బంగారం, వెండి ధరలు పైపైకి.. ఇప్పుడు ఈటీఎఫ్, ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టొచ్చా?

అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు సరికొత్త గరిష్ఠాలను తాకాయి. ఈ నేపథ్యంలో సామాన్య పెట్టుబడిదారులు ఫిజికల్ గోల్డ్ కంటే ఈటీఎఫ్‌లు, మ్యూచువల్ ఫండ్ల వైపు మొగ్గు చూపడం లాభదాయకమని నిపుణులు సూచిస్తున్నారు.

Published on: Jan 23, 2026 9:41 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బంగారం, వెండి ధరలు తగ్గడం మాటేమో కానీ, రోజురోజుకూ కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నాయి. శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఔన్సు‌కు 4,969.69 డాలర్ల వద్ద సరికొత్త రికార్డును నమోదు చేసింది. వెండి కూడా ఏమాత్రం తగ్గకుండా 2.50 శాతం లాభంతో ఔన్సు‌కు 98.980 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతూ ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరుస్తోంది.

బంగారం, వెండి ధరలు పైపైకి.. ఇప్పుడు ఈటీఎఫ్, ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టొచ్చా? (An AI-generated image)
బంగారం, వెండి ధరలు పైపైకి.. ఇప్పుడు ఈటీఎఫ్, ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టొచ్చా? (An AI-generated image)

మున్ముందు మరిన్ని పరుగులు

పసిడి ధరలు ఇక్కడితో ఆగుతాయని ఎవరూ భావించడం లేదు. ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేసిన దానికంటే వేగంగా ధరలు పెరుగుతున్నాయి. 2026 చివరి నాటికి చేరుకోవాల్సిన లక్ష్యాలను ఈ ఏడాది మొదటి మూడు వారాల్లోనే బంగారం అందుకుంది.

  • జెఫరీస్ (Jefferies): 6,600 డాలర్లు
  • యార్డెనీ గ్రూప్ (Yardeni): 6,000 డాలర్లు
  • యూబీఎస్ (UBS): 5,400 డాలర్లు
  • జేపీ మోర్గాన్: 5,050 డాలర్లు

ప్రముఖ రచయిత రోబర్ట్ కియోసాకి అయితే వెండి ధర 2026లో 200 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ధరలు తగ్గినప్పుడల్లా వెండిని కొనుగోలు చేయడం (Bottom fishing) మంచి అవకాశమని ఆయన సూచించారు.

సామాన్యులకు ఈటీఎఫ్ (ETF) ఒక వరమా?

బంగారం, వెండి ధరలు సామాన్యుడి బడ్జెట్‌కు అందనంత ఎత్తుకు చేరుకున్న వేళ, 'ఫిజికల్ గోల్డ్' (నగలు లేదా బిస్కెట్లు) కొనడం కష్టతరంగా మారుతోంది. ఇలాంటి వారికి గోల్డ్/సిల్వర్ ఈటీఎఫ్‌లు అద్భుతమైన ప్రత్యామ్నాయమని సెబీ నమోదిత పెట్టుబడి నిపుణుడు జితేంద్ర సోలంకి వివరించారు.

"కేవలం కొన్ని వందల రూపాయలతో కూడా ఈటీఎఫ్‌లలో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. వీటిలో లిక్విడిటీ (నగదుగా మార్చుకునే సౌలభ్యం) ఎక్కువగా ఉంటుంది. అమ్మే సమయంలో తరుగు, మజూరీ వంటి అదనపు ఖర్చులు ఉండవు. ఫిజికల్ గోల్డ్‌తో పోలిస్తే ఇవి చిన్న ఇన్వెస్టర్లకు ఎంతో మేలు," అని జితేంద్ర సోలంకి పేర్కొన్నారు.

ఈటీఎఫ్ vs మ్యూచువల్ ఫండ్స్: ఏది సురక్షితం?

ధరలు రికార్డు స్థాయిలో ఉన్నప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టడం కొంత రిస్క్‌తో కూడుకున్న పని. ఆప్టిమా మనీ మేనేజర్స్ సీఈవో పంకజ్ మత్పాల్ ప్రకారం.. తక్కువ రిస్క్ తీసుకోవాలనుకునే వారు మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవడమే ఉత్తమం.

"ధరలు గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పుడు గోల్డ్, సిల్వర్ మ్యూచువల్ ఫండ్లలో ఎస్‌ఐపీ (SIP) పద్ధతిలో పెట్టుబడి పెట్టడం వల్ల నష్ట భయం తగ్గుతుంది. మ్యూచువల్ ఫండ్లు నేరుగా ఈటీఎఫ్‌లలోనే పెట్టుబడి పెట్టినప్పటికీ, ఎస్‌ఐపీ ద్వారా ధరల హెచ్చుతగ్గుల (Rupee Cost Averaging) ప్రయోజనం లభిస్తుంది" అని పంకజ్ మత్పాల్ వివరించారు.

నిపుణులు సూచించిన కొన్ని టాప్ ఫండ్లు ఇవే:

గోల్డ్ ఈటీఎఫ్‌లు (Gold ETFs):

  1. నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ గోల్డ్ బీఈఎస్ (Gold BeES)
  2. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్
  3. హెచ్‌డీఎఫ్‌సీ గోల్డ్ ఈటీఎఫ్

వెండి ఈటీఎఫ్‌లు (Silver ETFs):

  1. ఏబీఎస్‌ఎల్ (ABSL) సిల్వర్ ఈటీఎఫ్
  2. ఐసీఐసీఐ సిల్వర్ ఈటీఎఫ్
  3. కోటక్ సిల్వర్ ఈటీఎఫ్

మ్యూచువల్ ఫండ్లు (MFs):

  1. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ రెగ్యులర్ గోల్డ్ సేవింగ్స్ ఫండ్
  2. హెచ్‌డీఎఫ్‌సీ గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (FoF)
  3. నిప్పాన్ ఇండియా సిల్వర్ ఈటీఎఫ్ ఎఫ్ఓఎఫ్

(ముఖ్య గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది కాబట్టి, పెట్టుబడి పెట్టే ముందు సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించడం శ్రేయస్కరం.)

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More