంతం చేస్తోందని ప్రభుత్వం వెల్లడించింది:
ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ బలోపేతం: చందాదారుల సమస్యలను వేగంగా పరిష్కరించడం.
అవగాహన కార్యక్రమాలు: నూతన నిబంధనలపై సభ్యులకు స్పష్టతనివ్వడం.
డిజిటల్ క్లెయిమ్ సెటిల్మెంట్: ఆన్లైన్ అడ్వాన్స్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయడం.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


