అలర్ట్​! అలర్ట్​! చెన్నై సహా తమిళనాడులోని ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన..

తమిళనాడుకు భారీ వర్షాల సూచన! చెన్నైతో పాటు 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యాయి. రానున్న కొన్ని రోజుల్లో ఆయా ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Published on: Nov 16, 2025 10:43 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శ్రీలంక తీరానికి ఆనుకుని, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో చెన్నై సహా తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో నేటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు చెన్నై, తిరువారూరు, నాగపట్నం, కారైకల్ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది ప్రాంతీయ వాతావరణ కేంద్రం. ఈ ప్రాంతాల్లో ఆదివారం నాడు 12 సెం.మీ నుంచి 20 సెం.మీ మధ్య భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. అదనంగా, రామనాథపురం, శివగంగైతో పాటు మరో ఐదు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

తమిళనాడుకు వర్ష సూచన.. (AFP)
తమిళనాడుకు వర్ష సూచన.. (AFP)

పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

వాతావరణ శాఖ తన బుల్లిటెన్​లో.. తమిళనాడులోని అరియలూరు, కడలూరు, మైలాడుతురై, నాగపట్నం, తంజావూరు, తిరువారూరు, విల్లుపురం జిల్లాలతో పాటు పుదుచ్చేరి, కారైకల్‌లలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

నవంబర్ 17న తమిళనాడులో భారీ వర్షాలు ఉంటాయా?

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నవంబర్ 17న తమిళనాడులోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురుస్తాయని అంచనా వేసింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లోని ఒకటి లేదా రెండు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది.

తిరువళ్లూరు, చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, కళ్లకురిచి, కడలూరు, మైలాడుతురై, నాగపట్నం, తిరువారూరు, తంజావూరు వంటి జిల్లాల్లో విస్తృత ప్రాంతంలో కొన్నిచోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా ఉంది.

తాజా వాతావరణ పరిశీలనలు ఏం చెబుతున్నాయి?

అల్పపీడనం కదలిక: శ్రీలంక తీరానికి దూరంగా నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడన ప్రాంతం నవంబర్ 16 ఉదయం 5:30 గంటల సమయానికి దాదాపుగా స్థిరంగా ఉంది.

ఎగువ వాయు ప్రసరణ: వాతావరణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఎయిర్​ సర్క్యులేషన్​ సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా మారుతూ ఉంది. ఈ వ్యవస్థ తరువాత 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉంది.

మరోవైపు దక్షిణ బంగ్లాదేశ్, దాని పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 1.5 కి.మీ వరకు ఒక ఎగువ వాయు చక్రవాత ప్రసరణ (సైక్లోనిక్​ ఎయిర్​ సర్క్యులేషన్​) కొనసాగుతోంది.

అదనంగా ఆగ్నేయ అరేబియా సముద్రం, ఆనుకుని ఉన్న దక్షిణ కేరళ తీరంపై సముద్ర మట్టానికి సుమారు 0.9 కి.మీ వద్ద ఒక చక్రవాత ప్రసరణ చురుకుగా ఉంది.

ఈశాన్య రుతుపవనాల పునరుజ్జీవం: శుక్రవారం గమనించిన ఎగువ వాయు చక్రవాత ప్రసరణ, శనివారం నాటికి శ్రీలంక తీరానికి దూరంగా నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారడం ద్వారా, ఇటీవల తగ్గుముఖం పట్టిన ఈశాన్య రుతుపవనాలను తిరిగి చురుకుగా మారుస్తుందని అంచనా వేస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More