IND vs NZ : సంచలన రికార్డుల వేటలో రోహిత్​- కోహ్లీ.. ఫ్యాన్స్​ గెట్​ రెడీ

నేటి నుంచి భారత్-న్యూజిలాండ్ మధ్య వన్డే పోరు ప్రారంభం కానుంది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పలు చారిత్రక రికార్డులను బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ ఆసక్తికర గణాంకాలు మీకోసం..

Published on: Jan 11, 2026, 10:02:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకున్న టీమిండియా, ఇప్పుడు కివీస్‌తో పోరుకు సిద్ధమైంది. నేడు (జనవరి 11) వడోదర వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. వన్డే క్రికెట్​ అనగానే ఇప్పుడు అందరి దృష్టి విరాట్​ కోహ్లీ, రోహిత్​ శర్మలపైనే ఉంటోంది. టీ20, టెస్టులకు ఇద్దరు రిటైర్మెంట్​ ప్రకటించడంతో తమ ఫేవరెట్​​ ప్లేయర్లను కనీసం వన్డేల్లో అయినా చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. సిరీస్​ కేవలం మూడు వన్డేలే ఉండటంతో వీరిద్దరు రాణించాలని ఫ్యాన్స్​ భావిస్తున్నారు. అంతేకాదు ఈ సిరీస్​లో కోహ్లీ, రోహిత్​ పలువురు దిగ్గజాల రికార్డులపై కన్నేశారు. అవి బ్రేక్​ అయితే ఫ్యాన్స్​కి పండగే!

విరాట్​ కోహ్లీ- రోహిత్​ శర్మ.. (REUTERS)
విరాట్​ కోహ్లీ- రోహిత్​ శర్మ.. (REUTERS)

విరాట్ కోహ్లీ: క్రికెట్ చరిత్రలో మరో సంచలనం!

ఇండియా వర్సెస్​ న్యూజిలాండ్​ సిరీస్‌లో విరాట్ కోహ్లీ ముందు అనేక రికార్డులు నిలబడ్డాయి. ముఖ్యంగా న్యూజిలాండ్‌పై అత్యధిక వన్డే పరుగులు చేసిన భారత ఆటగాడిగా క్రికెట్​ గాడ్​ సచిన్ టెండూల్కర్ (1,750 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం 1,657 పరుగులతో ఉన్న కోహ్లీ, మరో 94 పరుగులు చేస్తే సచిన్ రికార్డును దాటి ఈ లిస్ట్​లో టాప్ స్కోరర్‌గా నిలుస్తాడు.

అంతేకాదు, అంతర్జాతీయ క్రికెట్‌లో (టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి) కోహ్లీ ఇప్పటివరకు 27,975 పరుగులు చేశాడు. మరో 25 పరుగులు సాధిస్తే 28,000 పరుగుల మైలురాయిని అందుకున్న దిగ్గజాల సరసన చేరుతాడు. ఒకవేళ ఈ సిరీస్‌లోనే ఆ ఘనత సాధిస్తే సచిన్ టెండూల్కర్ (644 ఇన్నింగ్స్‌లు), కుమార సంగక్కర (666 ఇన్నింగ్స్‌లు) కంటే వేగంగా ఈ మైలురాయిని చేరిన ప్లేయర్‌గా కింగ్​ కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడు.

మరోవైపు శ్రీలంక లెజెండ్ సంగక్కర తన కెరీర్‌లో మొత్తం 28,016 పరుగులు చేశాడు. కోహ్లీ మరో 42 పరుగులు చేస్తే సంగక్కరను వెనక్కి నెట్టి, ప్రపంచ క్రికెట్‌లో సచిన్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలుస్తాడు. ఇక వన్డేల్లో 15 వేల పరుగుల మైలురాయికి కోహ్లీ 443 పరుగుల దూరంలో ఉన్నాడు. మూడు మ్యాచ్‌ల్లో ఇది కొంచెం కష్టమనే చెప్పుకోవాలి.

రోహిత్ శర్మ: కాలీస్ రికార్డుకు చేరువలో..

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. వన్డేల్లో ఇప్పటివరకు 11,516 పరుగులు చేసిన హిట్ మ్యాన్.. దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్వస్ కాలీస్ (11,579) రికార్డును అధిగమించేందుకు కేవలం 64 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇది సాధిస్తే వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ ఎనిమిదో స్థానానికి చేరుకుంటాడు.

అలాగే 12,000 పరుగుల మైలురాయిని అందుకోవాలంటే రోహిత్‌కు ఇంకా 484 పరుగులు అవసరం.

2027 ప్రపంచకప్ దిశగా భారత్ వేస్తున్న అడుగుల్లో ఈ సిరీస్ అత్యంత కీలకం కానుంది! సీనియర్ ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డులతో పాటు జట్టు సమతుల్యతపై కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ తన 28,000 పరుగుల మైలురాయిని మొదటి వన్డేలోనే అందుకుంటాడా? కాలీస్​ రికార్డును రోహిత్​ బ్రేక్​ చేస్తాడా? వేచి చూడాలి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More