మీ సోషల్ మీడియా, ఈమెయిల్స్పై ఆదాయపు పన్ను శాఖ కన్నేస్తుందా? వైరల్ వార్తల్లో నిజమెంత?
ఏప్రిల్ 2026 నుంచి ఆదాయపు పన్ను శాఖ పౌరుల సోషల్ మీడియా, ఈమెయిల్ ఖాతాలను పరిశీలిస్తుందన్న వార్తలపై పిఐబి (PIB) స్పందించింది. ఇవి కేవలం అపోహలని, కేవలం సోదాలు, సర్వేల సమయంలోనే పరిమిత అధికారాలు ఉంటాయని స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. 2026 ఏప్రిల్ 1 నుంచి ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ మీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఖాతాలతో పాటు, వ్యక్తిగత ఈమెయిల్స్ను కూడా తనిఖీ చేసే అధికారం పొందుతుందని ఆ వార్త సారాంశం. పన్ను ఎగవేతను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ప్రచారంలో అసలు నిజమెంత ఉందో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) తన ఫ్యాక్ట్-చెక్ నివేదికలో వెల్లడించింది.

అసలు విషయం ఏంటంటే?
"సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉంది. ఆదాయపు పన్ను చట్టం 2025లోని సెక్షన్ 247 ప్రకారం.. డిజిటల్ డేటాను సేకరించే అధికారం కేవలం 'సెర్చ్ అండ్ సర్వే' (సోదాలు) నిర్వహించేటప్పుడు మాత్రమే ఉంటుంది" అని పిఐబి స్పష్టం చేసింది. అంటే, ఎవరైతే భారీగా పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారని ఆధారాలు ఉండి, వారిపై అధికారికంగా సోదాలు జరుగుతాయో, వారి విషయంలోనే ఈ నిబంధన వర్తిస్తుంది.
సామాన్య పౌరులు భయపడాలా?
సాధారణ పన్ను చెల్లింపుదారులు లేదా నిజాయితీగా పన్నులు కట్టే పౌరులు తమ వ్యక్తిగత డిజిటల్ ప్రైవసీ గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
"భారీ పన్ను ఎగవేతలకు సంబంధించి పక్కా ఆధారాలు ఉండి, సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంటే తప్ప, సాధారణ పౌరుల ప్రైవేట్ డిజిటల్ స్పేస్లోకి ప్రవేశించే అధికారం విభాగానికి లేదు" అని నివేదిక పేర్కొంది. రొటీన్ సమాచార సేకరణ కోసం లేదా సాధారణ స్క్రూటినీ అసెస్మెంట్ కోసం ఈమెయిల్స్, సోషల్ మీడియాను చెక్ చేసే అధికారం అధికారులకు ఉండదు.
పాత చట్టానికి, కొత్త చట్టానికి తేడా ఏంటి?
సుమారు ఆరు దశాబ్దాల కాలం నాటి 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం 'ఆదాయపు పన్ను బిల్లు 2025'ను తీసుకువచ్చింది. ఇది 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది.
పాత చట్టం: 1961 చట్టం ప్రకారం కూడా సోదాల సమయంలో డాక్యుమెంట్లు, పరికరాలను స్వాధీనం చేసుకునే అధికారం అధికారులకు ఉండేది.
కొత్త చట్టం: కొత్త బిల్లులోనూ అవే నిబంధనలు కొనసాగుతున్నాయి. అయితే, అదనంగా ఒక అంశాన్ని చేర్చారు. విచారణ సమయంలో కంప్యూటర్లు లేదా డిజిటల్ పరికరాలకు 'యాక్సెస్ కోడ్స్' (పాస్వర్డ్స్) ఉంటే, వాటిని అధిగమించి సమాచారాన్ని సేకరించే వెసులుబాటును అధికారులకు కల్పించారు.
నిపుణుల అభిప్రాయం
కొత్త బిల్లులో నేరుగా "వర్చువల్ డిజిటల్ స్పేస్" అని పేర్కొననప్పటికీ, కంప్యూటర్ సిస్టమ్స్ అనే నిర్వచనంలోకి ఈమెయిల్స్, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు వస్తాయని నిపుణులు భావిస్తున్నారు. పన్ను ఎగవేత అనుమానాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ డిజిటల్ ఖాతాలను అధికారులు పరిశీలించే అవకాశం ఉంటుంది. ఇది కొంతవరకు గోప్యతకు సంబంధించిన చర్చకు దారితీసినా, నిబంధనలు మాత్రం కేవలం అక్రమార్కులను పట్టుకోవడానికేనని స్పష్టమవుతోంది.
కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను నమ్మకుండా, అది కేవలం సోదాలకు సంబంధించిన నిబంధన అని గుర్తించడం ముఖ్యం. నిజాయితీ గల పౌరుల ప్రైవసీకి ఎలాంటి భంగం కలగదని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది.

E-Paper












