ఐఐఎం బెంగళూరులో పర్సనల్ ఫైనాన్స్ కోర్సు.. సర్టిఫికేట్ పొందితే అనేక ప్రయోజనాలు!
పర్సనల్ ఫైనాన్స్ కోర్సును ప్రారంభించింది ఐఐఎం బెంగళూరు. ఫైనాన్షియల్ ప్లానర్గా కెరీర్ నిర్మించుకునే వారికి ఇది మంచి అవకాశం! పూర్తి వివరాలను ఇక్కడ డీటైల్డ్గా తెలుసుకోండి..
మారుతున్న ఆర్థిక పరిస్థితుల్లో వ్యక్తిగత పొదుపు, పెట్టుబడులపై సరైన అవగాహన కల్పించేందుకు ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఐఐఎం బెంగళూరు (ఐఐఎంబీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ (ఎఫ్పీఎస్బీ) ఇండియాతో కలిసి 'పర్సనల్ ఫైనాన్స్ అండ్ వెల్త్ అడ్వైజరీ' (పీఎఫ్డబ్ల్యూఏ) అనే సర్టిఫికేట్ కోర్సును ప్రారంభించింది.

ఐఐఎంబీకి చెందిన 'సెంటర్ ఫర్ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్' (సీసీఎంఆర్ఎం) ఈ కోర్సును నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ కోర్సు కోసం దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. మార్చి 2026 నుంచి తరగతులు మొదలవుతాయి.
ఐఐఎంబీలో పర్సనల్ ఫైనాన్స్ కోర్సు- ప్రత్యేకత లు..
ప్రస్తుతం సామాన్య ప్రజలు కూడా స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఆర్థిక రంగానికి సంబంధించిన చిక్కుముడులను విప్పి, పెట్టుబడిదారులకు సరైన సలహాలు ఇచ్చే నిపుణుల కొరత మాత్రం మార్కెట్లో ఉంది. ఈ లోటును పూడ్చేందుకే ఐఐఎం బెంగళూరు ఈ కోర్సును రూపొందించింది.
ఈ కోర్సులో భాగంగా.. కేవలం పుస్తక పాఠాలే కాకుండా, బ్లూమ్బెర్గ్ డేటా సెట్స్ వంటి అత్యాధునిక టూల్స్ ద్వారా నిజమైన మార్కెట్ విశ్లేషణను విద్యార్థులకు నేర్పిస్తారు.
మైక్రో ఎకనామిక్స్, బిజినెస్ డెసిషన్స్ తీసుకోవడం, నేటి కాలానికి తగిన ఫైనాన్షియల్ అడ్వైజరీ పద్ధతులపై శిక్షణ వంటివి ఈ కోర్సులో ఉంటాయి.
మారుతున్న నిబంధనలు, మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుని క్లయింట్లకు ఎలా సలహాలు ఇవ్వాలో ఇక్కడ నేర్చుకోవచ్చు.
ఐఐఎంబీలో పర్సనల్ ఫైనాన్స్ కోర్సు- కెరీర్ ప్రయోజనాలు..
ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఐఐఎం బెంగళూరు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ అలుమ్నీ హోదా లభిస్తుంది. అంతేకాకుండా:
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన 'సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్' (సీఎఫ్పీ) సర్టిఫికేట్ పొందాలనుకునే వారికి, ఎఫ్పీఎస్బీ ఇండియా నిబంధనల ప్రకారం ఇది ఒక సులువైన మార్గంగా మారుతుంది.
ఎఫ్పీఎస్బీ నివేదికల ప్రకారం.. ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ఉన్న ఆర్థిక సలహాదారుల సంపాదన, క్లయింట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు తమ పొదుపు మొత్తాలను తెలివిగా పెట్టుబడి పెట్టాలని చూస్తున్నాయి. ఇలాంటి సమయంలో నైతిక విలువలతో కూడిన, నమ్మకమైన ఆర్థిక సలహాదారులు చాలా అవసరం. ఐఐఎం బెంగళూరు లాంటి సంస్థలు అందించే ఈ శిక్షణ ద్వారా దేశంలో ఆర్థిక సలహాదారుల రంగం మరింత బలోపేతం కానుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper












