జేఈఈ మెయిన్స్ 2026 కోసం ఫ్రీ ‘క్రాష్ కోర్సు’- మీ ప్రిపరేషన్కి చాలా ఉపయోగకరం!
జేఈఈ మెయిన్స్ 2026కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు అలర్ట్! 40 రోజుల ఫ్రీ- జేఈఈ మెయిన్స్ క్రాష్ కోర్సును ప్రారంభిస్తోంది ఐఐటీ కాన్పూర్. ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉండనుంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
జేఈఈ మెయిన్స్ 2026 సెషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంకొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది. ఇంజినీరింగ్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్ష కోసం విద్యార్థులు ఇప్పటికే తమ ప్రిపరేషన్ని పెంచారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందన సాథీ (SATHEE - Self-Assessment Test and Help for Entrance Exams) లో భాగంగా.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ కీలక ప్రకటన చేసింది. జేఈఈ మెయిన్స్ 2026 జనవరి సెషన్కు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం 40 రోజుల పాటు ఉచిత ఆన్లైన్ క్రాష్ కోర్సును ప్రారంభించనున్నట్టు వెల్లడించింది.

జేఈఈ మెయిన్స్ 2026- క్రాష్ కోర్సు వివరాలు..
నవంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ జేఈఈ మెయిన్స్ 2026 క్రాష్ కోర్సు, విద్యార్థుల్లో ప్రాథమిక భావనలపై పట్టును పెంచడం, వారి పరీక్షా పనితీరును మెరుగుపరచడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ కోర్సులో ఐఐటీ నిపుణులు నిర్వహించే లైవ్, రికార్డెడ్ ఇంటరాక్టివ్ సెషన్లు ఉంటాయి. దీనితో పాటు, ప్రతిరోజూ ప్రాక్టీస్ ప్రాబ్లెమ్స్, చాప్టర్ వారీ పరీక్షలు, ఆల్ ఇండియా మాక్ టెస్ట్ సిరీస్ను కూడా అందిస్తున్నారు.
విద్యార్థులు వారి పురోగతిని వ్యక్తిగతంగా ట్రాక్ చేసుకోవడానికి వీలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత పనితీరు విశ్లేషణ సదుపాయం కూడా అందుబాటులో ఉంది!
జేఈఈ మెయిన్స్ 2026 క్రాష కోర్సు- ఉచిత మెంటార్షిప్..
ఐఐటీ కాన్పూర్ నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో, ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉచిత మెంటార్షిప్, మోటివేషనల్ సెషన్లు, సందేహాల నివృత్తి మద్దతు లభిస్తుంది.
లెక్చర్లు, అభ్యాస సామగ్రి, పనితీరు నివేదికలతో పాటు అన్ని వనరులు SATHEE ప్లాట్ఫారమ్, దాని మొబైల్ యాప్ (ఆండ్రాయిడ్, ఐఓఎస్లలో అందుబాటులో ఉంది) ద్వారా ఎటువంటి ఖర్చు లేకుండా అందుకోవచ్చు!
ఈ జేఈఈ మెయిన్స్ 2026 ఫ్రీ క్రాష్ కోర్సు కోసం విద్యార్థులు sathee.iitk.ac.in వెబ్సైట్ను సందర్శించి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
SATHEE వేదిక గురించి..
ఐఐటీ కాన్పూర్ అభివృద్ధి చేసి, విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించిన సాథీ వేదిక ముఖ్య ఉద్దేశం నాణ్యమైన అభ్యాస వనరులను అందరికీ అందుబాటులోకి తేవడం. ఇది నిపుణుల నేతృత్వంలోని సెషన్లు, నిర్మాణాత్మక అభ్యాస మార్గాలు, డేటా ఆధారిత మూల్యాంకనాలను అందిస్తుంది.
ప్రస్తుతం, ఈ ప్లాట్ఫారమ్ జేఈఈ, నీట్, సీయూఈటీ, క్లాట్, ఐకార్, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్ వంటి పరీక్షలకు ఉచితంగా ప్రిపరేషన్ మద్దతు ఇస్తోంది. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020కి అనుగుణంగా, ఈ వేదిక సమ్మిళిత, బహుభాషా అభ్యాసాన్ని ప్రోత్సహిస్తోంది.
ఈ ప్లాట్ఫారమ్ త్వరలో 12 భారతీయ భాషల్లో అందుబాటులోకి రానుంది! దీని ద్వారా విభిన్న భాషా, సామాజిక-ఆర్థిక నేపథ్యాల విద్యార్థులను చేరుకోవాలనే ప్రభుత్వ లక్ష్యం మరింత బలోపేతం అవుతుంది.
20 విభాగాలు, 26 కేంద్రాలు, మూడు ఇంటర్డిసిప్లినరీ కార్యక్రమాలు, మూడు ప్రత్యేక పాఠశాల్లతో ఐఐటీ కాన్పూర్.. విద్యా రంగంలో, ఆవిష్కరణలలో అగ్రగామిగా ఉంది. 590 మందికి పైగా ఫుల్ టైమ్ ఫ్యాకల్టీ సభ్యులు, 9,500 కంటే ఎక్కువ మంది విద్యార్థుల మద్దతుతో ఈ సంస్థ భారతదేశంలో అందుబాటు ధరలో, సాంకేతికత ఆధారిత విద్యను ముందుకు తీసుకెళ్లడంలో ముందుంది.

E-Paper












