రైలు ప్రయాణం చేసే మహిళలకు కేంద్ర ప్రభుత్వం, ప్రముఖ టెలికాం మౌలిక సదుపాయాల సంస్థ ఇండస్ టవర్స్ (Indus Towers) పెద్ద ఉపశమనం కలిగించాయి. మహిళల ఆరోగ్యం, పరిశుభ్రతను పెంపొందించే లక్ష్యంతో నార్తర్న్ రైల్వేస్తో కలిసి ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. 'నారీ సమ్మాన్' అనే కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) పథకం కింద ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో మహిళా ప్రయాణికులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్లను అందిస్తున్నారు.
175 స్టేషన్లలో 500 వెండింగ్ మిషన్లు
ఈ ప్రాజెక్టులో భాగంగా ఢిల్లీ, ఫిరోజ్పూర్, అంబాలా, మొరాదాబాద్, లక్నో డివిజన్ల పరిధిలోని 175 రైల్వే స్టేషన్లలో మొత్తం 500 శానిటరీ నెప్కిన్ వెండింగ్ మిషన్లను విజయవంతంగా అందుబాటులోకి తెచ్చారు. ఈ మిషన్లను సరికొత్త ఐఓటీ (IoT - ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) సాంకేతికతతో అనుసంధానించడం విశేషం. దీనివల్ల మిషన్లలో ప్యాడ్ల నిల్వలను ఎప్పటికప్పుడు కేంద్రీకృత వ్యవస్థ ద్వారా పర్యవేక్షించవచ్చు. ఇప్పటివరకు ఈ మిషన్ల ద్వారా దాదాపు 3 కోట్ల శానిటరీ నాప్కిన్లను మహిళా ప్రయాణికులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఇండస్ టవర్స్ నిర్వహిస్తున్న 'ప్రగతి' అనే విస్తృత సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాజెక్టు నడుస్తోంది.
మహిళల గౌరవానికి ప్రథమ ప్రాధాన్యం
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) లోని 'మెన్స్ట్రువల్ హైజీన్ స్కీమ్' (MHS) ఆశయాలకు అనుగుణంగా ఈ మౌలిక సదుపాయాలను రైల్వే స్టేషన్లలో కల్పిస్తున్నారు. ఇది ప్రజా రవాణా రంగంలో మహిళా కేంద్రీకృత వసతుల కల్పనకు అద్దం పడుతోంది.
"భారతీయ రైల్వేలో ప్రతిరోజూ లక్షలాది మంది మహిళలు, విద్యార్థినులు ప్రయాణిస్తుంటారు. వారి సౌకర్యం, భద్రత, గౌరవానికి అండగా నిలవడమే మా ప్రథమ ప్రాధాన్యం. ఇండస్ టవర్స్తో కుదిరిన ఈ భాగస్వామ్యం ప్రజా రవాణా వ్యవస్థను మహిళలకు మరింత అనుకూలంగా మార్చడంలో ఒక కీలక అడుగు" అని నార్తర్న్ రైల్వేస్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ పాండే పేర్కొన్నారు.
రైల్వే స్టేషన్ల వంటి నిరంతరం రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలలో ఇలాంటి సదుపాయాలు కల్పించడం వల్ల మహిళల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఇండస్ టవర్స్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) తేజీందర్ కల్రా ఆనందం వ్యక్తం చేశారు.
{{/usCountry}}రైల్వే స్టేషన్ల వంటి నిరంతరం రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలలో ఇలాంటి సదుపాయాలు కల్పించడం వల్ల మహిళల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఇండస్ టవర్స్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) తేజీందర్ కల్రా ఆనందం వ్యక్తం చేశారు.
{{/usCountry}}"భారతదేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే జోన్లలో ఈ ప్రాజెక్టును ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం మా సాంకేతిక, నిర్వహణ సామర్థ్యానికి నిదర్శనం. ప్రయాణ సమయంలో ఇలాంటి సదుపాయాలు సులభంగా దొరికినప్పుడే మహిళల ఆత్మగౌరవానికి నిజమైన రక్షణ లభిస్తుంది" అని తేజీందర్ కల్రా స్పష్టం చేశారు.
రైల్వేల్లో మహిళా ప్రయాణానికి కొత్త భరోసా
భారతీయ రైల్వేలు ఇప్పటికే మహిళల కోసం ప్రత్యేక కోచ్లు, కట్టుదిట్టమైన రక్షణ చర్యలు అమలు చేస్తున్నాయి. వీటికి అదనంగా ఇప్పుడు పీరియడ్స్ సమయాల్లో ఇబ్బంది పడకుండా స్టేషన్లలోనే ఉచిత ప్యాడ్ల సదుపాయాన్ని చేర్చడం ప్రయాణ అనుభవాన్ని మరింత సురక్షితంగా మార్చనుంది. ఇండస్ టవర్స్ సంస్థ తన విస్తృత సామాజిక బాధ్యతలో భాగంగా 2030 నాటికి దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.