IPL SRH Team 2026 : SRH జట్టులోకి జూనియర్‌ స్టెయిన్‌ వచ్చేశాడు - ఈ స్టార్ బౌలర్ తో ఇక దబిడి దిబిడే..!

IPL SRH Team 2026: ఐపీఎల్ 2026లో వరుస గాయాలతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్‌ కొయిట్జీ చేరాడు. చీలమండ గాయంతో టోర్నీకి దూరమైన డేవిడ్ పేన్ స్థానంలో కొయిట్జీ ఆడనున్నాడు.

Published on: Apr 18, 2026, 17:04:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టును గాయాల బెడద వెంటాడుతూనే ఉంది. తాజాగా జట్టులోని కీలక బౌలర్ డేవిడ్ పేన్ చీలమండ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. దీంతో సన్ రెజర్స్ హైదరాబాద్ కీలక ప్రకటన చేసింది. అతని స్థానాన్ని దక్షిణాఫ్రికాకు చెందిన స్టార్ పేసర్ గెరాల్డ్‌ కొయిట్జీతో భర్తీ చేయాలని నిర్ణయించింది. అతడిని జట్టులోకి తీసుకున్నట్లు ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం శనివారం ప్రకటించింది.

SRH స్క్వాడ్ లోకి  గెరాల్డ్‌ కొయిట్జీ
SRH స్క్వాడ్ లోకి గెరాల్డ్‌ కొయిట్జీ

డేవిడ్ పేన్ నిష్క్రమణతో ఎస్‌ఆర్‌హెచ్ డెత్ ఓవర్ల బౌలింగ్‌పై కొంత ఆందోళన నెలకొన్న తరుణంలో…. గెరాల్డ్ కొయిట్జీని ఎస్ఆర్ హెచ్ రూ. 2 కోట్లకు ఒప్పందం చేసుకుంది. దీంతో బౌలింగ్ విభాగం పటిష్టం కానుంది.

కొయిట్జీ తన వేగవంతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగల సామర్థ్యం ఉన్న బౌలర్. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడంలో దిట్టగా చెప్పొచ్చు. హైదరాబాద్ పిచ్‌ పై అతని పేస్, బౌన్స్ జట్టుకు అదనపు బలాన్ని ఇస్తాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

గతంలో ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన కోయిట్జీకి మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఆడిన 14 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఆయన 15 వికెట్లు పడగొట్టారు. ముఖ్యంగా 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన అతను…. 10 మ్యాచ్‌ల్లోనే 13 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించారు. అంతర్జాతీయ స్థాయిలోనూ అతనికి మంచి అనుభవం ఉంది. దక్షిణాఫ్రికా తరఫున 4 టెస్టులు, 14 వన్డేలు, 18 టీ20లు ఆడిన కొయిట్జీ…. మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 67 వికెట్లు సాధించారు. సఫారీ క్రికెట్లో కొయిట్జీని జూనియర్‌ స్టెయిన్‌ అని కూడా అంటారు. కొయిట్జీ కేవలం బౌలర్‌ మాత్రమే కాదు లోయర్‌ఆర్డర్‌లో హార్డ్‌ హిట్టింగ్‌ చేసే బ్యాటర్‌ కూడా…!

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్ల గాయాల వల్ల తీవ్రంగా దెబ్బతింది. ఇప్పుడు తప్పుకున్న డేవిడ్ పేన్ కూడా అంతకుముందు గాయపడిన జాక్ ఎడ్వర్డ్స్ స్థానంలోనే జట్టులోకి వచ్చారు. పేన్ ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 14 ఎకానమీ రేటుతో రెండు వికెట్లు తీశారు.

వెన్ను గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడం ఎస్ఆర్‌హెచ్‌కు పెద్ద లోటుగా మారింది. కమిన్స్ లేని సమయంలో ఇషాన్ కిషన్ జట్టును నడిపిస్తున్నారు. అయితే…. క్రికెట్ ఆస్ట్రేలియా నుండి కమిన్స్‌కు క్లియరెన్స్ రావడంతో ఏప్రిల్ 25న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌కు ఆయన అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

శనివారం(ఇవాళ) హైదరాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని ఆరెంజ్ ఆర్మీ భావిస్తోంది. రాజస్థాన్ రాయల్స్‌పై సాధించిన విజయం జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపిందని…. ఇదే జోరును సిఎస్‌కెపై కూడా కొనసాగిస్తామని హెడ్ కోచ్ డేనియల్ వెటోరి ఆశాభావం వ్యక్తం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More