Abhinandan Varthaman : ఐఏఎఫ్ వదిలి కమర్షియల్ పైలట్గా వీర చక్ర అభినందన్ వర్ధమాన్!
2019 బాలాకోట్ వైమానిక దాడుల సమరయోధుడు, గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ భారత వైమానిక దళానికి ముందస్తు పదవీ విరమణ ప్రకటించారు. గోవా, హైదరాబాద్ కేంద్రాలుగా పనిచేసే 'ఫ్లై91' ప్రైవేట్ ప్రాంతీయ ఎయిర్లైన్స్లో ఆయన కమర్షియల్ పైలట్గా నూతన బాధ్యతలు చేపట్టారు.
2019లో పాకిస్థాన్ ఎఫ్-16 విమానాన్ని నేలకూల్చి, దేశవ్యాప్తంగా అపారమైన ప్రజాదరణ పొందిన వీర చక్ర గ్రహీత, భారత వాయుసేన (ఐఏఎఫ్) మాజీ గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ తన జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. భారత వైమానిక దళానికి ముందస్తు పదవీ విరమణ ప్రకటించిన ఆయన, ప్రైవేట్ కమర్షియల్ పైలట్గా కొత్త అవతారం ఎత్తారు. ప్రాంతీయ విమానయాన సంస్థ 'ఫ్లై91' లో ఆయన పైలట్గా బాధ్యతలు చేపట్టినట్లు జాతీయ వార్తా సంస్థ పీటీఐ కథనం వెల్లడించింది.

సైనిక విమానం నుంచి కమర్షియల్ కాక్పిట్లోకి..
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అభినందన్ వర్ధమాన్ ఆగస్టు నెలలోనే ఈ ప్రైవేట్ ఎయిర్లైన్స్లో చేరారు. అయితే దీనిపై అభినందన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు ఉద్యోగుల వ్యక్తిగత వివరాలను వెల్లడించలేమని 'ఫ్లై91' ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. మార్చి 2024లో సేవలను ప్రారంభించిన ఫ్లై91 సంస్థ ప్రస్తుతం ఆరు ఏటీఆర్ 72-600 విమానాలతో సర్వీసులను నడుపుతోంది. ఈ సంస్థకు గోవాతో పాటు మన హైదరాబాద్ ప్రధాన స్థావరాలుగా ఉండటం విశేషం. దీనివల్ల రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల విమానాశ్రయాల్లోనూ అభినందన్ కమర్షియల్ విమానాలను నడిపే అవకాశం ఉంది.
బాలాకోట్ ప్రతిదాడులు
ఫిబ్రవరి 2019లో జమ్ముకశ్మీర్లోని పుల్వామా వద్ద జైషే మహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. దీనికి ప్రతికారంగా భారత సైన్యం పాకిస్థాన్లోని బాలాకోట్లో ఉన్న ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. ఈ పరిణామంతో ఆందోళన చెందిన పాకిస్థాన్ వైమానిక దళం మరుసటి రోజు భారత భూభాగంలోకి చొరబడటానికి ప్రయత్నించింది.
ఆ సమయంలో అభినందన్ వర్ధమాన్ (అప్పట్లో వింగ్ కమాండర్) తన మిగ్-21 బైసన్ యుద్ధ విమానంలో ఆకాశంలోకి దూసుకెళ్లారు. శత్రువుల నాటో స్థాయి అత్యాధునిక ఎఫ్-16 విమానాన్ని తన పాతతరం మిగ్-21తోనే సమర్థవంతంగా ఎదుర్కొని నేలకూల్చారు. ఆ తీవ్ర పోరాటంలో అభినందన్ విమానం కూడా దెబ్బతినడంతో ఆయన పారాచూట్ సాయంతో కిందకు దూకాల్సి వచ్చింది.
పాక్ బందీగా మూడు రోజులు.. చెరగని ధైర్యం
పారాచూట్ ద్వారా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లో ల్యాండ్ అయిన అభినందన్ను పాక్ సైన్యం బందీగా పట్టుకుంది. ప్రత్యర్థి దేశంలో బందీగా ఉన్నప్పటికీ, ఆయన ప్రదర్శించిన ధైర్యం, ఆత్మవిశ్వాసం, గంభీరమైన వైఖరి ప్రతీ భారతీయుడి హృదయాన్ని గెలుచుకున్నాయి.
అనంతరం దౌత్యపరమైన ఒత్తిళ్లకు తలొగ్గిన పాకిస్థాన్, మార్చి 1వ తేదీ రాత్రి వాఘా సరిహద్దు వద్ద ఆయనను భారత్కు అప్పగించింది.
కష్టసమయంలో అసమాన ధైర్యసాహసాలు, దేశభక్తిని ప్రదర్శించినందుకు గాను భారత ప్రభుత్వం ఆయనకు దేశంలో మూడో అత్యున్నత సైనిక పురస్కారం 'వీర చక్ర'ను ప్రదానం చేసి గౌరవించింది. వింగ్ కమాండర్ హోదా నుంచి గ్రూప్ కెప్టెన్గా పదోన్నతి పొందిన అభినందన్, వాయుసేనలో ఏళ్ల తరబడి సేవలందించిన తర్వాత ఇప్పుడు సాధారణ ప్రయాణికులను చేరవేసే కమర్షియల్ విమానాల కాక్పిట్లోకి అడుగుపెట్టారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


