గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ ఐపీఓ జీఎంపీ ఎంత? అప్లై చేయాలా? వద్దా?
మల్టీస్పెషాలిటీ హెల్త్కేర్ సంస్థ 'గుజరాత్ కిడ్నీ' ఐపీఓ నేడు ప్రారంభమైంది. రూ. 108-114 ప్రైస్ బ్యాండ్తో వస్తున్న ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 250.80 కోట్లు సేకరించనుంది. మరి ఈ ఐపీఓకి అప్లై చేయాలా? వద్దా? నిపుణులు ఏమంటున్నారంటే..

గుజరాత్ కేంద్రంగా వైద్య సేవలు అందిస్తున్న 'గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ' హాస్పిటల్స్ లిమిటెడ్ తన పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)తో నేడు ఇన్వెస్టర్ల ముందుకు వచ్చింది. డిసెంబర్ 22న ప్రారంభమైన ఈ సబ్స్క్రిప్షన్ ప్రక్రియ బుధవారం (డిసెంబర్ 24) వరకు కొనసాగుతుంది. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను సంస్థ విస్తరణ, రుణాల చెల్లింపుల కోసం ఉపయోగించనుంది. ఈ నేపథ్యంలో ఈ ఐపీఓకు సంబంధించిన ముఖ్య విషయాలను ఇక్కడ తెలుసుకోండి..
గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ ఐపీఓ ముఖ్యాంశాలు..
ఈ ఐపీఓ షేరు ధరను రూ. 108 నుంచి రూ. 114 గా నిర్ణయించారు. మొత్తం రూ. 250.80 కోట్ల సమీకరణ లక్ష్యంగా 2.20 కోట్ల కొత్త షేర్లను విక్రయిస్తోంది. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) లేకపోవడం గమనార్హం.
అంటే ఈ నిధులన్నీ నేరుగా కంపెనీ ఖాతాకే వెళ్తాయి.
లాట్ సైజ్: కనీసం 128 షేర్లకు దరఖాస్తు చేయాలి. అంటే రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం రూ. 14,592 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
కేటాయింపు: డిసెంబర్ 26న షేర్ల కేటాయింపు జరిగే అవకాశం ఉంది.
లిస్టింగ్: ఈ గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ ఐపీఓ డిసెంబర్ 30న బీఎస్ఈ , ఎన్ఎస్ఈలలో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.
యాంకర్ ఇన్వెస్టర్లు- వీనస్ ఇన్వెసట్మెంట్స్- వీనస్ స్టెల్లర్ ఫండ్, ఖండేల్వాల్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్రాఫ్ట్ ఎమర్జింగ్ మార్కెట్ ఫండ్, పీసీసీ సిటాడెల్ క్యాపిటల్ ఫండ్, నెక్సస్ గ్లోబల్ ఆపర్చ్యునిటీస్ ఫండ్, అర్నెస్టా గ్లోబల్ ఆపర్చ్యునిటీస్ ఫండ్ తదిత యాంకర్ ఇన్వెస్టర్స్ నుంచి ఈ హాస్పిటల్ సంస్థ రూ. 100కోట్ల వరకు నిధులను సమీకరించింది.
షేర్ అలోకేషన్- క్యూఐబీ- 75శాతం, ఎన్ఐఐ- 15శాతం, రీటైల్- 10శాతం.
గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ ఐపీఓ- నిధుల వినియోగం..
స్టాక్ మార్కెట్లో ఐపీఓ ద్వారా వచ్చే నిధులలో దాదాపు రూ. 77 కోట్లను అహ్మదాబాద్లోని పరేఖ్ హాస్పిటల్ కొనుగోలుకు ఉపయోగించనున్నారు. అలాగే వడోదరలో కొత్త హాస్పిటల్ ప్రాజెక్ట్ కోసం రూ. 30.09 కోట్లు, రోబోటిక్ పరికరాల కొనుగోలుకు రూ. 6.82 కోట్లు కేటాయించారు. మరికొంత మొత్తాన్ని రుణాల చెల్లింపులకు వాడనున్నారు.
గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ ఐపీఓ- గ్రే మార్కెట్ ప్రీమియం..
సోమవారం ఉదయం 10.50 గంటల సమయానికి ఈ ఐపీఓ 31 శాతం సబ్స్క్రైబ్ అయ్యింది. రిటైల్ విభాగంలో 1.36 రెట్లు దరఖాస్తులు అందాయి.
మరో వైపు గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ ఐపీఓ జీఎంపీ (గ్రే మార్కెట్ ప్రీమియం) షేరుకు రూ. 7 ప్రీమియం నడుస్తోంది. దీని ప్రకారం ఈ ఐపీఓ రూ. 121 వద్ద లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.
అయితే.. కేవలం జీఎంపీ ఆధారంగా ఐపీఓలో పెట్టుబడి పెట్టకూడదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ ఐపీఓ- అప్లై చేయాలా? వద్దా?
ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ 'స్వాస్తికా ఇన్వెస్ట్మార్ట్' ఈ ఐపీఓపై జాగ్రత్తగా ఉండాలని ఇన్వెస్టర్లను హెచ్చరించింది! లిస్టెడ్ హాస్పిటల్ రంగంలోని ఇతర కంపెనీలతో పోలిస్తే గుజరాత్ కిడ్నీ వ్యాల్యూయేషన్ (61x P/E) చాలా ఎక్కువగా ఉందని పేర్కొంది. కంపెనీ స్థాయి చిన్నది కావడం వల్ల రిస్క్ కూడా ఉండవచ్చని, దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు ఇప్పుడే కాకుండా, లిస్టింగ్ తర్వాత ధర స్థిరపడ్డాక నిర్ణయం తీసుకోవడం మంచిదని సూచించారు.
కంపెనీ ఆర్థిక పరిస్థితి..
గుజరాత్ ఆధారంగా కార్యకలాపాలు సాగించే ఈ కంపెనీ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వైద్య సేవలను అందిస్తోంది. ఈ సంస్థకి 7 మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు, 4 ఫార్మసీలు ఉన్నాయి.
ఆర్హెచ్పీ ప్రకారం.. ఎఫ్వై26 ఏప్రిల్- జూన్తో ముగిసిన త్రైమాసికంలో ఈ కంపెనీ నెట్ ప్రాఫిట్ రూ. 5.40 కోట్లుగా ఉంది. ఆదాయం రూ. 15.26 కోట్లుగా ఉంది. ఎఫ్వై25 లాభాలు రూ. 9.49కోట్లుగా నమోదయ్యాయి. అదే సమయంలో ఆదాయం రూ. 40.24 కోట్లుగా ఉంది. ఎఫ్వై24లో ఇది కేవలం రూ. 1.71కోట్లుగా ఉండేది.
గుజరాత్ కిడ్నీ ఐపీఓ వివరాలు, గుజరాత్ కిడ్నీ ఐపీఓ ప్రైస్ బ్యాండ్, గుజరాత్ కిడ్నీ జీఎమ్పీ నేడు, ఐపీఓ సబ్స్క్రిప్షన్ స్టేటస్, షేర్ మార్కెట్ అప్డేట్స్.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


