గణేష్ చతుర్థి వేళ పసిడి ధమాకా: తులం బంగారం రూ.1.53 లక్షలు.. ఇప్పుడు కొనొచ్చా?

వినాయక చవితి పండుగతో దేశంలో పండుగల సీజన్ ప్రారంభమైంది. గత ఏడాదితో పోలిస్తే బంగారం ధరలు 45-50 శాతం పెరిగినప్పటికీ, పసిడి కొనుగోళ్లపై ప్రజల్లో ఆసక్తి తగ్గడం లేదు. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.1.53 లక్షల వద్ద స్థిరంగా ట్రేడవుతున్న నేపథ్యంలో నిపుణుల విశ్లేషణ చూడండి.

Published on: Sep 10, 2026, 16:42:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశంలో వినాయక చవితి శుభవేళతో ప్రతిష్ఠాత్మకమైన పండుగల సీజన్ మొదలైంది. పూజలు, కానుకలు, రాబోయే పెళ్లిళ్ల సీజన్ కోసం బంగారం, వెండి నాణేలు, ఆభరణాలు కొనడానికి ఇళ్లలో సన్నాహాలు మొదలయ్యాయి. అయితే, ఈసారి బంగారం ధర చుక్కలనంటుతోంది. గత ఏడాది గణేష్ చతుర్థి నాటి ధరలతో పోలిస్తే పసిడి ఏకంగా 45 నుంచి 50 శాతం పైగా ప్రియమైంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో అక్టోబర్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,618 వద్ద కొనసాగుతోంది. ఈ భారీ ధరల నేపథ్యంలో ఇప్పుడు బంగారం కొనడం శ్రేయస్కరమా లేదా ధరలు తగ్గే వరకు వేచి చూడాలా అనే సందేహం సామాన్యులతో పాటు పెట్టుబడిదారుల్లోనూ నెలకొంది.

గణేష్ చతుర్థి వేళ పసిడి ధమాకా: తులం బంగారం రూ.1.53 లక్షలు.. ఇప్పుడు కొనొచ్చా?
గణేష్ చతుర్థి వేళ పసిడి ధమాకా: తులం బంగారం రూ.1.53 లక్షలు.. ఇప్పుడు కొనొచ్చా?

లైట్‌వెయిట్ ఆభరణాలు, నాణేల వైపే మొగ్గు

ధరలు ఎంత పెరిగినా పసిడిపై భారతీయులకున్న ఆదరణ తగ్గదని విపణి నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, కొనుగోలు తీరులో మార్పులు కనిపిస్తున్నాయి. భారీ ఆభరణాల కంటే తేలికపాటి (లైట్‌వెయిట్) జ్యువెలరీ, పసిడి నాణేలు, గోల్డ్ బార్ల కొనుగోలుకే ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు.

"దేశంలో పండుగల విక్రయాలకు వినాయక చవితి దిశానిర్దేశం చేస్తుంది. గత ఏడాదితో పోలిస్తే ధరలు 45-50 శాతం పెరిగినప్పటికీ పసిడి కొనుగోళ్లు పుంజుకుంటాయి" అని ఇండియన్ అసోసియేషన్ ఫర్ గోల్డ్ ఎక్సలెన్స్ అండ్ స్టాండర్డ్స్ (IAGES) సీఈఓ కౌశ్లేంద్ర సిన్హా తెలిపారు. పెరిగిన ధరల వల్ల వినియోగదారులు జాగ్రత్తగా అడుగులు వేస్తూ, పాత బంగారం మార్పిడి (Exchange), అప్‌గ్రేడ్ సదుపాయాలను ఎక్కువగా వాడుకుంటారని ఆయన విశ్లేషించారు.

స్థిరంగా ధరలు.. మార్కెట్‌కు సానుకూలం

ఆస్పెక్ట్ బులియన్ & రిఫైనరీ సీఈఓ దర్శన్ దేశాయ్ మాట్లాడుతూ, ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.1.53 లక్షల వద్ద స్థిరంగా కొనసాగడం మార్కెట్‌కు కలిసొచ్చే అంశమని పేర్కొన్నారు. "రాబోయే వారాల్లో పండుగ కొనుగోళ్లు, గిఫ్టింగ్ అవసరాలు మార్కెట్‌ను నడిపిస్తాయి. ముఖ్యంగా కస్టమైజ్డ్ బులియన్, నాణేలకు డిమాండ్ పెరుగుతుంది. అయితే, అమెరికా వడ్డీ రేట్ల అంచనాలు, డాలర్ విలువ, భౌగోళిక ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉంది" అని వివరించారు.

అంతర్జాతీయ పరిణామాలు.. పెరగడానికి కారణాలేంటి?

అంతర్జాతీయ విపణిలో డాలర్ బలహీనపడటం, అమెరికా ప్రభుత్వ రుణాలు, ద్రవ్యోల్బణ ఆందోళనలు పసిడికి కలిసివస్తున్నాయి. మరోవైపు గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. అమెరికా వైమానిక దాడులకు తిరుగుబాట్లు తప్పవని ఇరాన్ హెచ్చరించడం, నవంబర్‌లో జరగబోయే మిడ్‌టర్మ్ ఎన్నికల కంటే ముందు ఈ ఘర్షణలు ముగిసేలా లేవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించడం మార్కెట్‌లో అనిశ్చితిని పెంచాయి.

అంతేకాకుండా, అమెరికా ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ (PPI), కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) గణాంకాలు వెలువడనున్నాయి. ఇవి యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాన్ని ప్రభావితం చేయనున్నాయి. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే సెప్టెంబర్‌లో వడ్డీ రేట్ల పెంపునకు దారితీసి బంగారంపై ఒత్తిడి పెరగొచ్చు. ద్రవ్యోల్బణం తగ్గితే బంగారం ధర అంతర్జాతీయంగా ఔన్సుకు 4,400 డాలర్ల స్థాయికి చేరుకునే అవకాశముంది.

పెట్టుబడిదారులకు నిపుణుల సలహా: తగ్గినప్పుడు కొనడమే ఉత్తమం!

ఆగ్మాంట్ చీఫ్ రీసెర్చ్ ఆఫీసర్ (CRO) రేనిషా చై నానీ సాంకేతిక విశ్లేషణ ప్రకారం, బంగారం ధరలు అంతర్జాతీయంగా 4,300 డాలర్ల నుంచి 4,500 డాలర్ల (భారత మార్కెట్‌లో రూ.1,50,000 నుంచి రూ.1,57,000) పరిధిలో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో ధర బాగా పెరిగినప్పుడు తొందరపడి కొనడం కంటే, మార్కెట్‌లో ధరలు కొద్దిగా తగ్గినప్పుడు (Buy on dips) కొనుగోలు చేసి, పెరిగినప్పుడు విక్రయించడం (Sell on rallies) శ్రేయస్కరమని ఆమె సూచించారు.

పండుగలు, వివాహాల కోసం బంగారం కొనాలనుకునేవారు భారీ కొనుగోళ్ల జోలికి వెళ్లకుండా, విడతల వారీగా లేదా తేలికపాటి ఆభరణాలు ఎంచుకోవడం ఉత్తమమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More