భారత నావికాదళం దేశ సముద్ర ప్రయోజనాలను కాపాడటంలో అప్రమత్తంగా ఉంది : రాష్ట్రపతి
భారత నావికాదళం దేశ సముద్ర ప్రయోజనాలను కాపాడటంలో అప్రమత్తంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఐఎఫ్ఆర్లో భాగంగా ఐఎన్ఎస్ సుమేధ నౌకపై రాష్ట్రపతి ప్రయాణించారు.
భారత నావికాదళం దేశ సముద్ర ప్రయోజనాలను కాపాడటంలో అప్రమత్తంగా ఉందని, విస్తృత సముద్ర వాణిజ్యంలో స్థిరత్వానికి దోహదపడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. విశాఖపట్నం తీరంలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (IFRలో రాష్ట్రపతి పాల్గొన్నారు. సముద్రంలో తలెత్తే ముప్పులు, సవాళ్లకు వ్యతిరేకంగా భారత నావికాదళం ఈ ప్రాంతంలో మోహరించిందన్నారు.

'భారత నావికాదళం భారతదేశ సముద్ర ప్రయోజనాలను కాపాడటంలో అప్రమత్తంగా ఉంది. విస్తృత సముద్ర వాణిజ్యంలో స్థిరత్వానికి దోహదపడుతోంది.' అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నావికాదళాలతో సద్భావనను పెంపొందించడంలో నమ్మకం, విశ్వాసం, స్నేహాన్ని నిర్మించడంలో భారత నావికాదళం కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. భారత నౌకాదళం తూర్పు నౌకాదళ కమాండ్ (ENC) ఉన్న విశాఖపట్నం అద్భుతమైన సముద్ర చరిత్రను కలిగి ఉందని అన్నారు. ఐఎఫ్ఆర్ కార్యక్రమం విశాఖపట్నం శాశ్వత నౌకాదళ ప్రాముఖ్యతను నొక్కి చెబుతుందని వ్యాఖ్యానించారు.
అద్భుతమైన యుద్ధనౌకలను, నావికాదళ సిబ్బంది, ఇతర ప్రదర్శనలను వీక్షించి రాష్ట్రపతి అభినందించారు. సముద్ర సంప్రదాయాల పట్ల దేశాల మధ్య ఐక్యత, నమ్మకం, గౌరవాన్ని ఐఎఫ్ఆర్ ప్రతిబింబిస్తుందని చెప్పారు. వివిధ జెండాలు కలిగిన ఓడలు, వివిధ దేశాల నావికులు కలిసి ఉండే స్ఫూర్తిని ప్రదర్శిస్తారని అన్నారు. మహాసముద్రాలను భారతదేశానికి వాణిజ్యం, అనుసంధానం, సాంస్కృతిక మార్పిడి మార్గాలుగా అభివర్ణించారు.
అంతకుముందు విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భాగంగా ఆరు వరుసల్లో 71 యుద్ధ నౌకలు పరేడ్ నిర్వహించాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఇందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నేవీ సిబ్బంది నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఐఎన్ఎస్ సుమేధ నౌకపై రాష్ట్రపతితోపాటుగా గవర్నర్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రయాణించారు. 18 విదేశీ నౌకలు, భారత నేవీకి చెందిన 45 నౌకలు, కోస్ట్గార్డ్, మర్చంట్ నేవీ, పరిశోధన నౌకలు 7 ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నాయి.

E-Paper












