Gold, silver rates today: తగ్గేదేలే అంటున్న బంగారం వెండి ధరలు
Gold, silver rates today: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఔన్స్ బంగారం ధర 5,500 డాలర్ల మైలురాయిని దాటగా, వెండి 119 డాలర్లకు చేరింది. భౌగోళిక ఉద్రిక్తతలు, ఫెడ్ నిర్ణయాలు ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణాలు.
న్యూ ఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో పసిడి పరుగుకు బ్రేకులు పడటం లేదు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో మదుపర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతుండటంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గురువారం ట్రేడింగ్లో స్పాట్ గోల్డ్ 2.1 శాతం వృద్ధితో 5,511.79 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఒక దశలో ఇది 5,591.61 డాలర్ల వద్ద ఆల్టైమ్ హైని తాకడం విశేషం.

కేవలం ఈ వారంలోనే బంగారం ధర సుమారు 10 శాతానికి పైగా పెరిగింది. సోమవారం నాడు తొలిసారిగా 5,000 డాలర్ల మార్కును అధిగమించిన పసిడి, అప్పటి నుండి వెనక్కి తిరిగి చూడలేదు. కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు, అమెరికా డాలర్ బలహీనపడటం వంటి అంశాలు పసిడికి కలిసివచ్చాయి.
వెండి కూడా జోరు..
బంగారంతో పోటీ పడుతూ వెండి ధరలు కూడా దూసుకుపోతున్నాయి. స్పాట్ సిల్వర్ 1.3 శాతం పెరిగి ఔన్స్కు 118.06 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సెషన్ ప్రారంభంలో ఇది 119.34 డాలర్ల రికార్డు స్థాయికి చేరుకుంది. ఈ ఏడాది వెండి ఏకంగా 60 శాతానికి పైగా లాభపడటం గమనార్హం.
ధరల పెరుగుదల వెనుక ప్రధాన కారణాలివే:
ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడం, ద్రవ్యోల్బణం ఇంకా లక్ష్యానికి పైనే ఉందన్న ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలు మార్కెట్పై ప్రభావం చూపాయి.
ట్రంప్ హెచ్చరికలు - ఇరాన్ ప్రతిఘటన: ఇరాన్తో అణు ఒప్పందంపై చర్చలకు రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిస్తూనే, సైనిక చర్య తీసుకుంటే అది చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. దీనికి ప్రతిగా అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా దాడులు చేస్తామని టెహ్రాన్ హెచ్చరించడం భౌగోళిక ఉద్రిక్తతలను పెంచింది.
క్రిప్టో సంస్థ పెట్టుబడులు: ప్రముఖ క్రిప్టో సంస్థ 'టెథర్' (Tether) తన పోర్ట్ఫోలియోలో 10% నుండి 15% వరకు ఫిజికల్ గోల్డ్లో పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించడం పసిడికి మరింత బలాన్నిచ్చింది.
సరఫరా లోటు: వెండి మార్కెట్లో డిమాండ్కు తగినంత సరఫరా లేకపోవడం, స్టాక్ తక్కువగా ఉండటం ధరల పెరుగుదలకు దారితీస్తోందని స్టాండర్డ్ చార్టర్డ్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలి
బంగారం, వెండి మార్కెట్లు ప్రస్తుతం అత్యంత బలంగా ఉన్నప్పటికీ, సాంకేతికంగా కొన్ని హెచ్చరికలు కనిపిస్తున్నాయని నిపుణులు సూచిస్తున్నారు.
"ప్రస్తుతం మార్కెట్లో మొమెంటం చాలా బలంగా ఉంది. అయితే 'రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్' (RSI) ప్రకారం మార్కెట్ ఓవర్బాట్ (అతిగా కొనుగోళ్లు జరిగిన) స్థితిలో ఉంది. రోజువారీ RSI డైవర్జెన్స్ ఒక 'రెడ్ ఫ్లాగ్' (హెచ్చరిక) వంటిది. కాబట్టి లాంగ్ పొజిషన్లు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి" అని ఛాయిస్ బ్రోకింగ్కు చెందిన కమోడిటీ అనలిస్ట్ అమీర్ మక్దా పేర్కొన్నారు.
రాబోయే సెషన్లలో ఈ లోహాలు పాజిటివ్గానే ఉండే అవకాశం ఉన్నప్పటికీ, స్వల్పకాలికంగా జాగ్రత్త వహించడం మంచిదని ఆయన సూచించారు.

E-Paper












