ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం వేదాంత గ్రూపునకు చెందిన ‘హిందుస్థాన్ జింక్’ ఆర్థిక ఫలితాల్లో సరికొత్త రికార్డులను సృష్టించింది. సోమవారం (జనవరి 19) విడుదల చేసిన అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక (క్యూ3) గణాంకాల్లో కంపెనీ అదరగొట్టింది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు అమాంతం పెరగడం, నిర్వహణలో మెరుగైన పనితీరు కనబరచడంతో సంస్థ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా భారీ ఆదాయం, రికార్డు స్థాయి లాభాలను తన ఖాతాలో వేసుకుంది.
ఆకాశమే హద్దుగా లాభాల పంట
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) మూడో త్రైమాసికంలో హిందుస్థాన్ జింక్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన (YoY) ఏకంగా 46.22 శాతం వృద్ధి చెంది రూ.3,916 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ లాభం రూ.2,678 కోట్లుగా మాత్రమే ఉంది. కంపెనీ ఆదాయం, ఎబిటా (EBITDA) రికార్డు స్థాయిలో పెరగడమే ఈ చారిత్రాత్మక లాభాలకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇక ఆదాయం విషయానికొస్తే.. గతేడాది రూ.8,315 కోట్లుగా ఉన్న కార్యకలాపాల ఆదాయం, ఈసారి 27.80 శాతం పెరిగి రూ.10,627 కోట్లకు చేరింది. త్రైమాసిక ప్రాతిపదికన (QoQ) చూసినా, ఆదాయంలో 28 శాతం, లాభంలో 48 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం.
వెండి వెలుగులు.. పెరిగిన మార్జిన్లు
కంపెనీ లాభదాయకతలో వెండి కీలక పాత్ర పోషించింది. "మా మొత్తం లాభాల్లో వెండి వంటి విలువైన లోహాల వాటా ఈ త్రైమాసికంలో 44 శాతానికి పెరిగింది" అని హిందుస్థాన్ జింక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) సందీప్ మోడీ వివరించారు.
కంపెనీ నిర్వహణ లాభం (EBITDA) 34 శాతం వృద్ధి చెంది రూ.6,087 కోట్లుగా నమోదైంది. కేవలం లాభాలు పెరగడమే కాకుండా, ఎబిటా మార్జిన్లు 55 శాతానికి చేరుకోవడం ఆ రంగానికి చెందిన నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇది పరిశ్రమలోనే అత్యుత్తమ మార్జిన్ కావడం గమనార్హం.
భవిష్యత్తుపై ధీమా
బలమైన బ్యాలెన్స్ షీట్, క్రమశిక్షణతో కూడిన నిర్వహణ, తక్కువ ఉత్పత్తి వ్యయం వంటి అంశాలు తమకు కలిసొచ్చాయని కంపెనీ యాజమాన్యం పేర్కొంది. రాబోయే రోజుల్లోనూ ఇదే జోరును కొనసాగిస్తూ పెట్టుబడిదారులకు మెరుగైన రాబడులను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సంస్థ ధీమా వ్యక్తం చేసింది.
{{/usCountry}}బలమైన బ్యాలెన్స్ షీట్, క్రమశిక్షణతో కూడిన నిర్వహణ, తక్కువ ఉత్పత్తి వ్యయం వంటి అంశాలు తమకు కలిసొచ్చాయని కంపెనీ యాజమాన్యం పేర్కొంది. రాబోయే రోజుల్లోనూ ఇదే జోరును కొనసాగిస్తూ పెట్టుబడిదారులకు మెరుగైన రాబడులను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సంస్థ ధీమా వ్యక్తం చేసింది.
{{/usCountry}}సోమవారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి హిందుస్తాన్ జింక్ 3.53 శాతం లాభపడింది.