H-1B వీసా ఇంటర్వ్యూలు 2027 వరకు వాయిదా.. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు షాక్
అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కంటున్న భారతీయ టెక్కీలకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ఐటీ నిపుణులకు ఇది చేదు వార్త. H-1B వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలు ఏకంగా 2027 వరకు వాయిదా పడ్డాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాలో ఉన్నవారు ఇండియాకు రావొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో (USA) పని చేయాలనుకునే భారతీయ ఐటీ నిపుణులకు పరిస్థితులు రోజురోజుకీ కఠినంగా మారుతున్నాయి. H-1B వీసా కోసం ఎదురుచూస్తున్న వారికి అమెరికా కాన్సులేట్లు పెద్ద షాక్ ఇచ్చాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్కతాలోని వీసా ఆఫీసుల్లో వచ్చే ఏడాది (2027) వరకు ఇంటర్వ్యూ స్లాట్లు ఖాళీగా లేవని ప్రముఖ మీడియా సంస్థలు ఎన్డీటీవీ, మనీ కంట్రోల్, టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించాయి.
వాయిదాల పర్వం: ఎందుకిలా జరుగుతోంది?
గత డిసెంబర్ లోనే ఈ జాప్యం మొదలైంది. అప్పట్లో షెడ్యూల్ అయిన అపాయింట్మెంట్లను కాన్సులేట్లు మార్చి 2026కు, ఆ తర్వాత అక్టోబర్ 2026కు మార్చాయి. ఇప్పుడు ఏకంగా 2027 వరకు డేట్స్ దొరకని పరిస్థితి నెలకొంది.
దీనికి ప్రధాన కారణం ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలే. "అమెరికా ఫస్ట్" (America First) నినాదంతో అధికారంలో ఉన్న ట్రంప్ సర్కార్, H-1B వీసా జారీ ప్రక్రియలో నిఘాను (Vetting) విపరీతంగా పెంచింది. వీసా దుర్వినియోగాన్ని అరికట్టి, కేవలం అత్యుత్తమ నైపుణ్యాలు ఉన్నవారికే (Best of the Best) అవకాశం ఇవ్వాలన్నది వారి ఉద్దేశం. ఈ స్క్రూటినీ కారణంగానే ప్రాసెసింగ్ సమయం భారీగా పెరిగిపోయింది.
కొత్త నిబంధనలు - టెక్కీలకు సవాళ్లు
2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి "యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్" (USCIS) కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చింది.
వెయిటెడ్ సెలక్షన్ ప్రాసెస్: ఇకపై లాటరీలో అందరికీ సమాన అవకాశాలు ఉండవు. "అధిక నైపుణ్యం, అధిక వేతనం" (Higher-skilled and Higher-paid) ఉన్నవారికే వీసా కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తారు. ఈ రూల్ 2026 ఫిబ్రవరి 27 నుండి అమల్లోకి రానుంది.
సోషల్ మీడియా నిఘా: H-1B, H-4 వీసాదారుల సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని డిసెంబర్ 15, 2025న ఆదేశాలు జారీ అయ్యాయి.
భారీ ఫీజులు: గత ఏడాది సెప్టెంబర్లో అమల్లోకి వచ్చిన $100,000 (సుమారు రూ. 83 లక్షలు) వీసా ఫీజు నిబంధన కంపెనీలకు పెను భారంగా మారింది.
భారతీయులపైనే తీవ్ర ప్రభావం
ప్రపంచవ్యాప్తంగా H-1B వీసాలు పొందే వారిలో భారతీయులే అధికం. 2024 గణాంకాల ప్రకారం, మంజూరైన మొత్తం వీసాల్లో 71% (సుమారు 2.83 లక్షలు) భారతీయులకే దక్కాయి. ఇప్పుడు ఇంటర్వ్యూలు నిలిచిపోవడంతో వేలాది మంది ఐటీ ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.
మూడో దేశానికి (Third Country) వెళ్లి వీసా స్టాంపింగ్ చేయించుకునే వెసులుబాటును కూడా అమెరికా విదేశాంగ శాఖ రద్దు చేసింది. దీంతో అందరూ భారతీయ కాన్సులేట్లపైనే ఆధారపడాల్సి వస్తోంది.
నిపుణుల హెచ్చరిక: "ఇండియాకు రావొద్దు!"
ప్రస్తుత పరిస్థితులపై ఇమిగ్రేషన్ అటార్నీ ఎమిలీ న్యూమాన్ స్పందిస్తూ.. "ప్రస్తుతం అమెరికాలో H-1B వీసాపై ఉన్నవారు స్టాంపింగ్ కోసం ఇండియాకు వెళ్ళే సాహసం చేయొద్దు. వీలైనంత వరకు వీసాలను తిరస్కరించడానికే అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇది బైడెన్ పాలన కాదు, పూర్తిగా భిన్నమైన పరిస్థితి" అని హెచ్చరించారు.
దీనిని బట్టి చూస్తే, అమెరికా వెళ్లాలనుకునే వారు లేదా అక్కడ ఉండి ఇండియా రావాలనుకునే వారు తమ ప్రయాణ ప్రణాళికలను వాయిదా వేసుకోవడం మంచిది.

E-Paper












